గెయిల్ ట్రాజెడీ: కారణం ఏమిటి? (పిక్చర్స్)
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా నగరం గ్రామంలో గ్యాస్ పైప్ లైన్ లీకేజీకి కారణం ఏమిటనేది అంతు చిక్కడం లేదు. గ్యాస్ లీకేజి అగ్నిప్రమాదాల ముందస్తు సమాచారాన్ని తెలిపే అలారం (స్పెన్సర్లు) వ్యవస్థ కోనసీంలో గెయిల్ పరిధిలోని పైపులైన్ల వద్ద ఏర్పాటు చేయలేదు. దాంతో ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టలేకపోయారని అనుకోవచ్చు. ఇది పెద్ద లోపంగా కనిపిస్తోంది.
అయితే, గ్యాస్ లీకైతే ప్రమాదం జరగకుండా నిరోధించే వ్యవస్థ ఉంది. అయినప్పటికీ ఈ ప్రమాదం జరగడానికి కారణం ఏమిటనేది తెలియడం లేదు. దర్యాప్తులో గానీ అసలు విషయం బయటపడదని అంటున్నారు. గ్యాస్ పైప్ లైన్పై నిరంతర పర్యవేక్షణకు సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్ (స్కాడా) కేంద్రాన్ని గెయిల్ సంస్థ నోయిడాలో ఏర్పాటు చేసింది.
అక్కడి నుంచే కేజీ బేసిన్ పైప్లైన్ను పర్యవేక్షిస్తుంది. పైపులైన్లో గ్యాస్ ఒత్తిడి, ఉష్ణోగ్రతలను ఇది అనుక్షణం రికార్డు చేస్తుంది. ఏదైనా ప్రాంతంలో ఉష్ణోగ్రత భారీగా పెరిగితే పేలుడు జరగే ప్రమాదం ఉంటుంది. పైప్లైన్ ఒత్తిడి తగ్గితే ప్రమాదం జరుగుతుందనడానికి సంకేతం.
ఎవరి తప్పిదానికో..
ప్రమాదాన్ని పసిగట్టే పర్యవేక్షణ యంత్రాంగం ఉన్నప్పటికీ భారీ ప్రమాదం సంభవించింది. ఎవరో చేసిన తప్పునకు నగరం ప్రజలు బలయ్యారు.
గంటల పాటు లీకేజీ
గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత కొన్ని గంటల పాటు లీకేజీ జరిగి ఉంటుందని, అందుకే మంటలు ఎక్కువ దూరం వ్యాపించాయని భావిస్తున్నారు.
ఎందుకు గుర్తించలేదు..
నోయిడాలోని స్కాడా ఎందుకు ప్రమాదాన్ని ముందుగానే గుర్తించలేకపోయిందనేది ఇప్పుడు సమాధానం దొరకని ప్రశ్నగా మిగిలింది.
లీకేజీ అవకాశాలు
గెయిల్ పైపులైన్ వాల్వుల వద్ద గానీ పైపులైన్ల పంపుల వద్ద గాని పగుళ్లు వస్తే లీకేజీకి అవకాశం ఉంటుంది.
తుప్పు పట్టే గుణం
పేలుడు గురైన పైప్ లైన్ 20 ఏళ్ల క్రితం వేసిందని సమాచారం. సాధారణంగా పైపులైన్ కాల పరిమితి 30 - 40 ఏళ్లు ఉంటుంది. కోస్తా ప్రాంతంలో ఇనుముకు తప్పు పట్టే గుణం అధికంగా ఉండడం వల్ల ఆ కాలపరిమతి తక్కువగా ఉంటుందని అంటున్నారు.
వాకబు చేశారు
నిరంతర పర్యవేక్షణ ఉన్నప్పటికీ శుక్రవారంనాటి ప్రమాదంపై ముందుగా ఎందుకు తెలుసుకోలేకపోయారనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు గెయిల్ చైర్మన్, ఒఎన్జిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో మాట్లాడారు.
ఏ ఆధునికతకు సంకేతం
గెయిల్ పైప్ లైన్ పేలి అగ్నికీలలు వ్యాపించి పచ్చని జీవితాలను బుగ్గి పాలు చేశాయి. ఏ ఆధునికాభివృద్ధికి ఇది సంకేతమని ప్రశ్నిస్తున్నారు.
ఈ దుఖ్కం ఆరేదా..
తూర్పు గోదావరి జిల్లాలోని నగరం గ్రామం బుగ్గిపాలైంది. పచ్చని జీవితాల్లో, ప్రకృతిలో గెయిల్ చిచ్చు పెట్టింది.
బైక్పై వెళ్తుంటే..
తెల్లవారు జామును బైక్పై వెళ్తున్న తండ్రీకూతుళ్లను గెయిల్ ప్రమాదం పొట్టన పెట్టుకుంది. బైక్ కాలిపోయి, రెండు జీవితాలు బుగ్గిలో కలిసిపోయాయి.
మరిచిపోని యాతన
ప్రమాదం నుంచి బయటపడినా ఆ బీభత్సం మనసులోంచి, జీవితాల్లోంచి తొలిగిపోతుందా.. ఆ దృశ్యాన్ని తలుచుకున్నప్పుడు మనిషి ఏ విధమైన భీతికి లోనవుతాడో..
ఏం నేరం చేశారని..
తాము ఏ నేరం చేశామని ఈ శాపం అని ప్రశ్నించేందుకు కూడా పరిస్థితి అవకాశం ఇవ్వడం లేదు. ప్రమాదం నుంచి బయటపడ్డామనేది ఊరటా, భయానకమా..