100 మంది రేపిస్టుల ఇంటర్వ్యూ: అత్యాచారాలకు కారణమిదే!
దేశవ్యాప్తంగా ప్రతి రోజు అనేక అత్యాచార ఘటనల గురించి వింటుంటాం, చూస్తాం. అత్యాచారాలకు పాల్పడిన వ్యక్తులపై తాము పెరిగిన వాతావరణం తీవ్రంగా ప్రభావం చూపుతోంది.
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రతి రోజు అనేక అత్యాచార ఘటనల గురించి వింటుంటాం, చూస్తాం. అత్యాచారాలకు పాల్పడిన వ్యక్తులపై తాము పెరిగిన వాతావరణం తీవ్రంగా ప్రభావం చూపుతోంది. అత్యాచారం చేశామనే స్పృహ కూడ కొందరు నిందితులకు లేదు. అత్యాచారాలు ఎందుకు చోటుచేసుకొంటున్నాయనే విషయమై ఓ జర్నలిస్టు వందమంది రేపిస్టులను ఇంటర్వ్యూ చేసింది. నిందితులతో తాను చేసిన ఇంటర్వ్యూలను పుస్తకరూపం ఇవ్వనున్నట్టు మధుమిత పాండే అనే జర్నలిస్టు ప్రకటించారు.
అసలు అత్యాచారాలు ఎందుకు జరుగుతుంటాయి, అత్యాచారాలను నిలువరించలేమా, కారణాలు ఏమిటి, వీటి పరిణామాలపై మధుమిత పాండే అనే జర్నలిస్టు అత్యాచారానికి పాల్పడిన నిందితులను ఇంటర్వ్యూ చేయాలని నిర్ణయం తీసుకొంది. ఆ సమయంలో ఆమె వయస్సు 23 ఏళ్ళు.
ఢిల్లీకి చెందిన మధుమిత పాండే బ్రిటన్లోని ఆంగ్లియా రస్కిన్ వర్శిటీలో క్రిమినాలజీ విభాగంలో పిహెచ్డి చేస్తోంది. అత్యాచారాలు ఎందుకు చోటుచేసుకొంటున్నాయనే విషయమై ఆమె పరిశోధన చేయాలని భావించారు.
ఈ పరిశోధన పత్రం కోసం తీహర్జైలులోని శిక్షను అనుభవిస్తున్న వంద మంది నిందితులను మధుమిత పాండే ఇంటర్వ్యూ చేశారు. నిందితులను ఇంటర్వ్యూ చేసిన సమయంలో అనేక ఆసక్తికర అంశాలు వెలుగుచూసినట్టు మధుమిత పాండే చెప్పారు.
అత్యాచారానికి పాల్పడిన వారిలో ఎక్కువమంది నిరక్షరాస్యులే
అత్యాచార నేరగాళ్లు ఏం చేస్తున్నారో వాళ్లకైనా తెలుసా? ఏ పరిస్థితుల కారణంగా ఇలాంటి నేరాలకు వాళ్లు పాల్పడుతున్నారు? ఈ ప్రశ్నలే తనను పరిశోధనా పత్రం సబ్జెక్ట్గా తీసుకోవడానికి కారణమని మధుమిత పాండే చెప్పారు. అత్యాచార నేరగాళ్లను నరరూప రాక్షసులని సమాజం భావించడం సరికాదన్నారు. అత్యాచారానికి పాల్పడిన వారిలో ఎక్కువ మంది చదువురానివారేనని ఆమె చెప్పారు.
పుట్టి పెరిగిన వాతావరణమే అత్యాచారాలకు కారణమా?
అత్యాచారానికి పాల్పడిన నిందితులపై పుట్టి పెరిగిన వాతావరం ప్రభావం అధికంగా ఉందని మధుమిత పాండే చెప్పారు.సమాజంలో ఇతరుల మాదిరిగానే వారు జీవనం సాగిస్తున్న విషయాన్ని మధుమిత ప్రస్తావించారు. పెరిగిన వాతావరణం, స్నేహితులు, ఇతరత్రా ప్రభావంతో నిందితులు అత్యాచారాలకు పాల్పడ్డారని మధుమిత అభిప్రాయపడ్డారు
లైంగిక పరిజ్ఞానం తెలియదు
దేశంలోని చాలా కుటుంబాల్లో పురుషులు తాము ప్రత్యేకత కలవాళ్లని అనుకుంటారు. మహిళలు తమ భర్తలను పేరు పెట్టిపిలవడానికి కూడా వెనుకాడుతుంటారు. ఈ విషయాన్ని తాను గమనించానని మధుమిత పాండే చెప్పారు. లైంగిక విద్య పాఠ్యాంశాల్లో లోపించిందని ఆమె అభిప్రాయపడ్డారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలకు అత్యాచారం, జననాంగాలు వంటి వాటిపై లైంగిక పరిజ్ఞానం కలిగించపోవడం కూడ ఓ కారణమనే అభిప్రాయాన్ని మధుమిత పాండే వ్యక్తం చేశారు. ప్రతి విషయాన్ని రహస్యంగానే ఉంచడం వల్ల ఇలాంటి ఘటనలు చోటుచేసుకొంటున్నాయని మధుమిత పాండే చెప్పారు.. ఈ కారణాలతోనే మగపిల్లలకు లైంగిక విజ్ఞానం ఎలా అందుతుందని ఆమె ప్రశ్నించారు.
రేప్ అంటే తెలియని నిందితులు కూడ ఉన్నారు
తీహార్ జైలులో తాను ఖైదీలను ప్రశ్నించినప్పుడు అత్యాచారం అంటే ఏమిటో తెలియదన్న వాళ్లు కూడా వారిలో ఉన్నారని మధుమిత పాండే షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. నిందితుల్లో కొద్దిమందికి మాత్రమే తాము నేరానికి పాల్పడ్డామనే స్పృహ ఉందన్నారు. శృంగారానికి మహిళ అంగీకారం అవసరమనే ఆలోచన లేని వాళ్లు కూడా అందులో ఉన్నారని మధుమిత పాండే చెప్పారు.
ఐదేళ్ళ బాలికపై రేప్, పెళ్ళికి రెఢీ
అత్యాచారానికి పాల్పడిన నిందితుల్లో ముగ్గురు, నలుగురు మాత్రమే పశ్చాత్తాపం వ్యక్తం చేసిన వారున్నారని మధుమిత పాండే చెప్పారు. బాధితురాలినే తప్పుపట్టిన వాళ్లు కూడా ఉన్నారని ఆమె గుర్తుచేసుకొన్నారు. అయితే ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఓ ఖైదీ...తాను బయటకు వెళ్లిన తర్వాత ఆమె ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని చెప్పడం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని మధుమతి తెలిపారు. తన రీసెర్చ్లో వెలుగుచూసిన విషయాలతో త్వరలో ఓ పుస్తకం తీసుకు వస్తానని మధుమిత పాండే చెప్పారు.