ప్రతి రెండు రోజులకు ఐదుగురు మైనర్లపై రేప్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అత్యాచార సంఘటనలు తీవ్ర కలవరం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. నిర్భయ సంఘటన తర్వాత కూడా అత్యాచారాలు ఆగిపోలేదు. అత్యంత విషాదకరమైన విషయం ఏమిటంటే, అత్యాచార బాధితుల్లో 46 శాతం మంది మైనర్లేనని ఓ నివేదికలో వెల్లడైంది.
2013లో 1,636 అత్యాచారం ఘటనలు చోటుచేసుకోగా అందులో 757 మంది బాధితులు మైనర్లే కావడం గమనార్హం. 2014లో 2,166 అత్యాచారం కేసులు నమోదుకాగా వేయి నాలుగు మంది బాధితులు మైనర్లేనని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
2015 అక్టోబర్ 31వరకూ అందిన లెక్కల ప్రకారం 1856 మందిపై అత్యాచారాలు జరగ్గా అందులో 824 మంది బాధితులు 18 ఏళ్ల లోపువారేనని ప్రభుత్వం రాజ్యసభలో ప్రకటించింది. ప్రతి రెండు రోజులకు ఐదుగురు మైనర్లు కామాంధులకు బలై అయిపోతున్నట్లు తెలిపింది.
మహిళపై లైంగిక దాడులను అరికట్టడానికి ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని ఆ ప్రకటనలో తెలిపారు. మహిళలకు భద్రత కల్పించడంతోపాటు నేరాలకు పాల్పడుతున్న వారిపట్ల కఠినంగా వ్యవహిస్తున్నట్టు సభకు చెప్పారు. రాజధాని ఢిల్లీలో 2014లో అత్యధికంగా అత్యాచారం కేసులు 80.79 శాతం పెరిగాయని వివరించారు.
ప్రస్తుత సంవత్సరం అక్టోబర్ నెలాఖరు నాటికి 77.16 శాతం నమోదయ్యాయని అన్నారు. మహిళపై జరుగుతున్న నేరాలను నిరోధించడంతోపాటు కేసుల విచారణ మహిళా పోలీసు అధికారులతోనే చేపడుతున్నట్టు రాజ్యసభకు వెల్లడించారు.
2014లో 17,699 మంది మహిళలు, బాలికలకు ఆత్మరక్షణ శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్టు కేంద్ర హోమ్శాఖ సహాయ మంత్రి హరీభాయ్ పార్త్భీయ్ చౌదరి స్పష్టం చేశారు.