పోలీసుల కన్నుగప్పి గర్ల్ఫ్రెండ్తో గడిపిన భాను!
అర్ధరాత్రి వచ్చిన భాను సదరు మహిళతో రెండు గంటలపాటు అక్కడే గడిపినట్లుగా కథనాలు వినిపిస్తున్నాయి. అనంతరం అక్కడ కూడా తన సన్నిహితులతో భేటీ అయినట్లుగా తెలుస్తోంది. అయితే తిరుపతి, అనంతపురం జిల్లాలో తచ్చాడిన భానుకిరణ్ తిరిగి వెళ్లాడా లేదా అనే అనుమానాలు పోలీసులను వేధిస్తోందంట. అనంతపురం జిల్లాలో పుట్టిన భానుకు రాయలసీమ ప్రాంతం మొత్తం కొట్టిన పిండి. దీంతో భాను అక్కడే దాక్కొనడానికి మొగ్గు చూపించే అవకాశం కూడా ఉండవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే భాను ఏకంగా రాష్ట్రంలోనే తిరుగుతుంటే పోలీసులు మాత్రం ఆయన ఆచూకి దొరకబట్టలేక చేతులు ముడుచుకుని కూర్చున్నారు. ఈ కేసును సిబిసిఐడికి అప్పగించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అయితే భాను వచ్చి వెళ్లిన తర్వాత పోలీసులకు సమాచారం లభిస్తుండటం, భానును పట్టుకుంటామని పోలీసులు చెప్పటం పరిపాటిగా మారింది.
అయితే భాను ఆస్తులపై కొందరు కన్ను వేయడం వల్లనే ఆయన వాటిపై దృష్టి సారించేందుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. మద్దెలచెర్వు సూరి జైలులో ఉన్నప్పుడు సూరి అనుచరుడిగా ముద్రపడ్డ భాను పలువురు రాజకీయ నేతలతో సంబంధాలు ఏర్పరుచుకున్నారని తెలుస్తోంది. అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినందువల్ల భానును పట్టుకోవడం పోలీసులకు పెద్ద కష్టమేమీ కానప్పటికీ పలువురు ముఖ్య రాజకీయ నేతల అండ ఉండటం వల్లనే భానును పట్టుకోలేక పోతున్నట్టుగా తెలుస్తోంది. కాగా భాను కోసం పోలీసులు ఒక్కరే గాలించడం లేదని తెలుస్తోంది. పోలీసులు అరెస్టు చేయడానికి గాలిస్తుంటే, సూరి అనుచరులు పగ తీర్చుకోవడానికి గాలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక పరిటాల రవిని హత్య చేసిన సూరిని చంపినందుకు రవి అనుచరులు చమన్, పోతుల సురేష్లు కూడా భాను కోసం గాలిస్తున్నట్లుగా తెలుస్తోంది. భానుకు గతంలో చమన్తో మంచి సంబంధాలు కూడా ఉన్నాయని తెలిస్తోంది. భానును రక్షించడానికి వారు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే భానుకోసం మొత్తం మూడు బృందాలు గాలిస్తున్నాయన్నమాట.