పిక్చర్స్: ఫీల్డింగులో అదరగొడుతున్నారు
ముంబై: సీనియర్లు మైదానంలో చురుగ్గా కదలలేకపోతున్నారని అప్పుడెప్పుడో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చేసిన వ్యాఖ్య తీవ్ర దుమారమే రేపింది. వీరేంద్ర సెహ్వాగ్, మరో ఇద్దరు ఆటగాళ్ల గురించి ఆయన ఆ వ్యాఖ్య చేశాడు. క్రికెట్ క్రీడాప్రపంచం ఒక్కసారిగా గుడ్లు తేలేసింది. ఫీల్డింగ్ కట్టుదిట్టంగా చేసే ఆటగాళ్లు ఉంటే ప్రత్యర్థి జట్టు తీసే పరుగుల్లో 30 - 40 తగ్గించవచ్చుననేది అప్పుడు ధోనీ ఉద్దేశం అయిఉండవచ్చు. వన్డేల్లో ఈ 30 -40 పరుగులు జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తాయనేది పలు మ్యాచుల ఫలితాలను స్పష్టంగానే చెప్పాయి.
తాజాగా, ధోనీ భారత్ ఫీల్డింగ్పై ఓ వ్యాఖ్య చేశాడు. పాకిస్తాన్పై చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరిగిన మ్యాచులో విజయం సాధించిన తర్వాత అతను ఆ వ్యాఖ్య చేశాడు. ప్రపంచంలో తమది ఇప్పుడు మేటి ఫీల్డింగ్ జట్టు అని అతను వ్యాఖ్యానించాడు. ఇది ఆత్మవిశ్వాసంతో పలికిన మాట. యువ క్రికెటర్లతో నిండిన భారత జట్టు సభ్యులు ఇప్పుడు మైదానంలో చురుగ్గా కదులుతున్నారు.
సురేష్ రైనా, రోహిత్ శర్మ మొదటి నుంచి ఫీల్డింగ్లో చురుగ్గా కదిలే ఆటగాళ్లు. ఒకప్పుడు యువరాజ్ సింగ్, కైఫ్ వంటి ఒక్కరిద్దరు మాత్రమే ఫీల్డింగ్లో మేటి ఆటగాళ్లుగా కనిపించేవారు. ఇప్పుడు సురేష్ రైనా, రోహిత్ శర్మ మాత్రమే కాదు, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, దినేష్ కార్తిక్ వంటివారు కూడా ఫీల్డింగ్లో సత్తా చాటుతున్నారు.
వలయంలో లోపల రైనా, రోహిత్, సురేష్ రైనా కళ్లు చెదిరే ఫీల్డింగ్కు పేరు మోశారు. పాయింట్లో రవీంద్ర జడేజా, స్క్రేర్ లెగ్లో రోహిత్ శర్మ, కవర్స్లో విరాట్ కోహ్లీ, స్లిప్స్ లేదా గల్లీలో సురేష్ రైనా బంతిని మెరుపు వేగంతో పట్టుకుని వికెట్లవైపు విసరడంలో ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తున్నారు. ఈ స్థానాలు పరిస్థితిని బట్టి మారుతుంటాయి. దినేష్ కార్తిక్ వికెట్ కీపర్ కూడా కావడంతో అతనికి బంతిని వేగంగా పట్టుకోవడం అంత కష్టం కాదు.
గతంలో ఫాస్ట్ బౌలర్లు ఫీల్డింగులో నెమ్మదిగా కదిలేవారు. జహీర్ ఖాన్, మునాఫ్ పటేల్, ఆశిష్ నెహ్రాల నుంచి ఫీల్డింగు విషయంలో పెద్దగా ఆశించేదేమీ ఉండేది కాదు. కానీ, ఇప్పుడు ఉమేష్ యాదవ్, భువనేశ్వర్ కుమార్ మాత్రమే కాకుండా ఇషాంత్ శర్మ కూడా మైదానంలో వేగంగా కదులుతున్నారు. ట్రైనింగ్ సెషన్లో కూడా ఫీల్డింగ్కు ప్రాధాన్యం ఇస్తున్నారు.
సురేష్ రైనా ఫీల్డింగులో భారత్కు అత్యంత ముఖ్యమైన ఆటగాడు. మైదానంలో బంతిని పట్టుకోవడంలో అతను చూపే తెగువ, చురుకుదనం చూడముచ్చటగా కూడా ఉంటుంది.
రోహిత్ శర్మ ప్రత్యర్థి జట్టు బ్యాట్స్మెన్ కొట్టే బంతిని లాఘవంగా పట్టుకోవడం అందె వేసిన చేయి. మెరుపు వేగంతో కదులుతూ బంతిని పట్టుకుంటాడు.
సీనియారిటీ పెరుగుతున్నప్పటికీ విరాట్ కోహ్లీలో ఫీల్డింగ్ చురుకుదనం తగ్గడం లేదు. బంతిని పట్టుకుని సూటిగా వికెట్లకు కొట్టడంలో అతను మేటి.
ఇటీవలి కాలంలో భారత క్రికెట్ జట్టుకు అంది వచ్చిన క్రికెటర్ దినేష్ కార్తిక్. బ్యాటింగులోనే కాకుండా ఫీల్డింగులో కూడా అతను జట్టుకు కలిసి వచ్చిన ఆటగాడు.
ఇటీవలి కాలంలో పరిణతి సాధించిన క్రికెటర్గా రవీంద్రా జడేజా ముందుకు వచ్చాడు. బ్యాటింగు, బౌలింగులోనే కాకుండా ఫీల్డింగులో అతను తెగువ చూపుతున్నాడు.
ఇంతకు ముందటి భారత బౌలర్లు ఫీల్డింగులో నెమ్మదిగా కదిలేవారు. ఇప్పుడు భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్లతో పాటు ఇషాంత్ శర్మ కూడా మైదానంలో చురుగ్గా కదులుతున్నారు.