సత్యజిత్ పాత్ర ఇక నామమాత్రమేనా?
ట్రస్టుపై ఆధిపత్యం కోసం సత్యజిత్కు, బాబా సోదరుడు జానకీరామయ్య కుమారుడు రత్నాకర్ మధ్య పోటీ జరుగుతోందనే వార్తలు వచ్చాయి. సత్యజిత్ రత్నాకర్పై పైచేయి సాధించే అవకాశాలున్నట్లు కూడా ప్రచారం జరిగింది. కానీ, ఆ వాతావరణం ఉన్నట్లు కనిపించడం లేదు. ట్రస్టు సభ్యుల నుంచే చైర్మన్ను ఎన్నుకుంటామని ట్రస్టు సభ్యుడు మద్రాసు శ్రీనివాసన్ మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. సత్యజిత్ ట్రస్టు సభ్యుడు కాకపోవడంతో ఆయన ట్రస్టు వ్యవహారాల్లో ముఖ్య పాత్ర పోషించే అవకాశాలను కోల్పోయినట్లేనని చెప్పవచ్చు.
రత్నాకర్ సత్యజిత్పై ఆధిపత్యం సంపాదించినట్లు భావించవచ్చు. ట్రస్టు విషయంలో ఎవరి పాత్ర ఎలా ఉండాలనే విషయంపై ఇప్పటికే ఓ నిర్ధారణకు వచ్చినట్లు కనిపిస్తోంది. జస్టిస్ భగవతి వంటి కొద్ది మంది ట్రస్టు సభ్యులు వయోభారం వల్ల చైర్మన్ పదవికి దూరంగా ఉంటారని చెప్పడంలో సందేహం లేదు. ఈ స్థితిలో మద్రాసు శ్రీనివాసన్, రత్నాకర్ల పేర్లు ప్రముఖంగా ముందుకు వస్తున్నాయి. మద్రాసు శ్రీనివాసన్ మీడియా సమావేశం మొత్తాన్ని దాదాపు ఒక్కడే అయి నిర్వహించారు. ఆయన సూచన మేరకు కొన్ని ప్రశ్నలకు ఇతర సభ్యులు సమాధానమిచ్చారు. మద్రాసు శ్రీనివాసన్ పాత్ర ట్రస్టు వ్యవహారాల్లో ప్రముఖంగా ఉండబోతున్నట్లు అర్థం చేసుకోవచ్చు. అలాగే, రత్నాకర్ పాత్ర భారీగా ఉండే అవకాశాలున్నాయి.
ట్రస్టు చైర్మన్గా మద్రాసు శ్రీనివాసన్ ఉంటారా, రత్నాకర్ ఎంపికవుతారా అనేది వేచి చూడాల్సిన విషయం. అయితే, చెక్ పవర్ ఇద్దరికి ఉండాలని రత్నాకర్ అంటున్నారు. అంటే, చైర్మన్ వేరొకరు అయినా, తనకు చెక్ పవర్ ఉండేలా రత్నాకర్ చూసుకుంటారా అనేది కూడా చర్చనీయాంశంగానే ఉంది. మొత్తం మీద, విభేదాలను పరిష్కరించి, సత్యజిత్, రత్నాకర్ మధ్య ఎవరికి ఏ పాత్ర ఇవ్వాలనే విషయం నిర్ధారణ అయిన తర్వాత ట్రస్టు సభ్యులు మీడియా ముందుకు వచ్చినట్లు కనిపిస్తోంది.