భాగ్యనగర కీర్తి కిరీటంలో మరో కలికితురాయి: ప్రతిష్ఠాత్మకంగా జీఈఎస్.. ఆపై తెలుగు సభలు సక్సెస్
అంతర్జాతీయంగా భాగ్యనగరానికి ఒక ప్రముఖ స్థానం ఉంది. ఈ ప్రయాణంలో హైదరాబాద్ నగరంపై 2017 చెరగని సంతకం చేసింది. అంతర్జాతీయంగా భాగ్యనగర ఖ్యాతి మరోసారి మారుమోగేలా చేసింది. గతనెల 28 నుంచి 3 రోజుల పాటు జరిగిన 'ప్రపంచ పారిశ్రామికవేత్తల ఎనిమిదో శిఖరాగ్ర సదస్సు (జీఈఎస్)' హైదరాబాద్లో విజయవంతంగా జరిగింది. దీనికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు, సలహా దారు ఇవాంక ట్రంప్, ప్రధాని నరేంద్రమోదీ తదితరులు హాజరయ్యారు.
Recommended Video
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక తొలిసారిగా ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహించింది. ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలు, ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సదస్సు, పురావస్తు, చారిత్రక అంశాలపై రెండు సదస్సులకూ హైదరాబాద్ వేదికైంది. కాకపోతే ఉస్మానియా శతాబ్ధి ఉత్సవాలు సంబురంగా మారి.. వివాదంగా ముగియడమే కాస్త ఇబ్బందికరం. ఇక వచ్చే ఏడాది మూడో తేదీ నుంచి ఉస్మానియా యూనివర్శిటీ వేదికగా జరుగాల్సిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 105వ సదస్సు.. శాంతిభద్రతల సాకుతో మణిపూర్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి తరలిపోవడం ఒకింత ఇబ్బందికరమే.
తెలంగాణ ఏర్పాటయ్యాక రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ఈ నెల 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించింది. 1975లో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన తొలి ప్రపంచ తెలుగు మహాసభలకు వేదికైన హైదరాబాద్లోని లాల్బహదూర్ క్రీడా మైదానమే ఈ సభలకూ వేదిక అయింది. తెలంగాణ తొలిసారిగా నిర్వహిస్తుండటంతో ఈ మహాసభలను తొలి ప్రపంచ తెలుగు మహాసభలుగానే పరిగణించారు. ఈ అక్షరాల పండుగకు 42 దేశాల నుంచి తెలుగువారు హాజరుకావడం గమనార్హం.
ఇంటర్ వరకు తెలుగు తప్పనిసరి చేసిన సీఎం కేసీఆర్
తెలుగు భాషలో విభిన్న సాహితీ ప్రక్రియలు తొలుత తెలంగాణ గడ్డ మీదే మొదలయ్యాయన్న విషయాన్ని ఆధారాలతో సహా ఈ సభలు సాహితీవేత్తల ముందుంచాయి. ఇక ఏటా రెండు రోజుల పాటు తెలుగు మహాసభలను నిర్వహిస్తామని, రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు తెలుగు భాష సబ్జెక్టును తప్పనిసరిగా అమలు చేస్తామని సీఎం కె.చంద్రశేఖర్రావు మహాసభల్లో ప్రకటించారు. కాకపోతే ఉమ్మడి రాష్ట్రంలో అత్యధిక కాలం సీఎంగా పని చేసిన ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఆహ్వానం అందిందా? లేదా? అన్న విషయం పక్కనబెడితే.. సంప్రదాయం ప్రకారం తెలుగు మహాసభలు కనుక ఆహ్వానించాల్సింది. తెలంగాణ సాహితీ అకాడమీ చైర్మన్ నంధిని సిద్ధారెడ్డి మహాసభలు ముగిసిన తర్వాత ఒక విషయం చెప్పారు. అన్నగారిగా పేరొందిన ‘ఎన్టీఆర్' ప్రస్తావనే తేకపోవడానికి ఆయన రాజకీయనాయకుడని చెప్పారు. నిజమే ఎన్టీఆర్.. రాజకీయంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని సవాల్ చేయడంలో కీలక పాత్రే పోషించారు. కానీ అంతకుముందు సినీ రంగంలో ప్రముఖ పాత్ర పోషించారే మరి. విమర్శల మాటెలా ఉన్నా.. సినీ నటుడిగా వివిధ పాత్రల్లో నటించే (పురాణ గాథలు) విషయంలో వాటి పూర్వాపరాలను ఔపోసన పట్టినట్లు వ్యవహరించే వారు. గంట గణగణ మోగినట్లు డైలాగ్ లు చెప్పేవారు. ఆ విషయాన్ని విస్మరించడం విజ్నులకు సరి కాదన్న అభిప్రాయం ఉన్నది.
