సచిన్ టెండూల్కర్ స్థాయి తగ్గుతోందా?
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ టెస్టు మ్యాచుల్లో బాగా రాణించారు. కానీ వన్డేల్లో విఫలమవుతున్నాడు. ఈ స్థితిలో రికీ పాంటింగ్ను వన్డే సిరీస్ నుంచి వెంటనే తప్పించారు. పరిస్థితిని గుర్తించిన పాంటింగ్ - తాను వన్డేలకు స్వస్థి చెబుతున్నట్లు ప్రకటించాడు. రికీ పాంటింగ్తో పోలిస్తే టెండూల్కర్ ఆట తీరు అంత బాగా ఏమీ లేదు, అంతకన్నా దారుణంగానే ఉంది. అయినా టెండూల్కర్ జట్టులో కొనసాగుతున్నాడు. పైగా, మైదానంలోకి దిగే అవకాశాలను కొల్లగొడుతున్నాడు. ఈ స్థితిలో అత్యంత మర్యాదస్థుడైన సచిన్ టెండూల్కర్ చేయాల్సిందేమిటనేది చర్చనీయాంశంగా మారింది.
టెండూల్కర్ రిటైర్మెంట్ ప్రకటించాలని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నారు. ప్రపంచ కప్ పోటీల తర్వాత టెండూల్కర్ తప్పుకోవాల్సి ఉండిందని ఆయన అన్నారు. వన్డేల్లోంచి సచిన్ తప్పుకోవాల్సిందని మరో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా సూచించాడు. మైలురాయిని చేరుకోవాలనే విషయాన్ని మనసు నుంచి తొలగించుకోవాలని కాస్తా మర్యాదగా రవిశాస్త్రి టెండూల్కర్కు సూచించారు. చాలా మంది మాజీ క్రికెటర్లు - టెండూల్కర్ విషయంలో తమ వాదన వినిపిస్తూనే ఉన్నారు.
ఆ మాటలను గానీ, వారి వాదనలను గానీ సచిన్ టెండూల్కర్ పట్టించుకోకుండా టెండూల్కర్ జట్టులో కొనసాగుతూనే ఉన్నారు. ఇలా కొనసాగడం వెనక బిజినెస్ లాబీ ఏమైనా ఉందా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏమైనా, సచిన్ టెండూల్కర్ తన ప్రతిష్టను తగ్గించుకునే విధంగానే వ్యవహరిస్తున్నాడనే అభిప్రాయం మాత్రం రోజురోజుకూ బలపడుతోంది.