ఆశ్చర్యం: బాలిక కళ్ల నుంచి రాళ్లు
ఆదిలాబాద్: సాధారణంగా కళ్ల నుండి కన్నీళ్లు లేదా ఆనంద భాష్పాలు రావాలి. కానీ ఆశ్చర్యంగా చెన్నూర్ మండలం కాచనపల్లి గ్రామానికి చెందిన ఓ బాలిక కళ్ల నుంచి రాళ్లు వస్తున్నాయి. వివరాలిలా ఉన్నాయి. నగెరి సమ్మక్క-సమ్మయ్య దంపతుల కూతురు స్వర్ణలత కళ్ల నుంచి రాళ్లు వస్తుండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
ప్రస్తుతం స్వర్ణలత మూడవ తరగతి చదువుతోంది. ఇప్పటి వరకు స్వర్ణలతకు కళ్లకు సంబంధించిన ఎలాంటి వ్యాధీ లేదని, గత వారం నుంచి అదే పనిగా కళ్ల నుంచి రాళ్లు వస్తున్నాయని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. దీంతో సమీపంలోని అంగ్రాజ్పల్లి ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు.
వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యురాలు హైదరాబాద్లోని సరోజనీదేవి కంటి ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించినట్లు తల్లిదండ్రులు పేర్కొన్నారు. స్వర్ణలత కళ్లనుంచి 30 వరకూ రాళ్లు వచ్చాయని, ఎవరైనా ఆర్థికంగా తమ కుటుంబాన్ని సాయం చేసి, తమ కూతురికి వైద్యం అందించేందుకు తోడ్పాటు అందించాలని కోరారు.