హైదరాబాద్ చారిత్రక వైభవం: బాతే పురానీ
గత పది, పదిహేనేళ్ల కాలంలో హైదరాబాద్ పూర్తిగా మారిపోయింది. నగరంలోని సంస్కృతి, ఆచారవ్యవహారాలు అన్నీ మారిపోయి, ఒక కొత్త వాతావరణం నెలకొంది. హైదరాబాద్ అంటే చార్మినార్ను ప్రతికగా చెప్పుకునేవాళ్లం. కానీ ఇప్పుడు హైటెక్సిటీని కాకపోతే, నెక్లస్రోడ్డును తలుచుకుంటున్నాం, ఇంతకు ముందు హైదరాబాద్ మన సొంత ప్రదేశంగానూ, మన ఆత్మీయ స్థంలంగానూ ఉండేది. ఇప్పుడు ఈ నగరం ఎవరికి చెందకుండా పొతోంది. బహు సంస్కృతుల సమ్మేళనంతో మినీ ఇండియాను తలపిస్తూ వచ్చిన హైదఖిరాబాద్ ఇప్పుడు మాది అని చెప్పుకునే అవకాశం లేకుండా పోయింది. అంటే కాస్మోపాలిటన్ కల్చర్ నిత్యం పెరుగుతకూ వస్తున్నది. ఇంతకు హైదరాబాద్ రెండుగానే వుండేది. పాతబస్తీ, కొత్తబస్తీ అని మాత్రమే పిలిచేవాళ్లం. కానీ ఇప్పుడు హైదారాబాద్ను మూడు ప్రాంతాలుగా విభజించాల్సి వస్తున్నది. కొత్తబస్తీ, పాతబస్తీలతో పాటు హైటెక్ సిటీ ఒక్కటి వచ్చేసింది.
హైటెక్ సిటీ అంటే ఇప్పుడు ఐటి పరిశ్రమలు వెలిసిన ప్రాంతం మాత్రమే కాదు, జూబిలీహిల్స్, బంజారాహిల్స్ వం ప్రాంతాలు కూడా అందులో ఇమిడివుంటాయి. సాంస్కృతికంగానే కాకుండానే కాకుండా ప్రజల ఆర్థిక స్థితి కూడా ఈ మూడు విభజనలను ఖాయం చేస్తున్నది. సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, ఇతర సంపన్నవర్గాలవారు నివసించే ప్రాంతం అంతా ఒక్కటైపోయింది. కాసు బ్రహ్మానందరెడ్డి పార్కువంటివి కూడా అందుకు ప్రతీకగా మారుతున్నాయి. ఒకప్పుడు నిజాం నవాబు గొర్రెలను మేపుకోవడానికి ఆ ప్రాంతాన్ని ఇచ్చాడు. కొండలు, లోయలు వుండే ఈ ప్రాంతం ఇకప్పుడు ఎందుకు కొరగానిదిగా వుండేది. ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత కుటుంబరావు వంటి కొందరు కమ్యూనిస్టు నాయకులు ప్రాంతాల్లో భూములు కొన్నారు. ఇప్పుడు ఆ ప్రాంతంలో భూమి బంగారమై ఎక్కడలేని విలువ ఈ ప్రాంతంలోని భూములకు వచ్చింది. అలాగే, మనుషులు కూడా ఇక్కడ ఖరీదైనవారే. హైదరాబాద్లోని ఇతర ప్రాంతాలకు ఏ మాత్రం పరిచయం లేని ఆహారాలు, దుస్తులు, ఇతరత్రా వ్యవహారాలు ఇక్కడ ఉంటాయి. ఇది మన హైదరాబాద్ కాదని స్దానికులకు అనిపించేంతగా ఆ ప్రాంతం రూపుదిద్దుకుంది.
