పరిటాలతో మొదలు, అంతం ఎక్కడ?
మొద్దు శీను జైల్లోనే హత్యకు గురయ్యాడు. మొద్దు శీనును తానే హత్య చేశానని ఓం ప్రకాష్ అనే వ్యక్తి అంగీకరించాడు. పరిటాల రవిని చంపిన తర్వాత బావ సూరి కళ్లలో ఆనందం చూశానని మొద్దు శీను చెప్పుకున్నాడు. అయితే, ఆ తర్వాత మొద్దు శీనుకు, మద్దెలచెర్వు సూరికి మధ్య విభేదాలు పొడసూపినట్లు ప్రచారం జరిగింది. ఈ స్థితిలో మొద్దు శీను హత్య జరిగింది. సూరే ఈ పని చేయించాడని కూడా ఆరోపణలు వచ్చాయి. పరిటాల రవి హత్య కేసులోనే కాకుండా మొద్దు శీను హత్యతోనూ తనకు ఎలాంటి సంబంధం లేదని సూరి చెబుతూ వచ్చాడు. అదే వరుసలో సాంబశివరావు అనే వైద్యుడు శవం దిక్కూ మొక్కూ లేకుండా నడికుడి వద్ద రైల్వే ట్రాక్పై పడి ఉంది. ఈ వైద్యుడి చర్లపల్లి జైల్లో సూరికి సెల్ఫోన్లు అందజేసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో అతని పని అయిపోయినట్లు చెబుతారు. అండర్ వరల్డ్ డాన్తో సంబంధాలున్న అజీజ్ రెడ్డి అనే వ్యక్తి హైదరాబాదులో పోలీసు కాల్పుల్లో మరణించాడు.
చోటా షీకీల్తో సంబంధాలున్న అజీజ్ రెడ్డి మొత్తం వ్యవహారంలో ఆయుధాలు సరఫరా చేసినట్లు అప్పట్లో ఊహాగానాలు చెలరేగాయి. పరిటాల రవి హత్య వ్యవహారంలో ఏదో మేరకు అజీజ్ రెడ్డి పాత్ర కూడా ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఆ నేపథ్యంలోనే అజీజ్ రెడ్డి పోలీసు కాల్పుల్లో మరణించాడని చెబుతారు. తాజాగా, మద్దెలచెర్వు సూరి తన అనుచరుడు భాను కిరణ్ చేతిలోనే అంతమయ్యాడు. పరిటాల రవి హత్యోదంతంతో మొదలైన సీరియల్ కిల్లింగ్స్ సూరి దాకా నడిచింది. వరుసలో తర్వాత ఎవరుంటారనే విషయంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న భాను కిరణ్ పరారీలో ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు. భాను కిరణ్ ఏమయ్యాడనే ప్రశ్న మీడియానే కాదు, అందరినీ తొలుస్తోంది.