5సెకండ్ల వ్యవధిలోనే జంటపేలుళ్లు: పాక్లో కుట్ర
అలాగే, ప్రస్తుతం పాకిస్థాన్లో ఉంటున్న ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్, మొహసిమ్ చౌదరి, ఆమిర్ రెజా ఖాన్, డాక్టర్ షానవాజ్ ఆలమ్, అసదుల్లా అఖ్తర్, అరిజ్ ఖాన్, మహమ్మద్ ఖాలిద్, మీర్జా షాదాబ్ బేగ్ మరియు మహమ్మద్ సాజిద్కు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు. ఈ సందర్భంగా మక్బూల్, ఇమ్రాన్లను హైదరాబాద్ తీసుకెళ్లామని, పేలుళ్లకు సంబంధించి కీలక సమాచారాన్ని వారు వెల్లడించారని ఎన్ఐఏ అధికారులు న్యాయమూర్తికి చెప్పినట్లుగా సమాచారం.
హైదరాబాద్ పేలుళ్ల కుట్ర ఇండియన్ ముజాహిదీన్ మాడ్యూళ్లదేనని, దీనికి కుట్ర పాకిస్థాన్లో జరిగిందని, రియాజ్ భత్కల్ ఆదేశాల మేరకే పేలుళ్లు జరిగాయని చెప్పినట్లు తెలిసింది. కాగా, దిల్సుఖ్నగర్లో జంట పేలుళ్లు కేవలం ఐదు సెకన్ల తేడాలో సంభవించినట్లుగా భావిస్తున్నారు. వాటిలో వాడిన అమ్మోనియం నైట్రేట్ కూడా ఒక్కో దాంట్లో కిలో లోపే ఉందని, వాటిని నిపుణులు తయారు చేయలేదని నివేదిక సిద్ధం చేసినట్లుగా సమాచారం.
సమాచారం మేరకు.. ఫిబ్రవరి 21న మలక్పేట నుంచి ఇద్దరు వ్యక్తులు ముఖం కనిపించకుండా టోపీలు పెట్టుకొని వచ్చారు. మలక్పేట వైపు నుంచి సాధారణ దుస్తుల్లో ఓ వ్యక్తి సైకిల్ నెట్టుకొంటూ దిల్సుఖ్నగర్ బస్టాండ్ వైపు వచ్చాడు. రెండు నిమిషాల తర్వాత మరో వ్యక్తి సైకిల్ తొక్కుకుంటూ అదే దారిలో వచ్చాడు. నెట్టుకుంటూ వచ్చిన వ్యక్తి సినిమా థియేటర్ వద్ద సైకిల్ పార్క్ చేయగా తొక్కుకుంటూ వచ్చిన వ్యక్తి మిర్చి సెంటర్ వద్ద సైకిల్ స్టాండ్ వేశాడు.
థియేటర్ వద్ద పేలుడు సంభవించిన శబ్దం విని జనం ఓవైపు పరుగులు తీస్తుండగా కేవలం ఐదు సెకన్ల తేడాతో రెండో పేలుడు సంభవించింది. సిసిటివి ఫుటేజ్లను పరిశీలించిన నిపుణులు ముష్కరుల ముఖాలకు టోపీలు అడ్డు ఉండటంతో గుర్తించలేకపోతున్నారు. బాంబులను నిపుణులు తయారు చేసి ఉంటే నష్టం మరింత తీవ్రంగా ఉండేదని భావిస్తున్నారు.