ఇకపోతే, హైదరాబాద్లోని కొత్త బస్తీ వాతావరణం కూడా మారిపోతున్నది. ఇంతకు ముందు ఇరానీ హొట్లు వన్ బై టూ చాయ్తో, పాత హిందీ పాటల రికార్డ్ ప్లేయర్లతో కలకలలాడుతూ ఉండేది. తాపిగా కూర్చుని టిఫిన్లు, భోజనాలకు చేయడానికి అనువైన హోటళ్లు వుండేవి. క్రమక్రమంగా అవి తెరమరుగవుతున్నాయి. దర్శిన్లు, మెస్లు కుప్పలు తెప్పలుగా వచ్చాయి. ఇరాని హోటళ్లు చలా వరకు మూతపడ్డాయి. ఉన్నవి కూడా వెలవెలబోతున్నాయి. పదేళ్లలో వాతావరణం పూర్తిగా మారిపోయిందంటే మనల్ని మనమే నమ్మలేని స్థితి రిక్షా కార్మికుడి నుంచి సంపన్నుల వరకు హాయిగా జీవించడానికి వీలయ్యే పరిస్థిలు ఉండేవి. ఇరానీ హోటళ్లలో చాయ్, బన్నులు, దాల్రైస్ వంటివి పేదల కడుపులు నింపుతూ వుండేవి. ఇప్పటికీ అక్కడక్కడా ఇవి వున్నాయి.
అలాగే చూపరులను మహబూబ్ మాన్షన్, ట్యాంక్బండ్, పబ్లిక్ గార్డెన్, ఇందిరాపార్క్ సాలార్జంగ్ మ్యూజియం వంటివి అలరించేవి. ఇప్పుడు ఎన్టీఆర్ పార్కె లుంబినీ పార్కు నెక్లెస్ రోడ్డు కొత్త విశ్రాంతి కేంద్రాలయ్యాయి. అయితే విశ్రాంతిని, ఆమ్లాదానికి ప్రాధాన్యం తగ్గి వ్యాపార సంస్కృతికి, పటాటోపానికి ప్రాధాన్యం పెరిగింది. 'నుమాయిష్' వంటివి కూడా కళ తప్పుతున్నాయి. ఒకప్పుడు హైదరాబాద్ జంటనగరాలకు మంచినీళ్లందించిన హుస్సేన్సాగర్ కలుషితమైపోయింది. బతుకమ్మ, ఉగాది, దసరా వంటి పండుగలు వస్తే రోడ్ల మీద ఆ పండుగకు అవసరమైన సామాగ్రి అంతా రోడ్ల కుప్పలుగా దొరికేది. బతుకమ్మ పండుగ కూడా జోరుగానే వుండేది. ఇప్పుడు రాంనగర్ వంటి ప్రాంతాల్లో ఈ ఆచారసంప్రదాయాలు సాగుతున్నాయి.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విస్తరణతో చదువలు నిమిత్తం, ఉద్యోగాల కోసం అమెరికా వంటి విదేవాలకు వెళ్లిన యువతీయువకులు హైదరాబాద్లోని ఈ కొత్తబస్తీలో కూడా కొల్లలుగా వున్నారు. దీంతో కహహైదరాబాద్లోని మధ్యతరగతి ఆర్థిక పరిస్థితి మెరుగైంది. దీనివల్ల నయాసంపన్నవర్గం ఒకటి ఏర్పడింది. దీనివల్ల చాలా మందికి కార్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే, ఇప్పటికీ హైదరాబాద్ కొత్తబస్తీలో పల్లెలు బతికేవున్నాయి. స్తానికులు ఇప్పటికీ తమ ఆచారవ్యవహారాలను, జీవనశైలిని కాపాడుకుంటూ వస్తున్నారు.ముషీరాబాద్ వంటి ప్రాంతాలను చూస్తే మనకు ఆ విషయం అర్ధమవుతుంది.
