సత్యసాయి ట్రస్టులో ఆగని పోరు
బాబా మృతి తర్వాత రత్నాకర్ వ్యవహార శైలిపై ట్రస్టులోని కొన్ని వర్గాలతో పాటు, బంధుగణంలో కూడా అసంతృప్తి వ్యక్తమైనా బయటకి కనిపించకుండా జాగ్రత్త పడ్డారంట. అయితే ప్రస్తుతం రత్నాకర్ అత్యంత రహస్యంగా పావులు కదుపుతున్నారని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అదే సమయంలో రత్నాకర్కు బ్రేకులు వేయాలని ఆయన వ్యతిరేక వర్గం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో సత్యజిత్ కీలకంగా మారినట్లు తెలుస్తోంది. ఆయన రత్నాకర్ ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ఆయనకు బ్రేకులు వేసే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. బాబా వ్యక్తిగత సహాయకుడిగా ఉన్న సత్యజిత్ కనుసన్నుల్లోనే ట్రస్టు సభ్యులు మెలిగే వారంట. ఆయనకు ఎంత ప్రాధాన్యత అంటే ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి వచ్చినా ఆయన చెప్పినట్టు నడుచుకోవాల్సిందే. బాబా మృతి విషయంలో కూడా వివాదాస్పదం అయిన సత్యజిత్ను ట్రస్టులోని కొందరు బయటకు పంపించాలని చూసినప్పటికీ యజుర్మందిరం వివాదం ముగిసే వరకు ఆయనను ప్రశాంతి నిలయంలోనే కొనసాగించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. బాబాకు అత్యంత సన్నిహితుడు కావడంతో సత్యజిత్కు ట్రస్టు వ్యవహారాలు, యజుర్మందిరం గుట్టు సత్యజిత్కు తెలుసు అన్న ఒకే ఒక కారణంతో ఆయనను బయటకు పంపే పరిస్థితి లేనట్లుగా కనిపిస్తోంది.
దీనిని ఆసరగా తీసుకున్న సత్యజిత్ తన వ్యూహాలకు పదును పెడుతున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు తనకు మద్దతుగా విద్యార్థులను కూడా గట్టుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారని తెలుస్తోంది. ట్రస్టు సభ్యులు తనను సాధారణ ఉద్యోగిగా వ్యాఖ్యానించడం కూడా ఆయనను కలచి వేసిందంట. భవిష్యత్తులో తనకు ప్రాధాన్యత తగ్గినట్లుగా కనిపిస్తే ఆయన అందుకు తగ్గ ప్రణాళికలు ఆయన ఇప్పటి నుండే రూపొందించుకుంటున్నారంట. బాబా ఉన్నప్పుడు ట్రస్టు సభ్యుల కంటే విద్యార్థులకే మంచి ప్రాధాన్యం ఇచ్చే వారు. బాబా మృతి తర్వాత ప్రశాంతి నిలయంలో జరుగుతున్న పరిణామాలపై విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నట్లుగా తెలుస్తోంది.