షోయబ్ బయట పడ్తారా?
అయేషా ఆరోపణలపై పోలీసులు ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. అయితే, షోయబ్ ను అరెస్టు చేసే విషయంలో మాత్రం ఆచి తూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. అయేషాను షోయబ్ పెళ్లి చేసుకున్నట్లు, వారిద్దరు కలుసుకున్నట్లు గట్టి సాక్ష్యాధారాలున్నాయని అయేషా తరఫు న్యాయవాది రెహ్మాన్ అంటున్నారు. నిఖానామాపై సంతకాలను ధ్రువీకరించుకోవడానికి పోలీసులు దాన్ని పరీక్షలకు పంపారు. మహా అనే పేరుతో తనను అయేషా కుటుంబం మోసం చేసిందని షోయబ్ అంటున్నాడు. అయితే ఆమె పేరు మహా సిద్దిఖి అలియాస్ అయేషా సిద్దిఖి అని రెహ్మాన్ అంటున్నారు.
షోయబ్ పై హైదరాబాదులోని బంజారా హిల్స్ పోలీసు స్టేషనులో మూడు కేసులు నమోదయ్యాయి. వాటిలో ఒకటి మోసం చేసిన కేసు కాగా, మిగతా రెండు వేధింపులకు, మరోదానికి చెందింది. చివరి రెండు కేసులు కూడా నాన్ బెయిలబుల్ కేసులు. షోయబ్ తో తాను కలిసిన విషయాన్ని ఆజర్ చూశాడని అయేషా పోలీసులకు చెప్పింది. అయితే తాను అయేషాను చూడలేదని, ఆమె ఎవరో తెలియదని అజర్ అంటున్నాడు. అయితే ఇదొక్కటి మాత్రమే బలమైన ఆధారం కాదు. నిఖానామాపై సంతకాలు, ఫొటోలు, పెళ్లి సాక్షులు వంటివి ఆధారాలు కావచ్చు. వాటి నుంచి షోయబ్ తప్పించుకోవడం కష్టమనే అభిప్రాయం వినిపిస్తోంది.
కాగా, ఈ నెల 15వ తేదీన సానియా, షోయబ్ వివాహాన్ని నిర్ణయించారు. అయితే ఈ పెళ్లి జరుగుతుందా, లేదా అనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది. షోయబ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని, తనకు బహిరంగంగా విడాకులు ఇవ్వాలని అయేషా అడుగుతోంది. తనకు డబ్బులు అవసరం లేదని కూడా అంటోంది. ఈ విషయంలో షోయబ్ నిర్ణయం మీదనే భవిష్యత్తు పరిణామం ఆధారపడి ఉంటుంది.