మరో వైపు: ఓబుళాపురం దయ్యాల కొంప
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ, అంతర్ గంగమ్మ మైనింగ్ కంపెనీ, వైఎం మహాబలేశ్వరప్ప అండ్ సన్స్ మైనింగ్ కంపెనీ, బళ్లారి ఐరనో ఓర్ ప్రైవేట్ లిమిటెడ్ మైనింగ్ లీజులు తీసుకుని దాదాపు 500 ఎకరాల్లో తవ్వకాలు జరుపుతూ వచ్చాయి. ఇక్కడ పనిచేస్తున్న ఆరు మైనింగ్ కంపెనీల్లో నాలుగు కర్ణాటక మాజీ గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించినవే. అక్రమ గనుల తవ్వకాల కేసులో ఆయన ప్రస్తుతం హైదరాబాదు చర్లపల్లి జైలులో ఉన్నారు. తదుపరి ఆదేశాల వచ్చే వరకు ఈ ప్రాంతంలో గనుల తవ్వకాలను ఆపేయడంతో వందలాది మంది ఉపాధి కోల్పోయారు. ఆరు మైన్లలో దాదాపు 1,200 మంది పర్మినెంట్ ఉద్యోగులు ఉండేవారు. మరో 250 మంది యాజమాన్యం పోస్టుల్లో ఉన్నారు. దాదాపు 400 ట్రక్కులు ఓబుళాపురం నుంచి నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం, చెన్నై, మంగళూర్ తదితర ఓడరేవులకు ప్రతి రోజూ ఇనుప ఖనిజాన్ని రవాణా చేస్తుండేవి.
గనుల తవ్వకాలు నిరంతరాయంగా పెద్ద యెత్తున సాగుతుండడంతో చాలా మంది రుణాలు తీసుకుని ట్రక్కులు, టిప్పర్లు కొన్నారు. ప్రైవేట్ ఫైనాన్షియర్ల నుంచే ఎక్కువ మంది అప్పులు పొందారు. దాదాపు పదివేల వాహనాలు రవాణా ఉధృతంగా ఉన్న సమయాల్లో పనిచేసేవి. ఓ డ్రైవర్ నెలకు 25 వేల రూపాయల దాకా, క్లీనర్ 12 వేల రూపాయల దాకా సంపాదించేవారు. ఇంధనం సరఫరా చేయడానికి ఓబుళాపురం, బళ్లారి మధ్య ఎన్నో ఫిల్లింగ్ స్టేషన్లు వెలిశాయి. ప్రతి స్టేషన్ సగటున రోజుకు 15 వేల లీటర్ల డీజిల్ విక్రయించేవి. ఓబుళాపురంలో 20కి పైగా స్టోన్ క్రషింగ్ యూనిట్లు ఏర్పాటయ్యాయి. వాటిలో పని లేక 18 మూత పడ్డాయి. మరో రెండు కూడా మూతపడే స్థితిలో ఉన్నాయి. ఫిల్లింగ్ స్టేషన్లు ఇప్పుడు రోజుకు 2 వేల లీటర్ల డీజిల్ కూడా అమ్మడం లేదు. మైనింగ్ కంపెనీలు చాలా వరకు ఉద్యోగులను తీసేశాయి.
ఉపాధిని వెతుక్కుంటూ ఓబుళాపురం, హెచ్ సిద్ధపురం, డి హెరెహాల్, హెచ్ఎస్ తండా, మల్లవరం గుడి, తదితర ప్రాంతాల ప్రజలు బళ్లారికి, ఇతర ప్రాంతాలకు వలసలు పోతున్నారు. మైన్స్ మూతపడడం వల్ల ఎక్కువగా అనంతపురం జిల్లా కన్నా బళ్లారి దెబ్బ తిన్నది. ఫైనాన్స్ సంస్థలు అప్పులు వసూలు చేసుకోలేక వాహనాలను సీజ్ చేస్తున్నాయి. బ్యాంకుల ఆర్థిక లావాదేవీలు కూడా దెబ్బ తిన్నాయి. మొత్తం మీద, గాలి జనార్దన్ రెడ్డి గనుల అక్రమ తవ్వకాల కేసు ఆ ప్రాంతాన్ని ఒక కుదుపు కుదిపేసింది.