అసలే పోలీసు ఆపై పోటా
పోటా వంటి చట్టాల అవసరం లేకుండానే వున్న చట్టాలను తమ చేతుల్లోకి తీసుకుని తెలంగాణా జిల్లాల్లో ఖమ్మం, విశాఖపట్నం, గోదావరి జిల్లాల ఎజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు తమ చిత్తాను సారం ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు వున్నాయి. బోగస్ ఎన్కౌంటర్లు, అరెస్టులు, చిత్రహింసలకు సంబంధించి అనేక ఆరోపణలు పోలీసులపై వున్నాయి. జాతీయ మానవహక్కుల సంఘం కూడా పలు కేసులపై దర్యాప్తు జరుపతున్నది. పోలీసుల ఆకృత్యాలపై పౌరహక్కుల సంఘాలు, మానవహక్కుల సంఘాలు చాలా కాలంగానే గగ్గోలు పెడుతున్నాయి. ఇప్పటివరకు సాయుధ నక్సల్స్ను వారికి మద్దతుదారులుగా వున్న మిలిటెంట్లను మాత్రమే టార్గెట్ చేసిన పోలీసులు గత కొంతకాలంగా సానుభూతిపరులపై కూడా దృష్టి నిలిపారు. పౌరహక్కుల సంఘాన్నైతే ఏకంగా నక్సలైట్ సంస్థగానే ప్రకటించి దాడులు చేస్తున్నారని పౌరహక్కుల సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణా జిల్లా టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులను కూడా పోలీసులు వదిలిపెట్టడం లేదు. నక్సల్స్తో సంబంధాలు వున్నట్టుగా ఏ మాత్రం అనుమానం వచ్చినా వారిని ఉద్యోగాలకు రాజీనామా చేయాల్సిందిగా హెచ్చరించడం నుంచి ప్రారంభించి అర్ధరాత్రి ఇళ్లపై దాడులు చేసి బెదిరించడం వరకు చేస్తున్నారని ఆరోపణలు వున్నాయి. జర్నలిస్టులు కూడా బాధితులే. తమకు ఫేస్ నచ్చని వారిని, హక్కుల కోసం మాట్లాడేవారిని, గిట్టని వారిని, వ్యక్తిగత శత్రువులను అందరినీ నక్సల్స్ ముద్రతో బెదిరించి వేధించడం పోలీసులకు నిత్యకృత్యంగా మారిందని మానవహక్కుల వేదిక ఆరోపిస్తున్నది.