మిశ్రమ జాతీయత వల్లనే అలా....
భారత్ నుంచి ఈ శిశువును అమెరికాకుగాని, జమైకాకుగాని తీసుకువెళ్లాలంటే పాస్పోర్టు జారీకి ప్రస్తుతం ఉన్న నిబంధనలు అంగీకరించవు. దీంతో సర్టిఫికెట్ ఆఫ్ ఐడెంటిటీ ద్వారా తీసుకువెళ్లవచ్చని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వర్గాల ద్వారా తెలిసింది. కాబట్టి ఆ పిల్లాడికి పాస్పోర్టు జారీ చేయాల్సిందిగా కాకుండా సర్టిఫికెట్ ఆఫ్ ఐడెంటిటీ కోసం దరఖాస్తు చేసుకోవాలన్న ఆ శాఖ సూచనమేరకు వాన్ బ్యూరోన్ సికింద్రాబాద్లోని ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయానికి శుక్రవారం మరోసారి వచ్చి దరఖాస్తు చేసుకునే అవకాశాలున్నాయి. రమాదేవి సంతాన సాఫల్య కేంద్రం అందజేసిన వివరాలతోపాటు, ఎంపరర్ జనన ద్రువీకరణ పత్రం, పోలీసులిచ్చే సర్టిఫికెట్ కూడా దరఖాస్తు ఫారంతో జతపరచాలి.
ఢిల్లీలోని విదేశాంగ శాఖ నుంచి అనుమతి వచ్చిన తర్వాత ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయంవారు 'సర్టిఫికెట్ ఆఫ్ ఐడెంటిటీ'ని జారీ చేస్తారు. మూణ్నెళ్లు లేదా ఆర్నెళ్ల తాత్కాలిక కాల పరిమితితో ఈ గుర్తింపు పత్రాన్ని జారీచేస్తామని, వేరే దేశంలో కాలు మోపగానే అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు ఈ సర్టిఫికెట్ను స్వాధీనం చేసుకుంటారని తెలిపారు. అనంతరం, ఆ దేశంలో ఎంపరర్కు పాస్పోర్టు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. ఆవేదనతోనే తాను బిడ్డను పాస్పోర్టు ఆఫీసులో వదలానని వ్యాన్ బూరెన్ చెప్పింది. పాస్పోర్టు ఇవ్వలేమని అధికారులు తనకు ముందే చెప్పలేదని ఆమె అన్నది. ఇక్కడి అధికారులు తనను తీవ్రమైన ఇక్కట్లకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. భారతదేశంలో చట్టానికి వ్యతిరేకంగా తాను ఏ పనీ చేయలేదని ఆమె స్పష్టం చేసింది.