సర్వేశ్వర్ రెడ్డి హవా, మంత్రి కుమారుడెవరు?
ఆ పత్రిక వార్తాకథనం ప్రకారం - ఎస్ఐ నుంచి డిఎస్పీ దాకా అంచెలంచెలుగా ప్రమోషన్లు పొందినా కూడా సర్వేశ్వర్ రెడ్డి ఒకే చోట ఉంటూ వస్తున్నారు. ఒక్కసారి మాత్రం తప్పని స్థితిలో అతను బయటకు వెళ్లాడట. అది కూడా వికారాబాదులో రెండు మూడు రోజులే పనిచేశారు. బదిలీలు చేసి ఇతర ప్రాంతాలకు పంపించడం ఆనవాయితీ, కానీ సర్వేశ్వర్ రెడ్డి రంగారెడ్డి జిల్లాలోనే తిష్ట వేశాడు. హైదరాబాదు చుట్టూ అతను ఓ మంత్రి కుమారుడితో కలిసి సెటిల్మెంట్లు చేస్తుంటాడని ఆరోపణలున్నాయి. అదనపు ఎస్పీ స్థాయి అధికారికి మాత్రమే ఓఎస్డీ పదవి వస్తుంది. కానీ, ఎసిపి స్థాయి అధికారి అయినప్పటికీ సర్వేశ్వర్ రెడ్డికి ఓఎస్డీ పదవి దక్కింది.
ఆ వార్తా పత్రిక కథనం ప్రకారమే - సర్వేశ్వర్ రెడ్డి లాకర్లనే కాకుండా అతని బంధువులు, సన్నిహితుల బ్యాంక్ లాకర్లను కూడా ఎసిబి తెరవలేక చేతులెత్తేసింది. సర్వేశ్వర్ రెడ్డికి 450 కోట్ల రూపాయల ఆస్తులున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మాదాపూర్లో సర్వేశ్వర్ రెడ్డ్డికి బినామీల పేరు మీద 500 గజాల విస్తీర్ణంలో భారీ భవనం ఉన్నట్లు సమాచారం. దీని విలువ 30 కోట్ల రూపాయల దాకా ఉంటుంది.