చంద్రబాబు ఆదేశాలు బేఖాతర్: బెంజి సర్కిల్ ఫ్లైఓవర్లు అంతే...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నగరం అమరావతి శివారులోని విజయవాడ నడిబొడ్డున ప్రతిష్ఠాత్మకంగా నిర్మాణం చేపట్టిన బెంజి సర్కిల్ ఫ్లైఓవర్ వంతెన అదనపు పనుల టెండర్లపై ప్రతిష్ఠంభన కొనసాగుతూనే ఉన్నది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నగరం అమరావతి శివారులోని విజయవాడ నడిబొడ్డున ప్రతిష్ఠాత్మకంగా నిర్మాణం చేపట్టిన బెంజి సర్కిల్ ఫ్లైఓవర్ వంతెన అదనపు పనుల టెండర్లపై ప్రతిష్ఠంభన కొనసాగుతూనే ఉన్నది. బెంజి సర్కిల్ పనులను దక్కించుకున్న కాంట్రాక్ట్ సంస్థ 'దిలీప్కాన్' ఇటీవల ప్రారంభించిన పనులను ముమ్మరంగా సాగిస్తున్నా, అదనపు పనులకు మాత్రం ఇంతవరకు అంచనాలే ఖరారు కాలేదు.
అధికారులు మాత్రం ఈపీసీ పద్ధతిలో టెండర్లు పిలవడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్యాకేజీలో భాగంగా కాంట్రాక్ట్ పొందిన సంస్థ మిగతా సగ భాగం నిర్మించేందుకు సరేనన్నది. ప్రస్తుతం ఐబీఎం ఇంతవరకు ఖరారు కాలేదని జాతీయ రహదారుల సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ సురేష్ అన్నారు.
అదనపు భాగానికి టెండర్ల ప్రక్రియపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే ఫ్లై ఓవర్ వంతెన నిర్మాణం జరుగుతున్న తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పచ్చదనం పెంచడానికి బదులుగా వృక్షాలు నరికివేయడానికి చర్యలు తీసుకున్న అధికారులను తప్పుబట్టారు.
బెజవాడలో బెంజి సర్కిల్కు ప్రత్యేక గుర్తింపు ఇలా
టెక్నాలజీ అందుబాటులో ఉన్న ప్రస్తుత తరుణంలో వృక్షాలను ఇతర ప్రాంతాల్లో తిరిగి నాటే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. బెంజి సర్కిల్ ఫ్లై ఓవర్ వంతెన త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. కానీ ఇంకా టెండర్ల దశలోనే రెండోభాగం ఉండటం గమనార్హం. కాంట్రాక్టు సంస్థకే రెండో బాగం పని అప్పగించాలనే వాదన కూడా ముందుకు తెస్తున్నారు. దీనిపై ఇంకా ప్రతిష్ఠంభన కొనసాగడంతో పనుల పూర్తిపై పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. విజయవాడలో బెంజి సర్కిల్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. దీంతో బెంజి సర్కిల్ స్వరూపం ఏమాత్రం చెడిపోకుండా జాతీయ రహదారిపై ఫ్లై ఓవర్ వంతెన ఏలూరు రోడ్డుకు నిర్మాణం చేయాలని సీఎం చంద్రబాబు ప్రతిపాదించారు. మొదట సాధారణ ఫ్లై ఓవర్ వంతెన ప్రతిపాదించి బందరు - విజయవాడ జాతీయ రహదారి విస్తరణ ప్యాకేజీలో చేర్చారు. దీనిపై సీఎం చంద్రబాబు సూచనలకు అనుగుణంగా వినూత్న ఆలోచనలతో సరికొత్త ఆకృతులను రూపొందించారు.
Recommended Video
కుంచించుకు పోనున్న సర్వీస్ రోడ్డు
ఉజ్జయనిలో మాదిరిగా ఇక్కడా వంతెన నిర్మాణానికి అధికారులు రూపొందించిన డిజైన్లకు సీఎం చంద్రబాబు ఆమోద ముద్ర వేశారు. జాతీయ రహదారికి పైభాగంలో రెండు వైపులా ఫ్లై ఓవర్ వంతెన రానున్నది. కింది నుంచి, పైనుంచి వాహనాలు వెళ్లేలా ఆకృతులు రూపొందించారు. రాష్ట్రంలో సరికొత్త తరహాలో నిర్మాణం చేసే వంతెనగా గుర్తింపు ఉంటుంది. ప్రస్తుత నిర్మాణాలను తొలగించకుండానే, భూసేకరణ అవసరం లేకుండానే బెంజి సర్కిల్ ఫ్లై ఓవర్ వంతెన నిర్మాణ పనులు ప్రారంభించడానికి జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) ప్రణాళికలు రూపొందించింది. సర్వీసు రోడ్లు 1.5 మీటర్ల చొప్పున కుదించుకుపోనున్నాయి. 2018 లక్ష్యంగా బెంజి సర్కిల్ ఫ్లైఓవర్ వంతెన పూర్తి చేయాలనేది ప్రభుత్వ నిర్ణయం. వచ్చే ఏడాది ఆగస్టు నాటికి ఈ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. కేవలం 18 నెలల్లో నిర్మాణం పూర్తి చేయాలని రాష్ట్ర సీఎం నారా చంద్రబాబునాయుడు ఆదేశించారు.
