నాలుగు దశాబ్దాల కాలంలో తగ్గిపోయిన హిందువుల జనాభా!
న్యూఢిల్లీ: మన దేశంలో గత కొంత కాలంగా హిందువుల జనాభా తగ్గిపోతుండటం గమనార్హం. నాలుగు దశాబ్దాల కాలంలో దేశంలో హిందువుల సంఖ్య పెరిగినా శాతం ప్రకారం చూస్తే దాదాపు మూడు శాతం తగ్గుదల ఉంది. మంగళవారం లోక్సభలో సభ్యుడు రాకేష్ సింగ్ అడిగిన ఓ లిఖితపూర్వక ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్రాజ్ ఆహిర్ ఈ మేరకు సమాధానమిచ్చారు.
1971లో 82.7 శాతంగా ఉన్న హిందువుల జనాభా 2011 నాటికి 79.8 శాతానికి తగ్గిందని చెప్పారు. ఈ కాలంలో తొలిసారి హిందువుల జనాభా శాతం తగ్గుదల నమోదు చేయడం గమనార్హం.
'1971 జనాభా లెక్కల ప్రకారం 45.33 కోట్లుగా ఉన్న వీరి సంఖ్య 2011 నాటికి 96.62 కోట్లకు చేరింది. 1971 గణాంకాల్లో సిక్కిం జనాభాను మినహాయించారు' అని కేంద్రమంత్రి తెలిపారు.
'1981లో అసోం, 1991లో జమ్మూకాశ్మీర్, 2001లో మణిపూర్లోని సేనాపతి జిల్లా మావో మారం, పావో మట, పురుల్ సబ్డివిజన్లలోని జనాభాను పరిగణనలోకి తీసుకోలేదు. ఆయా సంవత్సరాల్లో ఆ రాష్ట్రాలు, ప్రాంతాల్లో జనాభా లెక్కలు సేకరించలేదు' అని హన్స్రాజ్ అహిర్ వివరించారు.