పదిహేను నిమిషాల్లోనే బాంబు తయారీ
తాజాగా మరో విషయాన్ని మక్బూల్ బయట పెట్టాడట. తాను బాంబును పదిహేను నిమిషాల్లోనే తయారు చేయగలనని, ఇండియన్ ముజాహిదీన్కు చెందిన వారిలో చాలామంది ఈ బాంబును నిమిషాల్లో తయారు చేయగల నైపుణ్యం ఉన్న వారేనని ఎన్ఐఏకి చెప్పినట్లుగా తెలుస్తోంది. తనతోపాటు అరెస్టైన ఇమ్రాన్ కరాచీలో ఇండియన్ ముజాహిదీన్లో కీలక సభ్యుడు రియాజ్ భత్కల్తో తరుచూ ఛాటింగ్ చేసేవాడని చెప్పినట్లుగా సమాచారం.
ఆపరేషన్లో పాల్గొన్న వారు దూరంగా అజ్ఞాతంలో ఉంటారని, వాళ్ల రహస్య స్థావరాలు ఎవరికీ తెలియవని, తనను మిగిలిన ఉగ్రవాదులతో సన్నిహితంగా మెలగనివ్వలేదని మక్బూల్ వివరించాడట. అందరికీ అన్ని విషయాలు తెలియనివ్వరని, తనకు ఇచ్చిన బాధ్యత మేరకు హైదరాబాదులో రెక్కీ నిర్వహించానని చెప్పాడని తెలుస్తోంది. ఇండియన్ ముజాహిదీన్కు చెందిన వారు చాలా వరకు మారు పేర్లతో ఉంటారని, ఎవరు ఎక్కడ ఉంటారో తనకు తెలియదని చెప్పినట్లుగా సమాచారం.
గత ఆరు నెలలుగా తాను జైలులో ఉన్నానని, తనకు తెలిసిన వివరాలు అన్ని దర్యాఫ్తు సంస్థలకు వెల్లడించినట్లు మక్బూల్ ఎన్ఐఏకు చెప్పారని తెలుస్తోంది. మరోవైపు, జంట పేలుళ్లకు పథకం వేసిన ఉగ్రవాదులు అక్కడితో ఆగకుండా ఢిల్లీ, పూణే తరహాలో వరుస బాంబు పేలుళ్లకు కుట్ర పన్నినట్లుగా తెలుస్తోంది. హైదరాబాదులో ఆరు ప్రాంతాలను వారు ఎంపిక చేసుకున్నట్లుగా సమాచారం.
ట్యాంకుబండు, రాణిగంజ్, బేగంబజార్, ఆబిడ్స్లోని ఇస్కాన్ దేవాలయం, జనరల్ పోస్టాఫీస్, అన్నపూర్ణ లేన్లలో రెక్కీ నిర్వహించినట్లుగా తెలుస్తోంది. మొత్తం పన్నెండు ప్రాంతాల్లో వారు రెక్కీ నిర్వహించినట్లుగా తెలుస్తోంది. కాగా, విచారణ నిమిత్తం హైదరాబాద్ తరలించిన మక్బూల్, ఇమ్రాన్లను ఎన్ఐఏ అధికారులు ఈ రోజు భారీ భద్రత మధ్య ఢిల్లీకి తరలిస్తున్నారు.