భారత క్రికెట్ లో ఉత్తరాది ఆధిపత్యం
పంజాబ్ నుంచి హర్భజన్, యువరాజ్ సింగ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ముంబై నుంచి సచిన్ టెండూల్కర్ ఒక్కడే జట్టులో ఉన్నాడు. ఒకప్పుడు భారత క్రికెట్ జట్టు అంటే ముంబై జట్టు అనే విధంగా ఉండేది. కుంబ్లే, రాహుల్ ద్రావిడ్ ల తర్వాత బెంగుళూర్ కు కూడా తగిన ప్రాతినిధ్యం లేదు. చెన్నైకి, హైదరాబాదుకు మొండిచెయ్యే చూపుతున్నారు. బిసిసిఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్ గా చెన్నైకి చెందిన కృష్ణమాచారి శ్రీకాంత్ ఉన్నప్పటికీ లాభం లేకుండా పోతోంది. భారత జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి, శ్రీకాంత్ కు మధ్య పడడం లేదనే ప్రచారం సాగుతోంది. జట్టు కూర్పులో మునుపటిలా కాకుండా ధోనీ పూర్తిగా ఆధిపత్యం చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇర్ఫాన్ పఠాన్ ను పట్టుబట్టి ధోనీ జట్టునుంచి తప్పించినట్లు చెబుతారు. యూసుఫ్ పఠాన్ కు కూడా ఉద్వాసన పలికారు.
రోహిత్ శర్మకు తగిన సమయం ఇవ్వకుండా జట్టు నుంచి తొలగించారు. రోహిత్ శర్మ బ్యాటింగ్ లోనే కాకుండా బౌలింగ్ లోనూ ప్రతిభ చూపుతున్నాడు. అయితే అతని బ్యాటింగ్ స్థానంలో మార్పు చేసి చివరకు జట్టు నుంచే తప్పించారు. గతంలో హైదరాబాద్ బ్యాట్స్ మన్ వివియస్ లక్ష్మణ్ విషయంలో కూడా బిసిసిఐ సెలెక్షన్ కమిటీ పక్షపాత ధోరణితో వ్యవహరించిందనే విమర్సలున్నాయి. కా సురేష్ రైనాతో పాటు జట్టులోకి వచ్చిన ఆంధ్రా క్రికెటర్ వేణుగోపాల రావుకు కూడా కుదురుకోవడానికి తగిన సమయం ఇవ్వలేదనే విమర్శలున్నాయి. హైదరాబాదుకు చెందిన స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజాను తీసుకున్నట్లే తీసుకుని మళ్లీ పక్కన పడేశారు.
భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ చాపెల్ భారత జట్టు ఎంపిక తీరను గతంలో తప్పు పట్టిన విషయం తెలిసిందే. ప్రతిభావంతులైన క్రీడాకారులైనా సరే దక్షిణాది వారికి తగిన స్థానం దక్కడం లేదనే అభిప్రాయం మొదటి నుంచీ ఉంది.