ఏపీ రాజధానిలో జస్టిస్ సిటీ ఎక్కడో తెలుసా?
అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో జస్టిస్ సిటీని ఏర్పాటు చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని పరిశీలించేందుకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దిలిప్ బాబాసాహెచ్ భోంస్లే వచ్చారు. శనివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఉద్దండరాయునిపాలెంలో ఉన్న అమరావతి పెవిలియన్ను తొలుత పరిశీలించారు.
అమరావతి చారిత్రక వైభవం గురించి నిర్వాహకుల ద్వారా తెలుసుకున్నారు. ఆ తర్వాత సుమారు అరగంట సేపు ఉద్దండరాయునిపాలెంలో గడిపిన జస్టిస్ భోంస్లే అక్కడి నుంచి నేరుగా ఐనవోలు, శాఖమూరు మధ్య ఏర్పాటుచేసిన శిబిరం వద్దకు చేరుకున్నారు. సీఆర్డీఏ అధికారులు సిటీ కోసం రూపకల్పన చేసిన ప్లాన్ను జస్టిస్ భోంస్లే పరిశీలించారు.
ఆ తర్వాత శాఖమూరు, ఐనవోలు, నేలపాడు గ్రామాల వివరాలను తెలుసుకున్నారు. ఇప్పటికే జస్టిస్ సిటీ కోసం 3 వేల ఎకరాలు అవసరమవుతుందని న్యాయమూర్తులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో శిబిరం వద్ద నుంచి మూడు వేల ఎకరాల స్థలం ఎంత విస్తీర్ణంలో ఉందనే విషయంపై జస్టిస్ భోంస్లే వాకబు చేశారు. సుమారు 3 నుంచి 4 కిలోమీటర్ల విస్తీర్ణంలో 3 వేల ఎకరాలు అందుబాటులో ఉంటుందని సిఆర్డిఎ అధికారులు వివరించారు.
జస్టిస్ భోంస్లేతో పాటు న్యాయమూర్తులు జి చంద్రయ్య, రమేష్ రంగనాథన్ తదితరులు స్థల పరిశీలన చేశారు. నేలపాడు రెవెన్యూ పరిధిలో జస్టిస్ సిటీకి సంబంధించిన స్థలాన్ని సీఆర్డీఏ అధికారులు చూపించారు. అక్కడి నుంచి మరలా ఉద్దండరాయునిపాలెం చేరుకున్నారు.
కృష్ణ, గుంటూరు జిల్లాల న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు జస్టిస్ భోంస్లేకు గౌరవవందనం చేశారు. గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్, రూరల్ ఎస్పి నారాయణ నాయక్, సిఆర్డిఎ అధికారులు తదితరులు న్యాయమూర్తులను కలిసి వివరాలు అందజేశారు.