సియాచిన్లో 6 రోజులు: హనుమంతప్ప ఎలా బతికాడంటే?
19,600 అడుగుల ఎత్తయిన మంచు పర్వతం.. 35 అడుగుల మంచు.. మైనస్ 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, నిమిషాల్లో రక్తం గడ్డకట్టుకుపోయేంత చలి.. ఇవన్నీ సియాచిన్ గ్లేసియర్లో వాతావరణ పరిస్థితులు. 35 అడుగుల మంచు కింద ఆరు రోజుల పాటు సజీవంగా ఉండి ఆ తర్వాత ప్రాణాలతో లాన్స్నాయక్ హనుమంతప్ప బయటపడ్డాడు.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమిగా పేరుగాంచిన సియాచిన గ్లేసియర్లో హనుమంతప్ప సజీవంగా బయటపడటం వైద్యనిపుణులను, సైనికాధికారులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆరు రోజుల పాటు హనుమంతప్ప సజీవంగా ఉండటానికి కారణం ఏంటనేది ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది.
మంచులోని గాలిబుడగలే హనుమంతప్పను కాపాడాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు అతని నోరు, ముక్కు దగ్గర ఎయిర్ పాకెట్స్ను గమనించామని రెస్క్యూ ఆపరేషన్ అధికారులు తెలిపారు. మరోవైపు తాము పేరు పెట్టుకున్న హనుమంతుడే తన బిడ్డను కాపాడాడని హనుమంతప్ప తండ్రి అంటున్నారు.
సియాచిన్లో పోస్టింగ్ ఇచ్చే సైనికులకు కఠోర శిక్షణను ఇస్తారు. ఇప్పుడు అదే నిరంతర కఠోర వ్యాయామం, యోగ సాధన, ప్రాణాయామం బాగా అలవాటు ఉండటం వల్లే హనుమంతప్ప బయటపడినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ నెల 3న సియాచిన్ గ్లేసియర్ వద్ద 10 మంది సైనికులపై హిమాలయ కొండచరియల పైనుంచి కిలోమీటర్ ఎత్తు 800 మీటర్ల వెడల్పు ఉన్న మంచు పలక వచ్చి మీద పడింది.
దీంతో దీంతో వారంతా మరణించే ఉంటారని ప్రభుత్వమే ప్రకటించింది. కానీ.. ఆ పదిమంది మృతదేహాల కోసం సైన్యం చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్లో హనుమంతప్ప ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ఇప్పుడాయన కోమాలో ఉన్నారు. ఆయన పరిస్థితి ప్రస్తుతం తీవ్ర ఆందోళనకరంగా ఉందని.. ఆయన కాలేయం, మూత్రపిండాల పనితీరు దెబ్బతిందని, వెంటిలేటర్పై ఉన్నారని ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది.
అదృష్టవశాత్తూ ఆయన అవయవాలు ఫ్రాస్ట్ బైట్కు (మంచు వల్ల మొద్దుబారిపోవడం) గురి కాలేదని, ఇతరత్రా ఎలాంటి గాయాలు కూడా కాలేదని వివరించింది. 24 గంటల నుంచి 48 గంటలపాటు వైద్యుల పూర్తి పర్యవేక్షణలో సమగ్ర చికిత్స అందించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
హనుమంతప్పను మంచు కింద నుంచి బయటకు తీసేటప్పటికి ఆయన స్పృహలోనే ఉన్నారని కానీ, మగతగా అయోమయంగా ఉన్నారని రెస్క్యూ ఆపరేషన్ను నిర్వహించిన సైనికాధికారులు తెలిపారు. అప్పటికి ఆరు రోజులుగా మంచినీళ్లు, ఆహారం, ఆక్సిజన్ లేకపోవడంతో.. పూర్తిగా నీరసించిపోయారని, ఒంట్లో వేడి తగ్గి, చక్కెర నిల్వలు ఆందోళనకరస్థాయిలో పడిపోయాయని వివరించారు.
బయటకు తీసిన వెంటనే హనుమంతప్పకు గోరువెచ్చటి ఇంట్రావీనస్ ఫ్లూయిడ్స్ ఇచ్చారు. తేమతో కూడిన వేడి ప్రాణవాయువును అందజేశారు. అలాగే.. ఆయన శరీరంలో ఉష్ణోగ్రతను పెంచేందుకు శ్రమించారు. ప్రాథమిక చికిత్స అనంతరం హెలికాప్టర్ ద్వారా సియాచిన్ బేస్ క్యాంపునకు, అక్కడి నుంచి విమానంలో ఢిల్లీలోని ఆర్మీ అండ్ రిసెర్చ్ రిఫరల్ ఆస్పత్రికి తరలించారు.
కాగా మంగళవారం ప్రధాని మోడీ, ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ ఆస్పత్రికి వెళ్లి హనుమంతప్పను చూశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్న మోదీ.. హనుమంతప్పను విశిష్ట సైనికుడిగా అభివర్ణించారు. హనుమంతప్ప సహనాన్ని, అంతటి విపత్తుకూ భయపడని స్ఫూర్తిని మాటల్లో వర్ణించలేమన్నారు.
ఆయన కోలుకోవాల్సిందిగా ప్రార్థనలు చేయాలని దేశప్రజలకు పిలుపునిచ్చారు. దల్బీర్ సింగ్ సుహాగ్ కూడా హనుమంతప్ప ధైర్యసాహసాలను, ప్రకృతి ప్రకోపానికి లొంగని ఆయన దృఢ సంకల్పాన్ని సైన్యం తరఫున కొనియాడారు.
‘‘హనుమంతప్ప సంకల్పబలం, కష్టాలతో పోరాడిన అతడి ధైర్యం అందరికీ ఆదర్శం. అతడు తొందరగా కోలుకోవాలని ప్రజలందరితోపాటు నేనూ ప్రార్థిస్తున్నా'' అని రాష్ట్రపతి ప్రణబ్ తన సందేశంలో పేర్కొన్నారు. ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించడంతో హనుమంతప్ప చనిపోయాడని భావించి శోకసంద్రంలో మునిగిపోయిన ఆయన కుటుంబం ఆయన బతికే ఉన్నారన్న వార్త విని ఆనందంతో పొంగిపోయింది.
ఇది తమ కుటుంబం మొత్తానికీ పునర్జన్మలాంటిదని ఆయన భార్య మహాదేవి వ్యాఖ్యానించారు. ‘‘మావారు తన అమ్మమ్మ నుంచి స్ఫూర్తి పొందారు. ఆమె ప్రార్థనలే ఆయన్ను కాపాడాయి. ఇది మా అందరికీ పునర్జన్మలాంటిది'' అని ఆమె పేర్కొన్నారు. హనుమంతప్ప కోసం తమ ఊరివారంతా (ధార్వాడ జిల్లా కుందగోళ తాలూకా బేటదూర్ గ్రామం) ప్రార్థనలు చేస్తున్నట్టు తెలిపారు.
మంచు చరియలు విరగిపడిన పది మంది సైనికుల కోసం ఆర్మీ చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. ఈ ప్రమాదం బారిన పడిన పదిమంది సైనికుల్లో ఒకరి మృతదేహాన్ని సోమవారం వెలికితీయగా.. హనుమంతప్ప ప్రాణాలతో బయటపడ్డారు. మిగతా ఎనిమిది మంది మృతదేహాలనూ మంగళవారం వెలికితీసినట్టు ఆర్మీ తెలిపింది.