బెంజి సర్కిల్ వద్ద ఫ్లై ఓవర్ వంతెన తొలి ఆకృతి ఇలా
ప్రస్తుతం పాత టెండర్ ప్రకారం గుత్త సంస్థ పనులు ప్రారంభించింది. ఇటీవల మట్టి నమూనాలను పరిశీలించి పిల్లర్లకు పునాదులు తీస్తున్నారు. వారధి వైపు, ఏలూరు రోడ్డు వైపు ఈ పనులు చేపట్టారు. ట్రాఫిక్కు అంతరాయం లేకుండా ఈ పనులు జరుగుతున్నా, ట్రాఫిక్ సమస్య పెరిగింది. బెంజి సర్కిల్ ఫ్లై ఓవర్ వంతెన అదనంగా పొడిగించిన దానికి మళ్లీ ఈపీసీ పద్ధతిలో టెండర్లు పిలవడంలో జాప్యం జరుగుతోంది. ఒకవైపు పనులు జరుగుతుండగా మరోవైపు మిగతా భాగానికి ఈపీసీ పద్ధతిలో పనుల నిర్మాణం చేపట్టేందుకు టెండర్లను పిలుస్తామని అధికారులు చెప్పారు.
ఇంతవరకు టెండర్లను పిలవనందున వచ్చే 18 నెలల్లో ఈ పనులు పూర్తి కావడం అసాధ్యమని అంటున్నారు. తొలుత రూపొందించిన ఆకృతుల ప్రకారం బెంజి సర్కిల్ ఫ్లై ఓవర్ వంతెన 618 మీటర్లు మాత్రమే నిర్మాణం చేపట్టాలి. దీనికి రూ.82కోట్లు కేటాయించారు. ప్రస్తుతం ఆకృతుల ప్రకారం ఫ్లై ఓవర్ వంతెన నిర్మాణం 1.4 కిలోమీటర్ల దూరం నిర్మాణం చేస్తారు. జ్యోతిమహల్ నుంచి ఎగ్జిక్యూటివ్ క్లబ్ వరకు ఫ్లై ఓవర్ వంతెన నిర్మిస్తారు. అదనంగా 820 మీటర్లు పొడిగించారు. దీని నిర్మాణ వ్యయం దాదాపు రూ.100 నుంచి రూ.110 కోట్లు అవుతుందని అధికారులు అంచనా వేశారు. కొత్త ఆకృతుల ప్రకారం ఫ్లై ఓవర్ వంతెన రెండు భాగాలుగా ఉంటుంది. రాకపోకలకు విడిగా రెండు వంతెనలు సమాంతరంగా నిర్మిస్తారు. ఒక్క వంతెన మూడు వరసలతో నిర్మిస్తారు. అంటే మొత్తం ఆరు వరసల వంతెనగా నిర్మాణం ఉంటుంది. ఒకవైపు దాదాపు 7.5 మీటర్ల వరకు ఉంటుంది.
కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభించాకే బెంజి సర్కిల్ పనులు
ప్రస్తుతం మనుగడలో ఉన్న జాతీయ రహదారి యధావిధిగానే ఉంటుంది. వాస్తవానికి కనకదుర్గ ఫ్లై ఓవర్ వంతెన ప్రారంభించాక బెంజి సర్కిల్ పనులు ప్రారంభించాలని ప్రభుత్వ నిర్ణయం. కానీ నిర్మాణం జాప్యం అవుతోందని వచ్చే ఏడాది ఆగస్టు నాటికి బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్ వంతెన అందుబాటులోకి రావాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా అధికారులు పనులు ప్రారంభించారు. బెంజి సర్కిల్ ఫ్లై ఓవర్ వంతెన పనులు సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఎన్హెచ్ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్ సురేశ్ చెప్పారు. రెండో దశలో చేపట్టనున్న అదనపు పనులకు ఈపీసీ టెండర్లను పిలవాల్సి ఉన్నదని. అంచనాలు తయారు చేసే పనిలోనే ఉన్నామని తెలిపారు. త్వరలో ఐబీఎం పూర్తి చేసి టెండర్లను పిలుస్తామని, దీనిపై ఫీజబిలిటీ నివేదిక తయారు చేసే పనిలో ఉన్నామని వివరించారు.