బతుకమ్మ-దసరా ఎఫెక్ట్ : కిక్కిరిసిపోతున్న రైళ్లు, బస్సులు (ఫోటోలు)
హైదరాబాద్ : పండుగలు వచ్చాయంటే చాలు.. నగర జనం సొంత ఊరికి 'క్యూ' కట్టడం మొదలవుతుంది. అదీ.. వరుసపెట్టి పండుగులు, సెలవులు కలిసొస్తే.. ఇక ఆ రద్దీ మరింత కిక్కిరిసిపోతుంది. దసరా, పీర్ల పండుగ, దీపావళి.. ఇలా వరుస పండుగల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల జనాలంతా సొంత ఊళ్లకు పయనమవడంతో.. బస్టాండ్స్, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా తెలంగాణ సాంస్కృతికతకు అద్దం పట్టే
బతుకమ్మను ఇక్కడి ఆడపపడుచులంతా ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటారు. ఈ ఏడాది కూడా బతుకమ్మను సొంత ఊరిలో జరుపుకోవాలన్న ఉద్దేశ్యంతో చాలావరకు కుటుంబాలు పల్లె బాట పట్టాయి. దీంతో ఎక్కడ చూసినా.. ప్రయాణికుల రద్దీతో వాహనాలు కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. ఇక రైల్వేల సంగతి చెప్పనక్కర్లేదు. ఎక్కువ మంది జనం రైళ్ల మీదే ఆధారపడడంతో.. రైల్వే స్టేషన్లన్ని కిటకిటలాడుతున్నాయి.
వరుస సెలవులు.. కాలేజీలకు సెలవులు..
11వ తేదీన దసరా పండుగ.. ఆ మర్నాడే పీర్ల పండుగ.. దాదాపు 15 రోజుల పాటు విద్యార్థులకు సెలవులు దొరకడంతో.. నగరంలోని హాస్టల్స్ నుంచి ఇంటిబాట పట్టారు చాలామంది విద్యార్థులు. విద్యార్థుల తాకిడి కూడా ఎక్కువగా ఉండడంతో రైల్వే టికెట్ల కోసం గంటల తరబడి క్యూలో నిలుచోవాల్సిన పరిస్థితి. ప్రయాణికులతో పాటు స్టేషన్ కు వచ్చే బంధువులతో మరింత కిక్కిరిపోయి కనిపిస్తోంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్.
రద్దీ తగ్గించేందుకు ప్లాట్ ఫామ్ టికెట్ ధర పెంపు
ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్లాట్ ఫామ్ టికెట్ ధరను పెంచింది రైల్వే శాఖ. తద్వారా ప్రయాణికులతో పాటు స్టేషన్ కు వచ్చే బంధుమిత్రుల సంఖ్యను తగ్గించవచ్చనేది రైల్వే ఆలోచన. కాగా, పెంచిన చార్జీలతో రూ.10గా ఉన్న ప్లాట్ ఫామ్ టికెట్ ప్రస్తుతం రూ.20కు చేరుకుంది. ప్లాట్ ఫామ్ టికెట్స్ ధర పెంచి.. రైల్వే స్టేషన్ లో రద్దీని ఎంతవరకు నియంత్రించగలరన్నది అనుమానమే!.
జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది
రైల్వే స్టేషన్లలో రద్దీ ఎక్కువవుతున్న నేపథ్యంలో.. రైలు వచ్చి రాగానే వెంటనే ఎక్కేయాలని ఆరాటపడుతుంటారు చాలామంది ప్రయాణికులు. దీంతో ప్రయాణికుల మధ్య తోపులాటలు, వాగ్వాదాలు చోటు చేసుకునే అవకాశముంది. కాబట్టి.. ప్రయాణికులంతా కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తూ తమ ప్రయాణాలను కొనసాగించాల్సిన అవసరముంది.
ప్రైవేటు బాదుడు
ఇటు రైల్వేకు, అటు ఆర్టీసీకి ప్రయాణికులు పోటెత్తడంతో.. చాలామంది ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. అయితే ప్రైవేటు వాహనాదారులు మాత్రం దొరికిందే ఛాన్స్ అన్న తరహాలో.. అడ్డగోలుగా చార్జీలు వసూలు చేస్తూ అందినకాడికి జేబులో వేసుకుంటున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పండుగ సీజన్ ను క్యాష్ చేసుకునేందుకు.. ప్రయాణికుల ముక్కపిండి మరీ చార్జీలు వసూలు చేస్తున్నారు ప్రైవేటు వాహనాదారులు.