పుట్టపర్తిలో నిత్యానందకు 'గౌరవభంగం'
వివిఐపి ప్రవేశ ద్వారం వద్ద చేతిలో పూలదండ పట్టుకుని నిత్యానంద నిలబడ్డారు. ఇతర ప్రముఖులను పలకరించిన సాయిబాబా బంధువులు నిత్యానంద ఉనికిని గుర్తించనట్లే వెళ్లిపోయారు. తన ఉనికిని గుర్తించకపోవడంతో అతను కామన్ గేట్ ద్వారా లోనికి ప్రవేశించాడు. వివిఐపి ద్వారం ద్వారా అనుమతించాలని అతను సత్య సాయిబాబా కుటుంబ సభ్యులను వేడుకున్నా ఫలితం లేకపోయిందని చెబుతున్నారు. క్యూలో నిలబడి సత్య సాయిబాబాను దర్శించాల్సిన పరిస్థితిని అతను ఎదుర్కున్నాడు. నిత్యానంద భారీ పూలదండను సమర్పించి, వంగి నమస్కారం చేస్తున్న సమయంలో స్వచ్ఛంద సేవకులు త్వరగా కదలాలని భక్తులను పురమాయించారు.
కాస్కెట్ నుంచి నిత్యానంద వేగంగా కదిలి సత్య సాయిబాబా నిలువెత్తు విగ్రహం వెనక నుంచి విఐపి గేటు ద్వారా బయటకు వెళ్లడానికి ప్రయత్నించాడు. దురదృష్టవశాత్తు, అతన్ని నిలిపేసి, సాధారణ భక్తులు వెళ్లే మార్గం గుండా వెళ్లాలని ఆదేశించారు. అక్కడి నుంచి వేగంగా కదిలి నిత్యానంద బయటకు వెళ్లిపోయాడు.