అసలేమిటీ జీఎస్టీ? వినియోగదారుడికి అంతిమంగా లాభమా? నష్టమా?
కొత్తగా అమలుకానున్న జీఎస్టీ వల్ల సరుకుల ధరలు పెరుగుతాయా? తగ్గుతాయా? అన్న దానిపై సందేహాలున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుత పన్ను వ్యవస్థ, కొత్త పన్ను వ్యవస్థ మధ్య ఉన్న తేడా ఏంటి?
న్యూఢిల్లీ: సరుకులు (జీ), సేవల (ఎస్)పై పన్ను (టీ)నే సంక్షిప్తంగా జీఎస్టీ అని అంటున్నాం. ప్రస్తుతం దేశంలో అమల్లో ఉన్న ఎన్నో పన్ను చట్టాల స్థానంలో ఏకైక పన్ను చట్టమైన జీఎస్టీని అమల్లోకి తీసుకురానున్నారు.
2017 జూలై 1 నుంచి దీన్ని అమలు చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నిజానికి ఈ పన్ను వ్యవస్థ గురించి చాలా మందికి ఏమీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. మరి జీఎస్టీ వల్ల వినియోగదారుడికి అంతిమంగా లాభమా? నష్టమా?
మళ్లీ సైబర్ అటాక్.. ఈసారి 'పెట్యా' రాన్సమ్ వేర్.. భారత్ పై కూడా దాడి!
కొత్తగా అమలుకానున్న జీఎస్టీ వల్ల సరుకుల ధరలు పెరుగుతాయా? తగ్గుతాయా? అన్న దానిపై సందేహాలున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుత పన్ను వ్యవస్థ, కొత్త పన్ను వ్యవస్థ మధ్య ఉన్న తేడా ఏంటి? వేటిపై పన్ను ఎంతో తెలుసుకుందాం!
ఇప్పటి వరకు ఇలా...
మన రాజ్యాంగం పన్ను అధికారాలను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభజించింది. అంటే పన్ను ఆదాయంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు వాటా కల్పించింది. ఆదాయపన్ను (ఇన్ కమ్ ట్యాక్స్) ను ప్రత్యక్ష పన్ను(డైరెక్ట్ ట్యాక్స్) గా పేర్కొంటారు. దీనిపై హక్కు కేంద్రానిదే. వస్తువుల తయారీ, సేవల పంపిణీపై విధించే వివిధ రకాల పన్నులను పరోక్ష పన్ను(ఇండైరెక్ట్ ట్యాక్సెస్)లు గా పేర్కొంటారు. దిగుమతులపై కస్టమ్స్ సుంకం, తయారీపై ఎక్సైజ్ సుంకాలు ఇండైరెక్ట్ ట్యాక్స్ లో భాగం. దీనిపైనా కేంద్రానికే హక్కులున్నాయి. వీటి విక్రయాలు, వినియోగంపై విధించే సేల్స్ ట్యాక్స్, వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్ (వ్యాట్)పై అధికారం మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. ఇక కేంద్ర ప్రభుత్వం సర్వీస్ ట్యాక్స్ అంటూ సేవలపై 15 శాతం పన్నును అమలు చేస్తోంది. పెట్రోలియం తదితర ఉత్పత్తులపై సెస్సును కూడా వసూలు చేస్తోంది. వినోదపు పన్ను, లగ్జరీ ట్యాక్స్, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ కూడా ఉన్నాయి. ఇదీ ప్రస్తుతం మన దేశంలో అమలులో ఉన్న పన్నుల వ్యవస్థ.
దీని వల్ల సమస్యలేమిటంటే...
