అప్పుడు ధోనీపై విమర్శలు: ఇప్పుడు అతనే..
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు మ్యాచులో విజయం ద్వారా ధోనీ తనపై వచ్చిన విమర్శలకు అన్నింటికీ సమాధానాలు చెప్పాడు. డ్రా వైపు వెళ్తుందనుకున్న మ్యాచును అతను తన అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన ద్వారా విజయం వైపు మళ్లించాడు. అతను చేసిన డబుల్ సెంచరీ అద్వితయమైందిగా ప్రశంసలు అందుకుంది. అంతేకాకుండా, కెప్టెన్గా అతని తెలివితేటలు మరోసారి ప్రశంసలు అందుకున్నాయి.
దేశీయ నిపుణులే కాకుండా విదేశీ మాజీ క్రికెటర్లు కూడా ధోనీ నాయకత్వ తీరును ప్రశంసిస్తున్నారు. ఎంఎస్ ధోనీ భారత క్రికెటర్లలో ముగ్గురు అగ్రశ్రేణి క్రికెటర్లలో ఒకడిగా రిటైర్ అవుతాడని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డీన్ జోన్స్ అన్నాడు. రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ, వివియస్ లక్ష్మణ్ రిటైర్మెంట్ కారణంగా ధోనీకి తన బ్యాటింగ్ ప్రదర్శనను చూపించాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన అన్నాడు.
హర్బజన్ పట్ల ధోనీ తీరును తప్పు పట్టిన హైదరాబాదీ మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత వివియస్ లక్ష్మణ్ ధోనీ కెప్టెన్సీపై ప్రశంసలు కురిపించాడు. ధోనీని అద్భుతమైన బ్యాట్స్మన్గా కూడా అభివర్ణించాడు. ప్రస్తుతం ధోనీ అత్యుత్తమ కెప్టెన్ అని ఆయన అన్నాడు.
ధోనీకి రాహుల్ ద్రావిడ్ వంటి మాజీ క్రికెటర్లు అండగా నిలువగా, కొంత మంది ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. సౌరవ్ గంగూలీ వంటివారు ధోనీకి సలహాలు ఇచ్చారు. అయినా, ధోనీ ఏమీ మాట్లాడలేదు. అపజయాలకు క్రుంగిపోవడం, విజయాలకు పొంగిపోవడం తన జీవితంలో లేదని అతను చేతల ద్వారానే కాకుండా మాటల ద్వారా కూడా చెప్పాడు. ఇప్పుడు ధోనీని మించిన కెప్టెన్ లేడని అనిపిస్తున్నాడు. ఆస్ట్రేలియాపై సిరీస్ విజయం సాధిస్తే ధోనీ తిరుగులేని నాయకుడిగా ముందుకు వస్తాడు.