అద్దె ఇల్లు కావాలా బాబు?: కమిట్ అయ్యావో అంతే?, ఇదో భారీ దందా..
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ఇదో కొత్త రకం దందా. అద్దె ఇల్లు చూపిస్తామంటూ జేబులు ఖాళీ చేసే ముఠాలు ఇప్పుడు ప్రతీ కాలనీలో వెలిశాయి.
ఇంతకుముందు అద్దె ఇల్లు కోసం.. కాలనీల్లో వెతికితే ఇంటి ముందు 'టులెట్' బోర్డులు కనిపించేవి. ఇప్పుడా బోర్డులు కూడా లేకుండా చేస్తున్నారు. ఒకరకంగా తమను సంప్రదించినదే.. తమ జేబులు నింపనిదే ఎవరూ అద్దె ఇళ్లల్లో దిగవద్దు అనే రీతిలో వీరి దందా నడుస్తోంది.
ఏంటీ దందా?:
విద్యా, ఉపాధి కోసం నగరానికి వలస వచ్చే కుటుంబాలు, విద్యార్థులు చాలామందే ఉంటారు. వీరి 'అద్దె ఇల్లు' అవసరమే.. సదరు ముఠాలకు పెట్టుబడి. అద్దె ఇల్లు చూపిస్తామన్న వీరి ప్రకటనలకు ఆకర్షితులైతే జేబులు ఖాళీ చేసుకోవాల్సిందే.
అద్దె ఇంటి కోసం వీరిని సంప్రదించాలంటే.. ముందు రూ.300-రూ.500వరకు రిజిస్ట్రేషన్ ఫీజు సమర్పించుకోవాల్సిందే. వీళ్లే అంటే.. మధ్యలో ఇంకొందరు దళారీలు ఉంటారు. అద్దె ఇల్లు చూపించే ఏజెంట్ వద్దకు తీసుకెళ్తానంటూ రూ.300వరకు వసూలు చేసేవాళ్లున్నారు.
ఏం చేస్తారు?
ముందు రిజిస్ట్రేషన్ రూపంలో డబ్బులు వసూలు చేసే ఈ ఏజెంట్లు.. ఆ తర్వాత అద్దె ఇంటిని చూపించాక.. ఒక నెల అద్దెను తమ ఫీజుగా చెల్లించాలంటారు. పోనీ డబ్బులు తీసుకుని వీళ్లు మంచి ఇల్లు చూపిస్తారా? అంటే అదీ ఉండదు. ఏదో ఒక ఇల్లు చూపించేసి.. 'ఇక ఇంతకన్నా మంచిది దొరకదు బాస్..' అని ఒత్తిడి చేస్తారు. ఎలాగోలా ఒక నెల అద్దెను ముక్కుపిండి వసూలు చేస్తారు. ఈ ఏజెంట్ల వ్యవహారానికి ఆ ఇంటి యజమానికీ ఎలాంటి సంబంధం ఉండదు.
ఏజెంట్లు.. బ్రోకర్లు..:
ఏజెంట్ల తెలివి ఎలా ఉంటుందంటే.. ఒకే ఇంటిని పది మందికి చూపించి పది మంది వద్ద ఎంతో కొంత డబ్బు లాగుతారు. నిజానికి ఆయా వెబ్ సైట్లలో వీళ్లు పోస్ట్ చేసే ప్రకటనలు కూడా మోసపూరితంగా ఉంటాయి.
అన్నీ సౌకర్యాలు ఉండే ఇళ్లను కొన్నింటిని వెబ్ సైట్లలో పోస్ట్ చేస్తారు. అవే ఫోటోలను వేర్వేరు ఏరియాల పేరుతో.. వేర్వేరు సైట్లలో పెడుతారు. ఫోటోలు చూస్తే.. ఇల్లు భలే ఉందనిపిస్తుంది. కానీ తీరా వాళ్లను సంప్రదించాక..'హయ్యో.. ఆ ఇంట్లో నిన్నే వేరేవాళ్లు దిగిపోయారండి' అని కహానీలు చెబుతారు. ఆవిధంగా కస్టమర్ల నుంచి రిజిస్ట్రేషన్ ఫీజులు వసూలు చేసి పంపిస్తారు.
దారుణం అంటున్న ప్రజలు:
కేవలం అద్దె ఇల్లు చూపించినందుకే.. ఒక నెల అద్దెను చెల్లించాలని సదరు ముఠాలు డిమాండ్ చేయడం దారుణం అంటున్నారు ప్రజలు. పైగా.. ఆయా కాలనీల్లో యజమానులను బెదిరించి మరీ.. వీరు 'టులెట్' బోర్డులను తీసేయిస్తున్నారట.
ఇళ్ల ముందు టులెట్ బోర్డులు ఉంటే.. తమను సంప్రదించుకుండానే నేరుగా ఇంటి యజమానితో మాట్లాడుకుని అద్దెకు దిగేస్తున్నారని ఇలా చేస్తున్నారట. రోజురోజుకు హెచ్చు మీరుతున్న వీరి ఆగడాలపై ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు దృష్టి సారంచాలని ప్రజలు కోరుతున్నారు.