హైదరాబాద్ పేలుళ్లు: కేసు బదలీకి ఒకే!
ఈ నేపథ్యంలో ఈ రోజు హోంమంత్రి, డిజిపి తదితరులతో కిరణ్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం కేసును ఎన్ఐఏకి అప్పగించాలని ఆదేశాలిచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక బాంబులు పేలిన కొన్ని గంటల్లోనే ఎన్ఐఏ బృందాలు హైదరాబాద్ చేరుకుని ఆధారాలు సేకరించిన విషయం తెలిసిందే. ఈ కేసును తమకు అప్పగించాలని కేంద్ర హోంమంత్రి షిండే సమక్షంలోనే అధికారులు కోరారు.
అయితే, హైదరాబాద్లో స్లీపర్ సెల్స్ గురించి తెలుసు గనుక తామే ఛేదిస్తామని రాష్ట్ర పోలీసులు ధీమా వ్యక్తం చేశారు. ఈ దిశగా ముఖ్యమంత్రిని కూడా ఒప్పించడంతో కేసు బదిలీ ఆగిపోయింది. తాజాగా కేంద్ర హోంశాఖ దీనిని ఎన్ఐఏకు బదిలీ చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫోన్ చేయడంతో కేసును బదిలీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరోవైపు బీహార్, బెంగళూరు, కాశ్మీర్ల నుంచి కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎన్ఐఏ పేర్కొంది. కేసు మూలాలు పలు రాష్ట్రాల్లో ఉన్నందున తామైతే త్వరగా ఛేదించగలమని కేంద్ర హోంశాఖకు తెలిపింది. ఈ పరిస్థితుల్లో కేసును అప్పగించేస్తేనే మంచిదని రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తోంది. కేంద్ర నిఘా సంస్థలు మూడుసార్లు హెచ్చరించినా నిర్లక్ష్యం వహించడంపై ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విచారణ పూర్తయింది.