ఓ వస్తువుపై ప్రస్తుత విధానంలో పలు దశల్లో పన్నుల భారం పడుతోంది. కేంద్రం స్థాయిలో విధించే పన్ను రేటు దేశవ్యాప్తంగా ఒకటే రీతిలో ఉంటుండగా... అది రాష్ట్రాలకు చేరేప్పటికీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాల విధానాల కారణంగా పన్ను రేటు మారుతోంది. ఉదాహరణకు.. పెట్రోలియం ఉత్పత్తులపై కొన్ని రాష్ట్రాలు తక్కువ పన్నునే వసూలే చేస్తుండగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా పన్ను వేస్తున్నాయి. దీనివల్ల ఒక వస్తువు కొన్ని రాష్ట్రాల్లో చౌకగా, కొన్ని రాష్ట్రాల్లో ఖరీదుగా మారుతోంది. దీనివల్ల ఎక్కువ పన్నుగల రాష్ట్రాలకు తక్కువ పన్ను ఉన్న రాష్ట్రం నుంచి గూడ్స్ అక్రమంగా రవాణా అవడం వల్ల పన్ను ఆదాయానికి గండి పడుతోంది.
పన్నుపై పన్ను.. ఇదే సమస్య...
తయారీ అయ్యే చోట ఓ వస్తువుపై కేంద్రం ఎక్సైజ్ సుంకం విధిస్తుంది. దానిపై అమ్మకం సమయంలో రాష్ట్రాల స్థాయిలో వ్యాట్ ను వసూలు చేస్తున్నారు. దీంతో రెండు దశల్లో పన్ను పడుతోంది. ఇక్కడ కేంద్రం విధించిన ఎక్సైజ్ సుంకంపైనా పన్ను చెల్లించాల్సి రావడం గమనించాల్సిన అంశం. ఉదాహరణకు.. ఆంధ్రప్రదేశ్ లో ఓ వస్త్ర తయారీ కంపెనీ రంగులను తెలంగాణ నుంచి కొనుగోలు చేసిందనుకుందాం. ఈ సమయంలో సెంట్రల్ ఎక్సైజ్ సుంకంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో అమల్లో ఉన్న అమ్మకం పన్నును చెల్లిస్తుంది. వస్త్రాలను తయారు చేసిన తర్వాత వాటిని వివిధ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ కంపెనీ నుంచి సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ ను రాబడుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని పన్నులు కలిపి 30 శాతం వరకు మోత మోగుతోంది. పైగా గందరగోళం. ఏ వస్తువుపై ఎంత పన్ను అని అడిగితే చెప్పడానికి క్లారిటీ లేనంత అయోమయం ప్రస్తుత పన్ను చట్టంలో ఉంది.
అందుకే.. జీఎస్టీ వచ్చింది..
ఈ అయోమయానికి తెరదించుతూ... ఇక దేశవ్యాప్తంగా ఒక వస్తువు (ఉదాహరణకు ఏసీ లేదా ఫ్యాన్ ఇలా), ఒక సేవ (టెలికం సేవలు)పై ఒకటే పన్ను రేటు అమలవుతుంది. దీంతో గందరగోళం పోయి స్పష్టత ఏర్పడుతుంది. అందుకే ఒకటే దేశం, ఒకటే మార్కెట్, ఒకటే పన్ను... అదే జీఎస్టీ అని కేంద్రం చెబుతోంది.
జీఎస్టీ.. మూడు రకాలు..
సెంట్రల్ జీఎస్టీ(సీజీఎస్టీ), స్టేట్ జీఎస్టీ(ఎస్ జీఎస్టీ), ఇంటెగ్రేటెడ్ జీఎస్టీ(ఐ జీఎస్టీ) అని మూడు వర్గీకరణలు చేశారు. కేంద్రం స్థాయిలో పన్నులన్నీ సీ జీఎస్టీలో కలిసిపోతాయి. రాష్ట్రాల స్థాయిలో పన్నులన్నీ ఎస్ జీఎస్టీ పరిధిలోకి వస్తాయి. రెండు రాష్ట్రాలకు చెందిన సంస్థల మధ్య లావాదేవీలు ఐ జీఎస్టీ పరిధిలోకి వస్తాయి. ఒక వస్తువు లేదా సేవ ఓ రాష్ట్రంలో తయారై అదే రాష్ట్రంలో వినియోగమైతే దానిపై సీ జీఎస్టీ, ఎస్ జీఎస్టీ అమలవుతుంది. ఒక వస్తువు, సేవ ఒక రాష్ట్రంలో తయారై మరో రాష్ట్రంలో వినియోగమైతే (అంతర్రాష్ట్ర) అప్పుడు ఇంటెగ్రేటెడ్ జీఎస్టీ అమల్లోకి వస్తుంది. ఎగుమతులు చేసే వస్తు, సేవలకు జీఎస్టీ వర్తించదు. దిగుమతి చేసుకునే వస్తు, సేవలపై సీ జీఎస్టీ, ఎస్ జీఎస్టీ విధిస్తారు.
