కాన్పూర్ 500వ టెస్టు : 84 ఏళ్ల చరిత్రలో.. టీమ్ ఇండియా మైల్ స్టోన్స్ ఇవే
కాన్పూర్ : 84 సంవత్సరాల సుదీర్ఘ ఇండియన్ క్రికెట్ చరిత్రలో టీమ్ ఇండియా ఇప్పుడు 500వ టెస్టు మైల్ స్టోన్ వద్ద నిలిచింది. నేటి ఉదయం న్యూజిలాండ్ తో ప్రారంభమైన ఈ టెస్టు మ్యాచ్ పైనే ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు దృష్టి సారించారు.
కాన్పూర్ లోని గ్రీన్ పార్క్ వేదికగా జరుగుతున్న ఈ టెస్టులో టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి బ్యాటింగ్ తీసుకున్నాడు. మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా.. నేటి నుంచి తొలి టెస్టు ఆరంభమైంది. కాగా, మ్యాచ్ ఆరంభానికి ముందు భారత మాజీ కెప్టెన్లు సైతం మైదానంలో దర్శనమివ్వడం విశేషం.
ఇక ఇంత సుదీర్ఘ ప్రయాణంలో.. టెస్టులో ఒకసారి ఇండియా ప్రస్థానాన్ని గమనిస్తే.. ఎన్నెన్నో మైల్ స్టోన్స్ కనిపిస్తాయి. మొదటి టెస్టు నాటి నుంచి నేటి 500వ టెస్టు వరకు టీమ్ ఇండియా ప్రస్థానం ఏవిధంగా సాగిందో.. కింద తెలిపిన వివరాల్లో చూడవచ్చు.
మొదటి టెస్టు : సీకె నాయుడు కెప్టెన్సీలో 1932లో ఇంగ్లాండ్ తో తొలి టెస్టు ఆడింది ఇండియా. ఇంగ్లాండ్ లోని లార్ట్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియా 158 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
100వ టెస్టు : మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ కెప్టెన్సీలో 1967లో ఇంగ్లాండ్ తో 100వ టెస్టు జరిగింది. ఇంగ్లాండ్ తో లోని ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరిగిన ఈ టెస్టులోను ఇండియా 132 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
200వ టెస్టు : 1982-83 మధ్య కాలంలో జరిగిన ఈ టెస్టుకు సునీల్ గవాస్కర్ కెప్టెన్సీ వహించాడు. పాక్ తో జరిగిన ఈ మ్యాచ్ లాహోర్ వేదికగా జరగ్గా.. టెస్టు డ్రా గా ముగిసింది.
300వ టెస్టు : 1996-97 మద్య కాలంలో సచిన్ కెప్టెన్ గా ఉన్న సమయంలో 300వ టెస్టు జరిగింది. దక్షిణాఫ్రికాతో అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ టెస్టులో.. ఇండియా 64 పరుగుల తేడాతో విజయం సాధించింది.
400వ టెస్టు : 2006లో ద్రావిడ్ కెప్టెన్సీలో 400వ టెస్టు ఆడింది టీమ్ ఇండియా. వెస్టీండీస్ తో జరిగిన ఈ మ్యాచ్ కింగ్ స్టన్ వేదికగా జరగ్గా.. ఇండియా 49 పరుగుల తేడాతో గెలిచింది.
సుదీర్ఘ టెస్టు క్రికెట్ చరిత్రలో టెస్టుల్లో టీమ్ ఇండియా ప్రదర్శన..
- తొలి 100 టెస్టుల్లో ఇండియా గెలిచినవి-10, ఓడినవి-40 డ్రా-50
-200వ టెస్టు వరకు : గెలిచినవి 35, ఓడినవి 72 డ్రా 93
- 300వ టెస్టు వరకు : గెలిచినవి 56, ఓడినవి 98, డ్రా 145
- 400వ టెస్టు వరకు : గెలిచినవి 88, ఓడినవి 129, డ్రా 182
- 499వ టెస్టు వరకు : గెలిచినవి 129, ఓడినవి 157, డ్రా 212