ఢిల్లీలో వెలగని చంద్రుడు
నిజానికి సిఎన్ఎన్, బిబిసి, సిఎన్బిసి వంటి ఛానల్స్ ఒక రకంగా అమెరికా ప్రచారానికి తోడ్పడుతున్నాయి. ఇరాక్ కోణం నుండి, అరబ్ ప్రజా ఆలోచనా కోణం నుండి అవి ఆలోచించడం లేదు. సిఎన్ఎన్, బిబిసి, సిఎన్బిసినే కాదు, అరబ్ ఛానల్స్ అయిన ఆల్- జజీరా, అబూ దాబి టెలివిజన్, జోర్డాన్ ఛానల్స్ని విప్లవ రెడ్డి చూస్తే మంచిది. అప్పుడే ప్రస్తుతం ప్రజలు ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారు, ప్రజా ఆలోచన ఏ విధంగా ఉన్నదీ అని, సంపాదకులు, జర్నలిస్టుల భావాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రజల ఆలోచనా కోణంలో అవి సాగుతున్నాయా అనే విషయం విప్లవ రెడ్డికి అర్థం అవుతుంది. సెప్టెంబర్ 11 దాడులు జరిగినప్పుడు ప్రపంచవ్యాప్తంగా బిన్ లాడెన్ని సంపాదకులు తిట్టిపోయడం మనం చూశాం. ఇక ఇరాక్ కోణం నుండి వద్దాం. ఇరాక్లో రకరకాల తెగలున్నాయి. మన దేశంలో మతాల కోసం, కులాల కోసం ఏ విధంగా కొట్లాడుకుంటున్నారో, కొన్ని మతాలను, కులాలను ఏ విధంగా రాజకీయ నాయకులు అణగదొక్కుతున్నారో, అదే విధంగా ఇరాక్లోనూ జరుగుతున్నది. పదవుల కోసం కుట్రలు కుతంత్రాలు అనాది నుండి ప్రపంచంలో జరుగుతున్నాయి. అలా జరిగినప్పుడు విచక్షణ రహితంగా అధికారంలో ఉన్న వారు వాటిని అణచివేయడం కూడా బహిరంగంగానే జరుగుతున్నది. ఇటువంటి దురాగతాలను స్థానిక ప్రజలే తిరుగుబాటు రూపంలో ఎదిరించాలి. ఏ రాజ్యంలో అయినా ప్రజలు దురాగతాలను భరించలేనప్పుడు తప్పకుండా ఎదురు తిరుగుతారు.