జల్లికట్టు వివాదంతో త్రిషకు చుక్కలు.. చనిపోయిందంటూ పోస్టర్లు
త్రిష మరణించిందంటూ కొన్నిచోట్ల పోస్టర్లను సైతం అంటించడం గమనార్హం. త్రిష మరణానికి సంతాపం వ్యక్తం చేస్తూ నివాళులు అర్పించినట్టు సోషల్ మీడియాలో ప్రచారం ఊదరగొట్టారు.
చెన్నై: తమిళనాట జల్లికట్టు వివాదం నటి త్రిష మెడకు చుట్టుకుంది. కారణం.. ఆమె పెటా (మూగజీవుల సంరక్షణ సంస్థ)కు ప్రచారకర్తగా బాధ్యతలు నిర్వర్తిస్తుండటమే. పెటా వేసిన పిటిషన్ కారణంగానే తమిళనాడులో జల్లికట్టుపై సుప్రీం నిషేధం విధించింది.
ఈ నేపథ్యంలో త్రిషపై జల్లికట్టు మద్దతుదారులు తిరగబడుతున్నారు. జల్లికట్టుకు త్రిష వ్యతిరేకం అన్న ప్రచారం జోరుగా సాగడంతో.. ఏకంగా ఆమెపై దాడులకు దిగేదాకా వెళ్లింది పరిస్థితి. జల్లికట్టు మద్దతుదారుల ఒత్తిడితో తాను ఆ క్రీడకు వ్యతిరేకం కాదంటూ త్రిష ప్రకటించినా తమిళులు మాత్రం శాంతించడం లేదు.
నిషేధాన్ని లెక్కచేయకుండా:
జల్లికట్టుపై సుప్రీం నిషేధం ఉన్నా.. మధురై తదితర చుట్టుపక్కల గ్రామాల్లో మాత్రం జల్లికట్టు క్రీడను నిర్వహించారు. సుప్రీం తీర్పును సైతం లెక్కచేయకుండా.. ఇది తమ సాంప్రదాయ క్రీడ అంటూ తమిళులు జల్లికట్టు నిర్వహించుకున్నారు. దీంతో ప్రభుత్వం బలగాలను మోహరించుకున్న సంగతి తెలిసిందే.
త్రిషపై దాడి:
పెటాకు ప్రచారకర్తగా ఉండటంతో.. నటి త్రిష జల్లికట్టుకు వ్యతిరేకమనే వార్త తమిళనాట దావానంలా వ్యాపించింది. ఇది నిజమే అని నమ్మిన కొంతమంది ఏకంగా ఆమెపై దాడికి పాల్పడ్డారు.
త్రిష నటిస్తున్న గర్జన షూటింగ్ స్పాట్ కు వెళ్లి జల్లికట్టు మద్దతుదారులంతా ఆమెపై దాడి చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని చెల్లాచెదురు చేశారు. కొంతమందిని అదుపులోకి తీసుకుని, త్రిషను సురక్షితంగా అక్కడి నుంచి పంపించివేశారు.
త్రిష మరణించినట్టు వదంతులు:
త్రిష జల్లికట్టుకు వ్యతిరేకం అన్న ప్రచారం జోరుగా జరగడంతో.. జల్లికట్టు మద్దతుదారులు ఆమె మీద వ్యతిరేక ప్రచారాన్ని మొదలుపెట్టారు. కోవై లాంటి ప్రాంతాల్లో ఆమె నటించిన సినిమాలను అడ్డుకుంటామని తెలిపారు.
అంతేకాదు, త్రిష మరణించిందంటూ కొన్నిచోట్ల పోస్టర్లను సైతం అంటించడం గమనార్హం. త్రిష మరణానికి సంతాపం వ్యక్తం చేస్తూ నివాళులు అర్పించినట్టు సోషల్ మీడియాలో ప్రచారం ఊదరగొట్టారు.
వదంతులపై త్రిష ఆగ్రహం:
తాను మరణించినట్టు సోషల్ మీడియాలో విస్తరించిన వదంతులపై త్రిష తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇదేనా మహిళలకు మీరిచ్చే గౌరవం? అంటూ ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. త్రిషపై వ్యతిరేక ప్రచారం జరుగుతుండటంతో నటుడు కమల్ హాసన్, నటి రాధికాశరత్ కుమార్ ఆమెకు బాసటగా నిలిచారు.
త్రిషకు మద్దతుగా కమల్ హాసన్:
'ఆమెకు మనకు ఉన్న వ్యత్యాసాన్ని ఊరు గుర్తెరుగుతుంది. సిద్దాంతం వర్థిల్లేలా. జల్లికట్టు ఎద్దులు వర్థిల్లేలా పాటుపడదాం. ఉద్వేగాలను పక్కనబెట్టి ప్రేమ పంచుకుందాం' అంటూ త్రిషకు మద్దతుగా కమల్ స్పందించారు.
ప్లేటు ఫిరాయించిన త్రిష:
ట్విట్టర్ లో త్రిష చేసిన కామెంట్స్ కు జల్లికట్టు మద్దతుదారులు మరింత ఫైర్ అయ్యారు. దీంతో వివాదానికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టడమే బెటర్ అనుకున్నారో.. మరేమో గానీ.. తన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని త్రిష ప్లేటు ఫిరాయించారు. జల్లికట్టుకు వ్యతిరేకంగా తానెప్పుడూ వ్యాఖ్యలు చేయలేదని, తాను జల్లికట్టుకు వ్యతిరేకం కాదని త్రిష స్పష్టం చేసింది.
వాళ్లు త్రిష మాటలను నమ్మే స్థితిలో లేరు:
జల్లికట్టుకు తాను వ్యతిరేకం కాదని త్రిష ప్రకటించినా.. జల్లికట్టు మద్దతుదారులు మాత్రం ఆమె మాటలను నమ్మే స్థితిలో లేరు. త్రిష నిజంగానే జల్లికట్టుకు వ్యతిరేకం కాకపోతే.. తక్షణం పెటాను వదిలి బయటకు రావాలని డిమాండ్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే నటి కుష్బూ సైతం పెటాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
మొత్తానికి.. అటు పోయి, ఇటు పోయి తన మెడకు చుట్టుకున్న వివాదంతో త్రిష ఇప్పుడు సతమతమవుతోంది. చూడాలి మరి దీన్నుంచి ఈ అమ్మడు ఎలా బయటపడుతుందో!