అస్సాం అల్లర్లు: పాంప్లెట్లపై ఎంపి అసదుద్దీన్ ఖండన
అంతేకాకుండా హైదరాబాదులోని ఈశాన్య రాష్ట్ర వాసులు ఉన్న ప్రాంతాలలో వారికి వ్యతిరేకంగా, బెదిరింపులతో పాంప్లెట్లు కూడా వెలిశాయనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఫోన్ కాల్స్, మెసేజ్లు, పాంప్లెట్ల నేపథ్యంలో ఆందోళనకు గురైన వారు నగరాలు విడిచి వెళ్లిపోతున్నారు. అయితే హైదరాబాద్ పార్లమెంటు సభ్యులు, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ మాత్రం పాంప్లెట్ల అంశాన్ని ఖండించారు. హైదరాబాదులో ఈశాన్య రాష్ట్రవాసులకు వ్యతిరేకంగా ఎలాంటి కరపత్రాలు వెలువడలేదని, భయాందోళనకు గురి చేస్తున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకునేలా చేస్తామన్నారు.
హైటెక్ సిటీ ప్రాంతంలోని సిద్ధిక్ నగర్ నుండి బుధ, గురువారాల్లో చాలామంది తమ సొంత రాష్ట్రానికి పయనమయ్యారు. అయితే స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం వారు బెదిరింపుల కారణంగా వెళ్లలేదని, అక్కడి పరిస్థితుల దృష్ట్యా తమ కుటుంబ సభ్యులు పిలిచినందు వల్లే వెళ్లారని చెబుతున్నారు. ఈశాన్య రాష్ట్రవాసులు నగరం విడిచి వెళ్లే అంశంపై డిజిపి దినేష్ రెడ్డి శుక్రవారం స్పందించారు. ఎపిలో వారు నిర్భయంగా ఉండవచ్చుని చెప్పారు.
ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని, వారు ఉన్న చోట ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులను నియమిస్తామని, పుకార్లు, వదంతులు నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. వదంతులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. హైదరాబాద్, సైబరాబాద్ పరిసర ప్రాంతాలలో ఉన్న ఈశాన్య రాష్ట్ర వాసులు నిర్భయంగా ఉండవచ్చునని, పోలీసులు రక్షణ కల్పిస్తారని, ఉన్నతాధికారులు నిత్యం పర్యవేక్షిస్తున్నరని, ఎవరూ రాష్ట్రం విడిచి వెళ్లవద్దన్నారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, బెంగళూరు నుండి ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లే రైళ్లలో సాయుధ బలగాలతో రక్షణ కల్పిస్తామన్నారు. రాష్ట్రం నుండి సుమారు 500 మంది తరలి వెళ్లారని, తిరిగి వారిని ఇక్కడకు రప్పిస్తామని దినేష్ రెడ్డి చెప్పారు.