ఎట్టకేలకు కదలిక: 620ప్రమాదాల తర్వాత!..
తాజా యాక్షన్ ప్లాన్ లో భాగంగా.. నగరంలోని 100జంక్షన్ లలో రోడ్డు ప్రమాదాలపై అధ్యయనం చేయడానికి ఓ కన్సల్టెంట్ ను జీహెచ్ఎంసీ నియమించింది.
హైదరాబాద్: నగరంలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు జీహెచ్ఎంసీ యాక్షన్ ప్లాన్ సిద్దం చేస్తోంది. రోడ్డు ప్రమాదాలు పాదాచారుల ప్రాణాల మీదకు వస్తుండటంతో.. వారి రక్షణే ధ్యేయంగా బ్లూ ప్రింట్ సిద్దం చేస్తున్నారు అధికారులు. ఇందుకోసం నగరంలోని యాక్సిడెంట్ స్పాట్స్ ను గుర్తిస్తున్నారు. యాక్సిడెంట్ కారణాలను అన్వేషించి ప్రమాదాలను అరికట్టడానికి ప్రయత్నిస్తున్నారు.
తాజా యాక్షన్ ప్లాన్ లో భాగంగా.. నగరంలోని 100జంక్షన్ లలో రోడ్డు ప్రమాదాలపై అధ్యయనం చేయడానికి ఓ కన్సల్టెంట్ ను జీహెచ్ఎంసీ నియమించింది. కాగా, క్రైమ్ బ్యూరో లెక్కల ప్రకారం.. ఈ ఏడాది మే31వ తేదీ వరకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో చోటు చేసుకున్న ప్రమాదాల్లో 37శాతం మంది పాదాచారులే ఉండటం గమనార్హం. మొత్తం 640రోడ్డు ప్రమాదాల్లో.. 240మంది పాదాచారులు బాధితులుగా మిగిలిపోయినట్లు క్రైమ్ బ్యూరో లెక్కలు చెబుతున్నాయి.
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఆదేశాల మేరకు కదిలిన జీహెచ్ఎంసీ అధికారులు.. ఆయా జంక్షన్ల వద్ద భద్రతా ప్రమాణాలను పెంచాలని భావిస్తున్నారు. ఇప్పటివరకు నగరంలోని 30జంక్షన్లకు సంబంధించిన నివేదిక జీహెచ్ఎంసీ అధికారులకు అందినట్లు తెలుస్తోంది. వీటికి సంబంధించి అధికారులు త్వరలోనే టెండర్ ప్రక్రియను పూర్తి చేయనున్నారు.
జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. జంక్షన్ల వద్ద పాదాచారుల భద్రతా ప్రమాణాలను పౌర సహాయక విభాగం పర్యవేక్షిస్తుందని తెలిపారు. పాదాచారులు రోడ్లు దాటే ప్రాంతంలో బారికేడ్స్ ఏర్పాటు చేస్తామన్నారు. పాదాచారుల భద్రత నిమిత్తం మరిన్ని జీబ్రా క్రాసింగ్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.