ఇక పాతబస్తీ విషయానికి వద్దాం ఇక్కడ చార్మినార్, చార్మినార్, మక్కామసీదు, ఫలక్నుమా ప్యాలెస్ వంటి చారిత్రక కట్టడాలెన్నో వున్నాయి. హైదరాబాద్ సంస్కృతి అంటే, దక్కనీ కల్చర్ అంటే ఇక్కడ పుట్టిపడేదే నైజాం కాలంలో ఇది సంపన్నవర్గాలకు చెందిన ప్రాంతం. పాతబస్తీలో దొరికే గాజులు ప్రపంచప్రఖ్యాతి పొందినవి. సరోజనీ నాయుడు ఈ గాజుల మీద కవిత్వమే రాశారు. హైదరాబాద్ పాతబస్తీకి వెళ్తే మదీనాలో చాయ్ తాగకుండా రావడం అనేది వుండేది కాదు. మదీనా హోటల్ చాయ్ ప్రఖ్యాతి వివరించడానికి వీలు లేనిది. చౌమహల్లా ఒక్కటేమిటి, పాతబస్తీ గురించి చెప్పదలుచుకంటే మొత్తాన్నే ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దవచ్చు.
కానీ మతఘర్షణలు ఈ ప్రాంతాన్ని బద్నాం చేశాయి. నిజానికి, హైదరాబాద్ సంస్కృతిలోనే సహజీవనం అనేది ప్రధానంగా వుంటూ వస్తున్నది. కర్కోటకుడని పేరు పొందిన నిజాం కూడా మత సామరస్యానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చాడు. హిందువుల నమ్మకాలను గౌరవించాడు. అందుకు తగిన దాఖలాలు కూడా వున్నాయి. ఈ కొత్త వాతావరణంలో కాస్తా ఆర్థికంగా మెరుగుపడిన వారంత పాతబస్తీని వదిలేసి కొత్తబస్తీకి వచ్చేశారు. ఒకప్పుడు పాతబస్తీలో అభ్యుదయ సాహిత్య ఉద్యమంలో చుకుకుగా పాల్గొన్నవారందరూ ఇప్పుడు కొత్త బస్తీకి వచ్చేశారు. వారు ఇప్పటికీ తమ పాతబస్తీ జ్ఞాపకాలను నెమరేసుకుంటూ వుంటారు. ఆర్థికంగా చితికిపోయిన ప్రజలు ఇప్పటికీ పాతబస్తీలో వుంటున్నారు. ముస్లింలు ఇంకా ఎక్కువ మంది అక్కడే వుంటున్నారు. ఇప్పుడు ఒక రకంగా ఇది శాపగ్రస్థ ప్రాంతం.
మొత్తం మీద, హైదరాబాద్ మన కళ్ల ముందే మనకు తెలియకుండా పూర్తిగా రూపు మార్చేసుకుంది. ఒకప్పుడు హైదరాబాద్ రోడ్లు విశాలంగా అనిపించేవి. ఆర్థరాత్రి దాటిన తర్వాత కూడా ధైర్యంగా ఇంటికి పోయే వాతావరణం వుండేది. అర్థరాత్రులు రేడియోల్లో సిలోన్ పాటలు వింటూ రోడ్ల మీద కాలక్షేపం చేసే వాతావరణం వుండేది. తక్కువ ధరకు దిల్షాద్, బసంత్ వంటి టాకీసుల్లో పాత సినిమాలు అందుబాటులో వుండేవి. తలుచుకుంటే, ఆ హైదరాబాద్ తిరిగి వస్తుందా? మార్పు తప్పదు. కానీ హైదరాబాద్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడంలో ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానంలో పెద్ద లోపం వుంది. ఇక్కడి చారిత్రక కట్టడాల పరిరక్షణలో వైఫల్యం, నిర్లక్ష్యం వుంది. హైదరాబాద్ వంటి పురాతన నగరం ఎప్పటికీ ఒక పర్యాటక కేంద్రంగానే విలసిల్లాల్సి వుంటుంది. అందుకు తగిన చర్యలు తీసుకుంటే తప్ప దీన్ని రక్షించుకోలేం.
- కాసుల ప్రతాపరెడ్డి