పాంటింగ్ నుంచి ధోనీ నేర్చుకుంటాడా?
చాంపియన్స్ ట్రోఫీ జట్ల కూర్పు విషయానికి వస్తే ధోనీకి, పాంటింగ్ కు ఒకే రకమైన ఇబ్బందులు ఎదురయ్యాయి. ధోనీ నాయకత్వంలోని భారత జట్టులో మ్యాచ్ ను గెలిపించే ఆటగాళ్లు ఈసారి లేరు. పాంటింగ్ జట్టులోనూ యువకులున్నారు. కానీ పాంటింగ్ యువకుల్లోని ఉత్సాహాన్ని ఆటలో ప్రదర్శించేలా ప్రోత్సహించాడు. గెలవాలనే తపనను నూరిపోశాడు. గత రెండేళ్లుగా ఆస్ట్రేలియా జట్టును ఓడించడం తేలిక అనే అభిప్రాయం వచ్చేసింది. కంగారూల ఆధిపత్యానికి తెర పడింది. దేశంలోనూ, దేశం వెలుపలా ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ ల్లో ఓటమి చవి చూసింది. యాషెస్ సిరీస్ ను కూడా కోల్పోయింది. చివరి నిమిషంలో ఆస్ట్రేలియా చాంపియన్స్ ట్రోఫీకి వచ్చింది. జట్టులో మైకెల్ క్లార్క్, బ్రాడ్ హాడిన్, నాథన్ బ్రాకెన్ లేరు.ఆస్ట్రేలియా ఓటమిని ప్రపంచ వ్యాప్తంగా అందరూ కోరుకునే పరిస్థితి వచ్చింది. అంతగా ఆస్ట్రేలియా విజయాలు బోర్ కొట్టించాయి. చాంపియన్స్ ట్రోఫీలోనూ కంగారూలు గెలవకూడదనే చాలా మంది అనుకుని ఉంటారు.
అయితే, అందరి అంచనాలకు భిన్నంగా పాంటింగ్ జట్టు ట్రోఫీని గెలుచుకుంది. ఈ క్రెడిట్ అంతా కెప్టెన్ పాంటింగ్ కు దక్కాల్సిందే. తన జట్టు స్థాయిని పెంచాడు. నాట్ వెస్ట్ సిరీస్ నుంచి జట్టును చాంపియన్స్ ట్రోఫీకి అతను సిద్ధం చేస్తూ వచ్చాడు. గతంలో ఆత్మవిశ్వాసం కొరవడిన ఆటగాళ్లకు కూడా అతను ధైర్యాన్ని నూరిపోశాడు. ఇందుకు షేన్ వాట్సన్ ను ఉదాహరణగా చెప్పవచ్చు. అయితే చాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ కు చేరుకోవడం ఆస్ట్రేలియాకు సులభమేమీ కాలేదు. అయితే కీలకమైన సమయాల్లో అందరు ఆటగాళ్లు తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. జట్టును విజయతీరాలకు చేర్చారు. పాకిస్తాన్ పై బ్రెట్ లీ బ్యాటింగ్ చేసిన తీరు జట్టు సభ్యుల ఆటతీరుకు అద్దం పడుతుంది.
భారత జట్టు అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించింది. జట్టు సభ్యులకు ఆత్మవిశ్వాసాన్ని నూరిపోయడంలో ధోనీ విఫలమయ్యాడు. సెహ్వాగ్, యువరాజ్ సింగ్ వంటి వారు ఉన్నప్పుడు గెలవడం లెక్కలోకి రాదు. జూనియర్స్ తో గెలవడం లెక్కలోకి వస్తుంది. జట్టు సభ్యులను విజయం దిశగా ధోనీ నడిపించలేకపోయాడు.