హ్యాట్సాఫ్ క్యాబ్ వాలా: మోడీకి తెలిస్తే.. 'సలాం' కొట్టకుండా ఉండరేమో!
ముంబై : ఎక్కువ డినామినేషన్ నోట్ల రద్దు ప్రకటన సామాన్యులను ఎంతటి ఇక్కట్లకు గురిచేస్తుందో చూస్తూనే ఉన్నాం. కానీ కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల ఇబ్బందులు ఎదురవుతున్నా.. ఓపిగ్గా కేంద్రానికి సహకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది సామాన్యులు. ఇదే స్ఫూర్తితో ఎంతోమందికి ఆదర్శవంతంగా నిలిచాడు ఢిల్లీకి చెందిన విపిన్ అనే ఓ క్యాబ్ డ్రైవర్.
వియమేంటంటే.. ఢిల్లీ నివాసి అయిన విప్లవ్ అరోరా అనే వ్యక్తి మంగళవారం రాత్రి ఓలా క్యాబ్ బుక్ చేసుకున్నారు. అనంతరం క్యాబ్ ద్వారా రైల్వే స్టేషన్ కు బయలుదేరిన విప్లవ్.. తీరా అక్కడకు చేరుకున్నాక.. తనవద్ద రూ.500నోట్లు తప్ప చిల్లర డబ్బులు లేవన్న విషయాన్ని గుర్తించాడు. విప్లవ్ ఓలా ఖాతాలో కొంత డబ్బున్నా... మీటర్ అంతకన్నా ఎక్కువవడంతో.. చేతి నుంచి చెల్లించాల్సి వచ్చింది. దీంతో క్యాబ్ డ్రైవర్ కు ఏంచెప్పాలో తెలియక సతమతమయ్యాడు.
ఇంతలో క్యాబ్ డ్రైవరే పెద్ద మనసు చేసుకుని.. ' పర్లేదు సార్.. ఇది ప్రతీ ఒక్కరు ఎదుర్కొనే ఇబ్బందే ఇది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తూ.. మీరివ్వాల్సిన డబ్బును దేశ సంక్షేమం కోసం వెచ్చించాను అని భావిస్తున్నాను. మీరెళ్లండి సార్.. రైలు టైమ్ అవుతుంది' అంటూ బదులిచ్చాడు.
క్యాబ్ డ్రైవర్ పెద్ద మనసుకు చలించిపోయిన విప్లవ్ అరోరా.. సదరు క్యాబ్ డ్రైవర్ మంచితనం గురించి సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టడంతో.. అది మొత్తం దేశం దృష్టిని ఆకర్షించింది. అలా విషయం క్యాబ్ యాజమాన్యం దాకా వెళ్లడంతో.. విపిన్ వంటి డ్రైవర్ తో ఓలా సంస్థ పనిచేస్తున్నందుకు గర్వకారణంగా ఉందని వెల్లడించారు సంస్థ ప్రతినిధులు. విప్లవ్ అరోరా చెల్లించాల్సిన డబ్బును ఓలా యాజమాన్యమే చెల్లిస్తుందని ప్రకటించారు.
'సొంతం లాభం కొంతమానుకుని తోటివారికి సాయమందించవోయ్' అన్న రీతిన.. సొంత లాభాన్ని పక్కనబెట్టి మరీ కేంద్రం నిర్ణయానికి సహకరించిన ఈ క్యాబ్ డ్రైవర్ కు ప్రతీ ఒక్కరు సలాం చెబుతున్నారు. విషయం మోడీకి తెలిస్తే.. విపిన్ ను అభినందించకుండా ఉండరేమో!