దైవ కణాల పరిశోధన వెనక భారత్ బోస్
వీరు ప్రతిపాదించిన కణాల ఆధారంగానే తర్వాతి కాలంలో దైవకణానికి సంబంధించిన సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. ఆయనకు నోబెల్ ప్రైజ్ ఇవ్వకపోవడంపై శాస్త్రవేత్తలు ఇప్పటికీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు. అయితే, విశ్వంలోని ఒక ప్రాథమిక కణానికి ఆయన పేరు పెట్టడం కన్నా అరుదైన గౌరవం మరొకటి లేదని సంతృప్తి పడుతుంటారు. ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్తలు సీవీరామన్, మేఘనాథ్ సాహా, సత్యేంద్రనాథ్ బోస్లను ఫిజిక్స్లో చెరగని ముద్రవేసిన త్రిమూర్తులుగా చెబుతారు.
దైవకణం ప్రకటన వెలువడగానే జెనీవాలో శాస్త్రవేత్తలు ఆనందోత్సాహాల్లో తేలిపోతుండగా కోలత్కతాలోని సాహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్(ఎస్ఐఎన్పీ) పరిశోధకులు కూడా సంబరాలు జరుపుకున్నారు. దైవకణం ఉనికిని గుర్తించడంలో భారతీయులూ కీలకపాత్ర పోషించారు. యూరోపియన్ పరిశోధన సంస్థ 'సెర్న్' శాస్త్రవేత్తలు 'ఈ చరిత్రాత్మక ప్రాజెక్టుకు భారత్ తండ్రి వంటిది' అని వ్యాఖ్యానించారు.
సాహా ఇన్స్టిట్యూట్తోపాటు ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, అలహాబాద్లోని హరిశ్చంద్ర ప్రసాద్ ఇన్స్టిట్యూట్, భువనేశ్వర్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్, బోస్ ఇన్స్టిట్యూట్, పంజాబ్, జమ్మూ, గౌహతి, రాజస్థాన్ యూనివర్సిటీకి చెందిన అనేక మంది ఈ పరిశోధనల్లో పదేళ్లుగా పాలు పంచుకుంటున్నారు.
మొత్తానికి వందమంది భారత శాస్త్రవేత్తలు సెర్న్ పరిశోధనల్లో తమ వంతు సహకారం అందిస్తున్నారు. అసలు హిగ్స్ బోసాన్ పేరులోనే భారతీయ మూలాలున్నాయి. విశ్వ విఖ్యాత శాస్త్రవేత్త ఐన్స్టీన్తో కలిసి పనిచేసిన సత్యేంద్రనాథ్ బోస్ పేరుమీదనే 'బోసాన్' అన్న పదం పుట్టుకొచ్చింది. సెర్న్ ప్రతిష్ఠాత్మక భూగర్భ పరిశోధన కేంద్రం లార్జ్ హాడ్రన్ కొలైడర్(ఎల్హెచ్సీ) నిర్మాణంలోనూ భారతీయులే కీలక పాత్ర పోషించారు.