చంద్రబాబు ఏకస్వామ్య సదస్సు
పూర్వం ఆంధ్రదేశానికి తూర్పున ఉన్న ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణ కరణం ఉండేవాడట. ఆయనకు ప్రమాదవశాత్తు కళ్లు పోయాయి. ఆయనకో కూతురు. చక్కని చుక్క. ఆమె మీద ఓ చండాలుడు కన్ను వేశాడు. ఎవరినో ఆశ్రయించి వేదాలు నేర్చుకుని సద్బ్రాహ్మణుడి వేషంలో గ్రామాన అడుగుపెట్టాడు. అతడి వేషభాషలకు మోసపోయిన ఊరిజనం పిల్లనిచ్చి, కరణీకాన్ని కూడా అప్పగించమని గ్రామాధికారికి సలహా ఇచ్చారు. ఆయనా సరేనని వేదోక్తంగా యధావిధిగా వివాహం జరిపించాడు. కాలక్రమంలో దంపతులకు కొడుకులు, కూతుళ్ళు కూడా పుట్టాక ఓనాడు కపటబ్రాహ్మడి స్వస్థలం నుంచి ఎవరో అటుకేసి వచ్చి, అతగాడిని పోల్చుకుని, వెనక్కి వెళ్ళాక అతని తల్లి చెవిన వేశారు. కొడుకు ఆచూకీ తెలియక అల్లాడుతున్న తల్లి వెంటనే పరుగున వెళ్ళింది. ఊరి బావి వద్ద తారసపడ్డ సుపుత్రుడు తల్లిని గుర్తుపట్టి చప్పున ఆమె తల గొరిగించి, జుమారు కట్టించి బ్రాహ్మణ వితంతువు వేషం వేయించాడు. ఆమె మాట్లాడితే గుట్టు బయటపడుతుంది. కనుక మూగదానిలా నటించాలని కట్టడిచేసి ఇంటికి తీసుకుపోయాడు. అత్తగారన్న భక్తితో కోడలు ఆమెకు సేవలు చేయసాగింది.