యురేనియం గండం
అయితే ఈ ప్రయత్నాలను కొన్ని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మేధావులు, పౌర హక్కుల నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ప్రజాభిప్రాయసేకరణకు నడుం బిగించారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా ఇటీవల తీవ్ర గందరగోళం చెలరేగింది. ప్రజాభిప్రాయాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి యురేనియం కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు మద్యం, డబ్బులు వెదజల్లినట్లు ఆరోపణలు కూడా వచ్చాయి.
2020 నాటికి 20 వేల మెగావాట్ల అణు విద్యుత్తును ఉత్పత్తి చేయాలని కేంద్రప్రభుత్వం అణు ఇంధన సంస్థను ఆదేశించింది. ప్రస్తుతం 14 అణు రియాక్టర్ల ద్వారా 2,720 మెగావాట్ల అణు విద్యుత్తు ఉత్పత్తి అవుతోంది. మరో 3,960 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం గల ప్లాంట్లు నిర్మాణంలో ఉన్నాయి. దానికి తోడు 13,144 మెగావాట్ల విద్యుదుత్పత్తికి ప్లాంట్ల నిర్మాణం చేపట్టాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే అణు ఇంధన సంస్థ అనుబంధ సంస్థ యురేనియం కార్పోరేషన్ ఆఫ్ ఇండియా యూరేనియం నిక్షేపాల కోసం అన్వేషణ ప్రారంభించింది.
ఆంధ్రప్రదేశ్లోని నల్లగొండ జిల్లాలోనూ, మేఘాలయలోని పశ్చిమ కాశీలో యురేనియం నిక్షేపాలున్నట్లు తేల్చింది. ఈ రెండు చోట్ల నిక్షేపాల తవ్వకాన్ని చేపట్టాలని నిర్ణయించింది. అయితే పశ్చిమ కాశీలో ఆదివాసీల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. దీంతో అక్కడ తన ప్రయత్నాలను విరమించుకుంది. ఆంధ్రప్రదేశ్లో తన పనిని ప్రారంభించే ప్రయత్నంలో పడింది. ఈ స్థితిలో ఇక్కడ కూడా వ్యతిరేకత పెద్ద యెత్తున ఎదురువుతోంది. కాలుష్య నియంత్రణ సంస్థ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతిస్తే తవ్వకాలు ప్రారంభమవుతాయి.
అయితే యురేనియం కార్పోరేషన్కు ప్రతిపక్షాల నుంచి చుక్కెదరవుతోంది. కాంగ్రెస్తో పాటు ప్రతిపక్షాలన్నీ యురేనియం నిక్షేపాల వెలికితీతకు వ్యతిరేకంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పెదవి విప్పడం లేదు. నల్లగొండ జిల్లాకు ఉమా మాధవరెడ్డి గనుల శాఖ మంత్రిగా ఉన్నారు. ఆమె కూడా ఈ విషయంలో పెదవి విప్పడం లేదు. ఈ విషయంలో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు లేఖ రాశారు. దానికి ప్రతిస్పందన లేదు.
జార్ఖండ్లోని జాదుగూడా ప్రాంతంలోని దుష్పరిణామాలే ఇక్కడ పునరావృతం అవుతాయని యురేనియం నిక్షేపాల వెలికితీతను వ్యతిరేకిస్తున్న వర్గాలంటున్నాయి. జాదుగుడాలో ఆదివాసీలు పలు అనారోగ్యాలకు గురవుతున్నారని, భద్రతా చర్యలు కూడా పాటించడం లేదని వారంటున్నారు. రేడియో ధార్మికత వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుందని రెడ్క్రాస్ ఇనిస్టిట్యూట్ ఆప్ యోగా అండ్ నేచర్ క్యూర్ ప్రతినిధి డాక్టర్ సత్యలక్ష్మి వాదిస్తున్నారు. యురేనియం మైనింగ్లో రేడాన్- 222 అనే వాయువు వెలువడుతుంది. దీని వల్ల నాగార్జున సాగర్, అక్కంపల్లి రిజర్వాయర్లకు కూడా ముప్పు వాటిల్లే అవకాశం ఉంది.
నల్లగొండ జిల్లాలో 1337 ఎకరాల్లో యురేనియం నిక్షేపాలున్నట్లు బయట పడింది. ఇందులో 197 ఎకరాలు సాగుభూమి కాగా, మిగతాది ఎల్లాపురం ఫారెస్టు ఏరియా. ఇది నాగార్జున సాగర్కు 5 కిలోమీటర్ల సమీపంలో, తలపెట్టిన యురేనియం శుద్ధి కర్మాగారం అక్కంపల్లి రిజర్వాయర్కు 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. మైనింగ్ ప్రాంతం సముద్ర మట్టానికి 400 కిలోమీటర్ల ఎత్తులో, నాగార్జున సాగర్ 180 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నాయి. ఈ స్థితిలో నాగార్జున సాగర్ జలాలు తీవ్ర కాలుష్యానికి గురయ్యే ప్రమాదం ఉంది.