బయో మెట్రిక్ ఎఫెక్ట్: కుష్టు రోగులకు అందని రేషన్
అమరావతి: కుష్టు రోగులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ బియ్యం అందడం లేదు. బయో మెట్రిక్ ద్వారానే రేషన్ బియ్యాన్ని సరఫరా చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. అయితే కుష్టు రోగులు చేతి వేలి ముద్రలను బయోమెట్రిక్ మెషిన్లు తీసుకోని కారణంగా రేషన్ దక్కడం లేదు.
2015 ఆరంభంలో బయోమెట్రిక్ పద్దతిని రేషన్ దుకాణాల్లో ప్రవేశపెట్టారు.బయో మెట్రిక్ మెషిన్లో వేలిముద్రల ఆధారంగానే రేషన్ దుకాణాల్లో లబ్దిదారులకు రేషన్ను అందిస్తారు.
ఆధార్ కార్డుల్లోని లబ్దిదారుల వేలిముద్రలతో బయోమెట్రిక్ ద్వారా వేలిముద్రలు సరిపోలితే రేషన్ అందిస్తారు.బోగస్ లబ్దిదారులకు రేషన్ అందకుండా ఉండేందుకు గాను ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. కానీ, కుష్టురోగులకు బయోమెట్రిక్ మెషిన్ వేలి ముద్రలను గుర్తించడం లేదు.
బయోమెట్రిక్ మెషిన్లలో వేలి ముద్రలను గుర్తించేందుకుగాను రోజుల తరబడి రేషన్ దుకాణాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.ఏపీ రాష్ట్రంలోని వందలాది మంది కుష్టురోగులు రేషన్ పొందాలంటే బయోమెట్రిక్ మెషిన్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
రేషన్ దుకాణాల ద్వారా ప్రతి ఒక్క లబ్దిదారుడికి ఐదుకిలోల బియ్యం, ఒక్క కిలో చక్కెరను అందిస్తారు. ఈ రేషన్ కోసం కుష్టురోగులు రేషన్ దుకాణలు వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
అయితే కుష్టు వ్యాధి నయం కావడానికి సుదీర్ఘ సమయం పట్టనుంది. అయితే ఈ వ్యాధిని నయం కావడానికి క్రమం తప్పకుండా మందులు వాడాల్సిందే.రేషన్ దొరకక కొందరు కుష్టు రోగులు బిక్షమెత్తుకొంటున్నారు.
ఏపీ రాష్ట్రంలో సుమారు 54 లెప్రసీ కాలనీల్లో నివాసం ఉంటున్న 1600 మంది కుష్టు రోగులు తమకు చట్టబద్దంగా దక్కాల్సిన హక్కులను కోల్పోతున్న విషయాన్ని ఏపీ కుష్టు రోగుల సంఘం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినట్టు ఆ సంఘం కార్యదర్శి చంద్రశేఖర్ చెప్పారు.
కుష్టురోగులను వికలాంగులుగా ఏపీ ప్రభుత్వ వైద్య విభాగం గుర్తించడం లేదని చంద్రశేఖర్ చెప్పారు. అవయవాలు కోల్పోవడం ఇతరత్రా వాటిని ప్రాతిపదికగా తీసుకొని వికలాంగులుగా గుర్తిస్గున్నట్టు చంద్రశేఖర్ గుర్తు చేశారు.
కొందరు కుష్టు రోగుల చేతులు సాధారణ మనుషుల చేతుల మాదిరిగానే కన్పిస్తాయి. కానీ, అవి పనిచేసే పరిస్థితులు కన్పించవన్నారు.వికలాంగులుగా కుష్టు రోగులను గుర్తించని కారణంగా ప్రభుత్వం ప్రతి నెల వికలాంగులకు ఇచ్చే రూ. వెయ్యి లేదా రూ. 1500 లు కూడ వీరికి దక్కడం లేదు.
2009 నవంబర్లో అంత్యోదయ అన్నా యోజన కింద కుష్టు రోగుల కుటుంబాలకు 35 కిలోల బియ్యాన్ని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. అయితే సుమారు 10 శాతం కుష్టు రోగుల కుటుంబాలకు మాత్రమే ఇది వర్తిస్తోందని చంద్రశేఖర్ చెప్పారు.అయితే కొన్ని చోట్ల విఆర్ఓల సహయంతో బయోమెట్రిక్ ద్వారా వేరిఫికేషన్ చేసిన తర్వాత రేషన్ను సరఫరా చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.