విక్రయ దశలోనే పన్ను...
జీఎస్టీలో ప్రతీ వస్తువు, సేవ ప్రతీ విక్రయ దశలోనూ పన్ను పడుతుంది. ఎలాగంటే తయారీదారుడు హోల్ సేలర్ కు విక్రయించినప్పుడు, హోల్ సేలర్ రిటైలర్ కు విక్రయించినప్పుడు... పన్ను చెల్లించాల్సి ఉంటుంది. నికరంగా ఈ పన్ను వినియోగదారుడు చెల్లించే ధరకు కలుస్తుంది. తయారీదారుడు, హోల్ సేలర్, రిటైలర్లు తాము చెల్లించిన ట్యాక్స్ ను ఇన్ పుడ్ ట్యాక్స్ క్రెడిట్ రూపంలో తిరిగి పొందొచ్చు. గతంలో ఈ అవకాశం లేకపోవడంతో పన్నుపై పన్ను భారం పడుతూ చివరికి వినియోగదారుడి వద్దకు వచ్చే సరికి పన్ను అధికమయ్యేది.
ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్...
జీఎస్టీ పన్నుల వ్యవస్థలో ఇదో అదనపు ప్రయోజనం. ఉదాహరణకు ఓ వ్యాపారి రూ.10 లక్షల పన్ను చెల్లించాడనుకుందాం. అందులో 40 శాతం అంటే రూ.4 లక్షలను ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ రూపంలో వెనక్కి పొందొచ్చు. ఇందుకోసం చట్టంలో ప్రత్యేకంగా ఒక క్లాజును కూడా చేర్చారు. అంటే ఈ మేరకు వినియోగదారులకు ధరల తగ్గింపు ప్రయోజనాన్ని బదిలీ చేయాలి. ఫలితంగా ధరలు తగ్గుతాయన్నది కేంద్రం వాదన.
ఎవరికి ఎలాగంటే...
ప్రస్తుతం వార్షికంగా రూ.7.5 లక్షల వ్యాపారమే కలిగి ఉన్న సంస్థలకు వ్యాట్ నుంచి మినహాయింపు ఉంది. అది దాటితే వ్యాట్ చెల్లించాలి. జీఎస్టీలో మాత్రం... వార్షికంగా రూ.20 లక్షలు దాటిన వ్యాపారులే పన్ను పరిధిలోకి వస్తారు. రూ.20 లక్షల లోపు వ్యాపారులు జీఎస్టీ గురించి ఆలోచించనక్కర్లేదు. ఇక ఈశాన్య రాష్ట్రలు, ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రల్లో మాత్రం ఈ పరిధి రూ. 10 లక్షలే. అంటే.. వార్షిక ఆదాయం రూ.10 లక్షలు దాటిన వ్యాపారులందరూ ఈ జీఎస్టీ పరిధిలోకి వస్తారన్నమాట.
ఇవీ ప్రయోజనాలు...
దేశవ్యాప్తంగా ఒకటే మార్కెట్. ఒక వస్తువుపై దేశవ్యాప్తంగా ఒకటే పన్ను. దీనివల్ల పన్ను చట్టం సులభతరం అవుతుంది. వ్యాపార వ్యయాలు తగ్గుముఖం పడతాయి. పారదర్శకత పెరుగుతుంది. ఎన్నో శాఖలతో అవసరం ఉండదు గనుక అవినీతి తగ్గుముఖం పడుతుందని భావిస్తున్నారు. గతంలో మాదిరిగా ఒక వస్తువుపై ఒక పన్ను కట్టిన తర్వాత, ఆ పన్నుపైనా పన్ను చెల్లించడం అన్నది ఇక ఉండదు. కేవలం ఒక వస్తువు, సేవను అమ్మేటప్పుడే పన్ను వసూలు చేస్తారు. రాష్ట్రాలు ఇప్పటి వరకూ వస్తువులపై పన్నును నిర్ణయించేవి. ఇకపై వాటి పెత్తనానికి చెల్లు. జీఎస్టీ మండలిదే అంతిమ నిర్ణయం. ఎగుమతి చేసే వస్తు, సేవలపై జీఎస్టీ ఉండదు గనుక వాటికి ప్రోత్సాహం లభిస్తుంది.
వినియోగదారులకు లాభమేనా?
నిజానికి ప్రస్తుతం మన దేశంలో చాలా రకాల ఉత్పత్తులపై ఎంత పన్ను చెల్లిస్తున్నామో వినియోగదారులకు తెలియని విషయం. ఏదైనా వస్తువు కొని బిల్లు తీసుకుంటే దానిపై వ్యాట్ తప్ప ఇంకేమీ కనిపించదు. మరికొందరు దీన్ని కూడా పేర్కొనరు. కానీ, ఎక్కువ శాతం ఉత్పత్తులపై 20 శాతానికి పైనే పన్ను చెల్లిస్తున్నాం. కానీ, జీఎస్టీలో అలా ఉండదు. కొన్నింటిపై అసలు పన్ను లేదు. కొన్నింటిపై 3 శాతం, కొన్నింటిపై 5 శాతం, కొన్నింటిపై 12, 18, 28 ఇలా వస్తు సేవలను బట్టి కేటగిరీలు చేశారు. దాదాపు 60 శాతం వస్తువులను 12 - 18 శాతం పన్నుల్లోనే చేర్చారు. దీంతో అవి చౌకగా మారతాయి. ముఖ్యంగా నిత్యావసర వస్తువుల బడ్జెట్ కొంత తగ్గుతుందని ప్రముఖ రిటైల్ సంస్థలు సైతం చెబుతున్నాయి. 19 శాతం వస్తువులను 28 శాతం పన్ను పరిధిలో చేర్చారు. వీటిలో కొన్ని ఇప్పటికే ఈ స్థాయిలో పన్ను ఉన్నవే. కొన్నింటి ధరలు మాత్రం పెరుగుతాయి. ఒక వస్తువు ఏ రాష్ట్రంలో అయినా దాదాపు ఒకటే ధరలో లభిస్తుంది. కానీ, ఒక రాష్ట్రంలో తయారైన వస్తువును మరో రాష్ట్రంలో విక్రయిస్తుంటే మాత్రం రవాణా వ్యయాల రూపంలో కొంచెం ఎక్కువ ఉండొచ్చు.
తొలుత తగ్గినా.. దీర్ఘకాలంలో..
జీఎస్టీ వల్ల ఆదాయం కోల్పోకుండా కేంద్రం పన్ను రేట్ల పరంగా సమతుల్యం చేసింది. అవ్యవస్థీకృత రంగంలోని వ్యాపారాలనూ పన్ను పరిధిలోకి తీసుకురావడం ద్వారా... అంటే పన్ను వ్యవస్థలో అందరినీ భాగం చేయడం ద్వారా పన్ను ఆదాయం పెంచుకోవాలన్న లక్ష్యమూ దాగుంది. కాకపోతే స్వల్ప కాలంలో జీఎస్టీ అమలులో అస్పష్టత, గందరగోళం కారణంగా కొంత ఆదాయం తగ్గినా, దీర్ఘకాలంలో పెరుగుతుందన్న అంచనాలున్నాయి. సామాన్యుడి పరంగా బడ్జెట్ భారం తగ్గుతుందని కేంద్రం చెబుతోంది. అయితే అది ఎంత వరకు అన్నది జీఎస్టీ అమలైన తర్వాతనే అనుభవంలోకి వస్తుంది.