రాజకీయాల్లో సంచలనం: ఏమిటీ 2జీ కేసు ?
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2 జీ స్కాంలో కేంద్ర మాజీ మంత్రి రాజా, కరుణానిధి కుమార్తె కనిమొళిని నిర్ధోషులుగా కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే దేశ రాజకీయాలను ఈ కేసు ప్రభావితం చేసింది. తమిళనాడు రాజకీయాల్లో సంచలనంగా మారింది.
యూపీఏ ప్రభుత్వ హయంలో 2జీ స్పెక్ట్రమ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఆనాటి విపక్షాలు ఈ విషయమై ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోశాయి. విపక్షాలకు ఆనాడు ఈ కేసు ఆయుధంగా మారింది. రాజకీయాలను ఈ కేసు ప్రభావితం చేసింది.
అయితే ఈ కేసుపై నిందితులపై ప్రాషిక్యూషన్ ఆరోపణలను నిరూపించలేకపోయిందని కోర్టు తీర్పు వెలువరిచింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని నిర్ధోషులుగా కోర్టు తీర్పు చెప్పింది.
2జీ స్ప్రెక్టమ్ కేసు ఏమిటీ
2 జీ కేసును కాగ్ బయట పెట్టింది. అప్పటి కాగ్ చీఫ్గా ఉన్న వినోద్రాయ్ ఈ కేసును వెలికి తీశారు. 2జీ స్పెక్ట్రమ్ కేసులో నిబంధనలకు విరుద్దంగా లైసెన్సుల జారీలో సుమారు 1.76 లక్షల కోట్లను ప్రభుత్వం కోల్పోయిందని కాగ్ ఆ సమయంలో తప్పుబట్టింది. ఈ విషయం ఆనాడు విపక్షాలకు ఆయుధంగా మారింది.2జీ స్పెక్ట్రమ్ లైసెన్సుల జారీలో కూడ అనేక అవకతవకలకు పాల్పడినట్టు కాగ్ ఆనాడు తన నివేదికలో వెల్లడించింది. 2010 నవంబర్ 16న, కాగ్ తన నివేదికను వెల్లడించింది. మొబైల్ కంపెనీలకు ఫ్రీక్వెన్సీ కేటాయించేందుకు ఈ లైసెన్సులను జారీ చేసేందుకు ఉద్దేశించిందే 2జీ లైసెన్సు.
2జీ స్పెక్ట్రమ్ విషయంలో ఆరోపణలివే
యూపీఏ ప్రభుత్వంలో ఆనాడు డిఎంకె భాగస్వామిగా ఉంది. కేంద్ర టెలికం మంత్రిగా ఎ. రాజా యూపిఏ ప్రభుత్వంలో ఉన్నారు.అయితే ఈ సమయంలో 2జీ స్పెక్ట్రమ్ లైసెన్సుల జారీ విషయంలో నిబంధనలను మార్చారనే ఆరోపణలు ఆనాడు వచ్చాయి. లైసెన్స్ పొందేందుకు ఉన్న అర్హత నిబంధనల్లో మార్పుల కారణంగా ఈ లైసెన్సుల కోసం ఎవరు ముందు ధరఖాస్తు చేసుకొంటారో వారికే కేటాయించనున్నట్టు ప్రకటించారు.అయితే 2001 ధరల ఆధారంగానే ఈ లైసెన్సులను కేటాయించారు. ఈ వేలం జరిగింది మాత్రం 2008లో. దీంతో ఈ విషయమై విపక్షాలు ప్రభుత్వం తీరును ఎండగట్టాయి.
నిబంధనలకు విరుద్దమేనా
అయితే 2జీ స్పెక్ట్రమ్ లైసెన్సుల జారీలో నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించారని సిబిఐ ఆరోపణలు చేసింది. అయితే కొన్ని కంపెనీలను ఈ వేలంలో పాల్గొనకుండా అడ్డుకొన్నారని విపక్షాలు ఆరోపణలు చేశాయి.అయితే ఈ ఆరోపణలను ఆనాటి యూపీఏ ప్రభుత్వం తోసిపుచ్చింది. నిబంధనల ప్రకారమే లైసెన్సుల జారీ చోటు చేసుకొందని తేల్చి చెప్పింది.
ట్రాయ్ నిబంధలనకు విరుద్దంగా
ట్రాయ్ నిబంధనలకు విరుద్దంగా టెలికం మంత్రిత్వశాఖ వ్యవహరించిందని కాగ్ ఆరోపించింది. అంతేకాదు న్యాయశాఖ, ఆర్థిక మంత్రిత్వశాఖ నిబంధలను కూడ టెలికం మంత్రిత్వశాఖ పట్టించుకోలేదని కాగ్ అభిప్రాయపడిందిత. అయితే ఈ కేసును విచారించిన సిబిఐ 80వేల పేజీల చార్జీషీట్ను కోర్టుకు సమర్పించింది. అయితే ప్రాషిక్యూషన్ ఈ ఆరోపణలను రుజువు చేయలేకపోయింది.
2012లో సుప్రీం తీర్పు ఇలా
2012 ఫిబ్రవరిలో సుప్రీం కోర్టులో దాఖలైన పిల్పై సుప్రీం కోర్టు ఓ తీర్పును వెలువరిచింది. రాజ్యాంగానికి విరుద్దంగా స్పెక్ట్రమ్ లైసెన్సులు జారీ అయ్యాయని ఆ కేసులో సుప్రీం అభిప్రాయపడింది.అంతేకాదు 122 లైసెన్సులను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ లైసెన్సులను 2008లో జారీ చేశారు అప్పటి టెలికం మంత్రి రాజా.అంతేకాదు యునైటెడ్ వైర్ లెస్, స్వాన్ టెలికం కంపెనీలకు రూ.5 కోట్ల చొప్పున జరిమానా విధించింది. ఇతర కంపెనీలకు కూడ జరిమానా విధించింది.