పెళ్లిళ్ల శోభ: మాఘమాసానికి వాలెంటైన్స్డే తోడు
ఈ మూడు రోజుల్లో లక్షలాది పెళ్లిళ్లు జరగనున్నాయి. ఒక్క తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలోనే ఈ మూడు రోజుల్లో ఐదువేల ఏడువందల జంటలు ఏకం కానున్నాయి. పెళ్లిళ్లకు మంచి ముహూర్తంగా భావించే రేవతీ నక్షత్రానికి తోడు ఈ నెల 14వ తేదిన ప్రేమికుల రోజు ఉంది. దీంతో మంచి ముహూర్తంతో పాటు వాలెంటైన్స్ డే రోజు ఒక్కటయ్యేందుకు వేలాది జంటలు ఉత్సుకత చూపిస్తున్నాయి. ఏ ఊరు, ఏ నగరం, ఏ పట్టణం చూసినా పెళ్లి శోభ సంతరించుకుంది.
నందననామ సంవత్సరానికి ఇవే చివరి ముహూర్తాలు. లక్షలాది పెళ్లిళ్ల కారణంగా నెల రోజుల ముందే ఫంక్షన్ హాళ్లు, మంటపాలు, బ్యాండు మేళాలు, వాహనాలకు డిమాండ్ పెరిగింది. పురోహితులు దొరకని పరిస్థితి ఏర్పడింది. పలు ఫంక్షన్ హాళ్లు సాధారణం కంటే ఎక్కువ ధరను పలుకుతున్నాయి. మన సాంప్రదాయం ప్రకారం మంచి రోజుతో పాటు వాలెంటైన్స్ డే కలిసి రావడంతో రేపు అర్ధరాత్రి ఒక్కో హాల్లో నాలుగైదు పెళ్లిళ్లు జరుగనున్నాయి. పెళ్లిళ్ల హడావుడి ఉండటంతో నగరాలలో షాపింగ్ మాల్స్ కళకళలాడుతున్నాయి.
రాజధానిలో..
హైదరాబాదులో పెళ్లిళ్ల సందడి నెలకొంది. రాజధానిలోనే దాదాపు నలభై వేల పెళ్లిళ్లు జరగనున్నాయి. దీంతో ఫంక్షన్ హాల్స్ కళకళలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు ముహూర్తం ప్రారంభమౌతుంది. కాగా ఇప్పటికే నష్టాల్లో ఉన్న రోడ్డు రవాణా సంస్థ మూడు రోజుల పాటు 12వేల అదనపు బస్సులను తిప్పనుంది. వీటిలో అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నారు. మరో ఆరువేల బస్సులు ప్రత్యేకంగా పెళ్లిళ్లకు బుకింగ్ అయ్యాయి. మాఘ మాసంలో పెళ్లిళ్లు చేసుకుంటే సూర్య భగవానుడి కృప లభిస్తుందని భావిస్తుంటారు. మాఘ మాసం సూర్యుడికి ప్రీతికరమైనదిగా భావిస్తారు.