ఐపియల్ పై నీలినీడలు
ఐపియల్ వ్యవస్థాపకుడు లలిత్ మోడీ వ్యవహారం క్రికెట్ క్రీడను కుదిపేస్తోంది. తీవ్రమైన అవినీతి ఆరోపణల్లో అతను చిక్కుకున్నాడు. అవినీతి ఆరోపణలపై లలిత్ మోడీని బయటకు పంపించేశారు. అతనిపై క్రిమినల్ కేసు పెట్టింది. దాదాపు 4.68 బిలియన్ రూపాయల అవకతవకలకు మోడీ పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. లలిత్ మోడీ దేశం విడిచిపెట్టి పోయాడు. లండన్ లో ఉంటున్నాడు. తనకు ముంబై గ్యాంగస్టర్ నుంచి ముప్పు ఉందని చెబుతున్నాడు. తాజాగా, కొచ్చి జట్టు విషయంలో క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ వివాదం నడుస్తూనే ఉంది. కొచ్చి జట్టులో సునీల్ గవాస్కర్ కు వాటా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. లలిత్ మోడీ భవిష్యత్తు ఏమవుతుందనేది పక్కన పెడితే 2011లో ఐపియల్ సాగుతుందా అనేది చెప్పలేని స్థితి.
ఎనిమిది ఐపియల్ జట్లలో యాజమాన్యానికి సంబంధించి వివరాలు వెల్లడించకపోవడంతో రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్లను బిసిసిఐ ఐపియల్ నాలుగో ఎడిషన్ నుంచి తప్పించింది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఉద్వాసన చెప్పడం వెనక ఏదైనా మతలబు ఉండవచ్చునని ఆస్ట్రేలియా క్రికెటర్ షేన్ వార్న్ అంటున్నాడు. క్రీడాకారుల వేలం ఈ ఏడాది నవంబర్ లో జరగాల్సి ఉంది. అయితే, జనవరిలోగా కూడా జరుగుతుందో లేదో చెప్పలేని స్థితి. దానికి ముందు ఐపియల్ నాలుగో ఎడిషన్ లో ఎన్ని జట్లు పాల్గొంటాయనే విషయాన్ని బిసిసిఐ ముందు తేల్చాల్సి ఉంటుంది. ఐపియల్ ఎక్కడ జరుగుతుందనేది కూడా ఎవరూ చెప్పలేకపోతున్నారు. మొత్తం మీద, ఐపియల్ పై అయోమయం, గందరగోళం నెలకొని ఉన్నాయి.