.లాహిరి.. లాహిరిలో...: కృష్ణమ్మ ఒడిలో ఇంటి పడవ
అమరావతి: కృష్ణానదీ జలాల్లో ఇక ఇంటి పడవ (హౌస్ బోట్) తేలియాడనుంది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆదిశగా కసరత్తును ప్రారంభించింది. ఇప్పటి వరకు ఇంటి పడవలకు వేదికగా ఉన్న కేరళ పర్యాటకానికి ఏమాత్రం తీసిపోని రీతిలో పర్యాటక శాఖ కార్యదర్శి ముఖేష్కుమార్ మీనా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు.
ఆయా రంగాల అభివృద్దిలో ఉపాధి కల్పనకు పెద్దపీట వేయాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయిడు ఆకాంక్షలకు అనుగుణంగా ప్రత్యేకించి దళితుల స్వయం ఉపాధికి సైతం ఉపకరించేలా ఇది రూపుదిద్దుకుంటోంది.
ఇంటి పడవ ప్రతిపాదన
పర్యాటక రంగానికి ఆశాజనకమైన భవిష్యత్తు ఉండగా, తదనుగుణంగా సమాయత్తం కావాలని సీఎం పదేదపదే చెబుతున్న నేపథ్యంలో ఈ తాజా ప్రతిపాదన జీవం పోసుకుంది. గురువారం సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ టూరిజం అధారిటీపై పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముఖేష్కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటి పడవకు సంబంధించిన ప్రాజెక్టుపై మీనా స్పష్టత ఇచ్చారు.
పర్యాటకుల వినోదానికి...
విజయవాడ ప్రకాశం బ్యారేజ్ చెంతన నదీ జలాల్లో ఇంటి పడవలు పర్యాటకులకు మంచి అనుభూతిని ఇవ్వనుండగా, తొలి దశలో 15 పడవలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రతి పడవ ఏర్పాటుకు సుమారు రూ.కోటి వ్యయం కానుండగా, ఇందులో 15 శాతం ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్ధ సబ్సిడీగా అందించనుంది. ఎస్సి కార్పొరేషన్ కొంత మొత్తాన్ని సబ్సిడీ రూపంలో భరించేందుకు సూత్రప్రాయంగా అంగీకరించింది. మిగిలిన మొత్తాన్ని బ్యాంకుల నుండి రుణం సమకూర్చేలా పర్యాటక శాఖ కార్యాచరణ సిద్దం చేస్తోంది.
సాదారణ వ్యక్తులు సైతం...
అయితే సాధారణ వ్యక్తులు సైతం ఈ ఇంటి పడవలను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉండగా, వీరికి కూడా 15 శాతం ఎపిటిడిసి సబ్సిడీ వర్తిస్తుంది. మిగిలిన 85 శాతాన్ని స్వయంగా గాని బ్యాంకు రుణం రూపంలో గాని లబ్ధిదారులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎపిటిడిసి పర్యవేక్షించనుండగా అందుకు అవసరమైన అన్లైన్ టికెటింగ్, మార్కెటింగ్కు పర్యాటక శాఖ బాధ్యత తీసుకుంటుందని ఈ సందర్భంగా ముఖేష్కుమార్ మీనా తెలిపారు. లబ్ధిదారుల ఎంపికలో అనుభవానికి అత్యధిక ప్రాధన్యత ఇస్తామని, అదే క్రమంలో ఆదాయ భాగస్వామ్యం అవశ్యకత కూడా ఉంటుందన్నారు.
అంచనా వ్యయం ఇదీ..
అయితే ఇప్పటికే ఎపిటిడిసి ఇంటి బోటు ఏర్పాటుకు అవసమైన వ్యయాన్ని అంచనా వేయటం జరిగిందని, పడవ సామర్ధ్యం సౌకర్యాల ప్రాతిపదికన రూ.60 లక్షల నుండి కోటి ఇరవై లక్షల వరకు వ్యయం అవుతుందని, లబ్ధిదారులు ఏ బోటునైనా కొనుగోలు చేసుకోవచ్చని, సబ్సడీ మాత్రం కోటి రూపాయల ప్రాజెక్టుకు లోబడే ఉంటుందని ముఖేష్ కుమార్ మీనా వివరించారు. అటు సాంఘిక సంక్షేమ శాఖ, ఇటు ఎస్సి కార్పోరేషన్తో పర్యాటక శాఖ సంప్రదింపులు జరుపుతోందని, సాధ్యమైనంత త్వరగా ఇంటి పడవలను (హౌస్ బోట్) కృష్ణానదిలో నదీ విహారం చేయించాలన్నదే పర్యాటక శాఖ లక్ష్యమన్నారు.
సమీక్షా సమావేశంలో వారంతా..
సమీక్షా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ టూరిజం అధారిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి హిమాన్హు శుక్లా, ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ ఓఎస్డి లక్ష్మణ మూర్తి, గెల్లి ప్రసాద్, పర్యాటక అధికారులు మధుబాబు, ఎపిటిఎ అధికారులు డాక్టర్ రాజు, మురళీ కృష్ణ, ఉమాజ్యోతి తదితరులు పాల్గొన్నారు.