లండన్లో భారతీయ విద్యార్థులు రోడ్డున పడ్డారు
ఇప్పటికే వీసాలు పొంది, ఎల్ఎంయూలో వచ్చేనెల నుంచి చదువుకోడానికి రావాల్సిన భారతీయ విద్యార్థుల వీసాలు రద్దవుతాయి. ఇటీవలి కాలంలో నిధుల కొరత సహా పలు రకాల సమస్యలను ఎల్ఎంయూ ఎదుర్కొంటోంది. కానీ, ప్రస్తుతమున్న విద్యార్థుల భవిష్యత్తే తమకు అత్యంత ప్రాధాన్యమైన విషయమని, వారికి కావల్సిన అన్నిరకాల సాయం చేస్తామని వర్సిటీ ఉపకులపతి మాల్కం గిల్లీస్ తెలిపారు. లైసెన్సు రద్దు వల్ల ప్రభావితమైన భారతీయ, ఇతర విద్యార్థులకు సాయం చేసేందుకు ఒక టాస్క్ఫోర్స్ను నియమించారు.
ఎలాంటి తప్పు చేయని విద్యార్థులకు సాయం చేస్తామని, వారు వేరే విద్యాసంస్థల్లో చేరి చదువు పూర్తిచేయడానికి సహకరిస్తామని విశ్వవిద్యాలయాల శాఖ మంత్రి డేవిడ్ విల్లెట్స్ తెలిపారు. యూకేబీఏ, ఎన్యూఎస్లతో కలిసి పనిచేసేందుకు ఒక టాస్క్ఫోర్స్ను ఏర్పాటుచేయాల్సిందిగా కోరుతున్నామన్నారు. ఎల్ఎంయూ వీసా లైసెన్సు నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించిందని ఇమిగ్రేషన్ మంత్రి డేమియన్ గ్రీన్ తెలిపారు. విదేశీ విద్యార్థులు భారీ స్థాయిలో చెల్లించే ఫీజులే ఎల్ఎంయూతో పాటు ఇంగ్లండ్లోని పలు వర్సిటీలకు ప్రధాన ఆదాయవనరు.
డేవిడ్ కామెరాన్ ప్రభుత్వం హ యాంలో యూనివర్సిటీ రంగానికి నిధుల్లో కోత విధించడంతో పలు వర్సిటీలు అల్లాడుతున్నాయి. విద్యార్థుల్లో కొంతమందికి చిట్టచివరి సెమిస్టర్ మాత్రమే మిగిలి ఉండటం, ఇలాంటి సమయంలో తమను బయటకు పంపేయడంతో వారు వాపోతున్నారు. బ్రిటిషేతర విద్యార్థులలో ఈ విషయమై తీవ్ర ఆందోళన నెలకొంది. విద్యార్థులు చెల్లించిన ప్రతిపైసా వారికి తిరిగివ్వాలని, నష్టపరిహారమూ చెల్లించాలని ఇండియన్ వర్కర్స్ అసోసియేషన్ (ఐడబ్ల్యుఏ) ప్రధాన కార్యదర్శి హార్సెవ్ బెయిన్స్ డిమాండ్ చేశారు. విచారణ పూర్తయ్యేవరకు విదేశీ విద్యార్థులు న్యాయబద్ధంగా ఉద్యోగాలు చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు.