సత్తా చాటిన తెలుగు విద్యార్థులు: రాష్ట్రపతి అవార్డుకు ఎంపిక
అమరావతి: తెలుగు విద్యార్థులు అరుదైన ఘనతను సాధించారు. గాంధియన్ యంగ్ టెక్నాలాజికల్ ఇన్నోవేషన్ సంస్థ ఏటా జాతీయ స్థాయిలో నిర్వహించే పోటీ పరీక్షకు అవనిగడ్డ ఒకటో వార్డుకు చెందిన పంచకర్ల సేవ్య నాగప్రియాంక, మరో ముగ్గురు తోటి విద్యార్థినులతో తయారుచేసిన ప్రాజక్టు రాష్ట్రపతి పురస్కారానికి ఎంపికైంది.
వివరాల్లోకి వెళితే... పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని శ్రీవిష్ణు ఇంజినీరింగ్ మహిళా కళాశాలలో ప్రియాంక మూడో సంవత్సరం బీటెక్ (ఈసీఈ) చదువుతోంది. ఈ పురస్కారాల కోసం దేశ వ్యాప్తంగా 3 నుంచి 4 వేల మంది వారు తయారుచేసిన ప్రాజక్టులను పంపించగా 43 మంది ఎంపికయ్యారు. వినికిడి లోపం ఉన్న వారికి ఏదైనా ఆపద వస్తే సహాయం కోసం ప్రియాంక మరో ముగ్గురు విద్యార్థినులు ఒక పరికరాన్ని తయారు చేశారు.
చేతి వాచ్లా ఉండే ఈపరికరం బటన్ నొక్కితే అదే పరికరం ఉన్న వారందరికి ఆవ్యక్తి ఆపదలో ఉన్నట్లు తెలిసి వెంటనే స్పందించి సహాయపడే అవకాశం ఉంటుంది. ఈ పరికరం మార్కెట్లో రూ.15వేలు పైగా ఉండగా.. వీరు తయారుచేసిన పరికరం ఖరీదు రూ.500 మాత్రమే కావడం గమనార్హం. దీంతో ఈ పరికరం రాష్ట్రపతి పురస్కారానికి ఎంపికైంది. మార్చి 19న ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రియాంక బృందం పురస్కారం అందుకోనుంది.
ఈ పురస్కారం అందుకున్న అనంతరం మరో రౌండు పోటీ కూడా ఉంటుందని, అందులో కూడా విజయం సాధిస్తే రూ.15 లక్షలు నగదు పురస్కారం వస్తుందని ప్రియాంక తెలిపారు. రాష్ట్రపతి పురస్కారం రావడం పట్ల ప్రియాంక తండ్రి పంచకర్ల సుబ్రహ్మణ్యం (మోటారు సైకిల్ మెకానిక్), తల్లి రజినీకుమారి(గృహిణి), సోదర ప్రియ ఆనందం వ్యక్తం చేశారు.