బంగ్లాతో మ్యాచ్: రెచ్చగొట్టే బ్యానర్లు, మదర్సా క్లోజ్..!
ఢాకా: బంగ్లాదేశ్లో భారత్ పర్యటనను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఈ పర్యటనలో ఎలాంటి అపశృతి చోటు చేసుకోకుండా ఆ బంగ్లా బోర్డు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. బంగ్లాదేశ్లో టీమిండియా ఒక టెస్టు, మూడు వన్డే మ్యాచ్లను ఆడనుంది.
టెస్టు మ్యాచ్ దేశ రాజధాని ఢాకాలోని ఫతుల్లా స్డేడియంలో జూన్ 10 నుంచి 14 వరకు జరగనుంది. భద్రతా కారణాల రీత్యా ఫతుల్లా స్డేడియానికి సమీపాన ఉన్న ఓ మదర్సాను ఐదు రోజులు మూసివేయనున్నారు.
ఈ మేరకు బీసీబీ సూచన మేరకు ఢాకా పోలీసులు మదర్సా పెద్ద మౌలానా అబ్దూస్ షాకూర్కు ఐదు రోజుల పాటు మదర్సాను మూసివేయాలని నోటీసులు జారీ చేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ధృవీకరించారు.
9 ఏళ్ల తర్వాత ఫతుల్లా స్టేడియంలో జరుగుతున్న టెస్టు మ్యాచ్ ఇదే కావడం విశేషం. 2006లో ఆస్టేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్కి ఆతిధ్యం ఇచ్చింది. ఇప్పటి వరకు ఈ స్టేడియంలో 10 అంతర్జాతీయ వన్డే మ్యాచ్లు జరిగాయి. అందులో ఐదు మ్యాచ్లు 2014లో జరిగిన ఆసియా కప్ లోనివే కావడం విశేషం.
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సెక్యూరిటీ చీఫ్ హుస్సేన్ ఇమామ్ మాట్లాడుతూ టీమిండియా ఆటగాళ్ల భద్రతా కారణాల రీత్యా ఐదు రోజుల పాటు మదర్సాను మూసివేయల్సిందిగా నోటీసులు జారీ చేశామని పేర్కొన్నారు.
ఇటీవలే ఐసీసీలో శ్రీనివాసన్, ముస్తఫా కమల్ల మధ్య నెలకొన్న వివాదం, వరల్డ్ కప్లో బంగ్లాపై విజయం సాధించిన టీమిండియా సెమీస్కు చేరడంతో టీమిండియా పట్ల ఆ దేశ క్రికెట్ అభిమానులు ఆగ్రహంతో ఉన్నారు.
దీంతో ఫతుల్లా స్టేడియంలో భారత్ వ్యతిరేక బ్యానర్లు, కార్టున్ల ప్రదర్శనను నిలిపివేస్తామని, అలాంటి వాటిని అనుమతించబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ముందుగానే ప్రకటించింది.