అననుకూల వాతావరణం పేరిట సైన్స్ కాంగ్రెస్ వాయిదా
2017లో ఉస్మానియా విశ్వవిద్యాలయం రెండు భిన్న ఉదంతాలకు వేదికైంది. ఏప్రిల్లో ఉస్మానియా వర్సిటీ శతాబ్ది ఉత్సవాలు మూడు రోజుల పాటు ఘనంగా జరిగాయి. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ ముఖ్య అతిథిగా ఇందులో పాల్గొని ప్రారంభించారు. అయితే తెలంగాణ రాష్ట్ర సాధన స్వాప్నికుడిగా సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రసంగించకుండానే ఓయూ శతాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవం ముగియడం విచారకరం. అయితే ఉద్యోగాల నియామకం విషయమై ఉస్మానియా విద్యార్థుల్లో ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యతిరేకత ఉన్నదన్న విమర్శ ఉన్నది. దీన్ని చక్కదిద్దాల్సిన పాలకులే విస్మరిస్తున్నారా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక జనవరిలో ఇదే ఉస్మానియా ప్రాంగణంలో ప్రతిష్టాత్మక సైన్స్ కాంగ్రెస్ సదస్సు జరగాల్సి ఉంది. దానికి డిసెంబర్లోనే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. కానీ అక్కడ అనుకూల వాతావరణం లేదన్న కారణంతో సదస్సు వేదికను మణిపూర్కు మార్చడం చర్చనీయాంశమైంది. ఇక్కడా శాంతిభద్రతల అంశం ముందుకు వచ్చింది. ఇటీవల తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ‘కొలువుల కొట్లాట సభ'కు తరలి వెళ్లే వారిని ప్రత్యేకించి ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులపై పోలీసులు ఉక్కుపాదం మోపారని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ అంటే విద్యార్థుల్లో వ్యతిరేకత ఉన్నదని, సైన్స్ కాంగ్రెస్ నిర్వహణకు ఖచ్చితంగా గ్యారంటీ ఇవ్వలేమని ఓయూకు రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పడం... సదస్సు వాయిదా వేయాలని ఓయూ వినతి మేరకు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ (ఇస్కా) ముందు వాయిదా వేసి.. ఈ నెల 27వ తేదీన మణిపూర్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి మారుస్తూ నిర్ణయం తీసుకున్నది.
తెలంగాణ ప్రభుత్వానికి ఇవాంక ట్రంప్ కృతజ్ఞతలతో లేఖ
వాస్తవానికి దక్షిణాసియాలోనే తొలిసారిగా హైదరాబాద్లో జీఈఎస్ సదస్సు జరిగింది. ప్రతిష్టాత్మక సదస్సు నిర్వహణకు ఎన్ని నగరాలు పోటీపడ్డా చివరకు అమెరికా-నీతిఆయోగ్ హైదరాబాద్ నగరాన్నే ఎంపిక చేయటం భాగ్యనగర ప్రత్యేకతను చాటింది. ఇందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, వైట్హౌస్ సలహాదారు ఇవాంకా పాల్గొని హైదరాబాద్ అంటే టెక్నాలజీ, బిర్యానీ, గాజులకు ప్రసిద్ధి అని కీర్తించడం, రాష్ట్ర ఆతిథ్యాన్ని కొనియాడారు. అమెరికా వెళ్లిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ స్వదస్తూరీతో లేఖ రాయటం గమనార్హం. దేశ విదేశాలకు చెందిన 1,700 మంది పారిశ్రామికవేత్తలు, ప్రతినిధులు హాజరైన ఈ సదస్సును చిన్న లోపం లేకుండా నిర్వహించటం ద్వారా భవిష్యత్లో హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయి సదస్సులు నిర్వహించేందుకు సరైన ప్రాంతమన్న పేరు పొందింది. వ్యవసాయం, వాణిజ్యం, విద్య, వైద్యం, ఆరోగ్యం, క్రీడలు, జీవశాస్త్రాలు, డిజిటల్ ఎకానమీ, మీడియా, వినోదం... తదితర అంశాలపై విస్తృత చర్చలు జరిగాయి. సృజనాత్మక ఆలోచనలతో ముందుకొచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, అంకుర సంస్థలను ప్రోత్సహించాలని, అడ్డంకులు లేని మార్గాన్ని ఏర్పాటు చేయాలని ఈ సదస్సులో తీర్మానించారు.
రోడ్ల నిర్మాణంలో కొత్త పద్ధతులపై అర్ధవంత చర్చలు
భారత్లోని రహదారులు అంతర్జాతీయ ప్రమాణాలు అందుకోవాలంటే ఏం చేయాలన్న అంశంలో మేధో మథనానికి హైదరాబాద్ కేంద్రమైంది. హెచ్ఐసీసీలో ఇండియన్ రోడ్ కాంగ్రెస్ 77వ వార్షిక సదస్సు జరిగింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇందులో పాల్గొన్నారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో.. రోడ్ల నిర్మాణంలో అనుసరించాల్సిన కొత్త పద్ధతులు, అంతర్జాతీయంగా వస్తున్న మార్పు చేర్పులు, కొత్త పరిజ్ఞానం, మన్నిక, పర్యావరణ అనుకూల విధానం తదితర అంశాలపై చర్చలు, ప్రదర్శనలు జరిగాయి. రెండేళ్లకోసారి జరిగే బాలల చలన చిత్రోత్సవాలు ఈసారీ హైదరాబాద్లో ఘనంగా జరిగాయి. ప్రపంచ పర్యాటకుల దృష్టి తెలంగాణపై పడేలా, మన దేశంలో పర్యాటక రంగానికి విదేశీ హంగు అద్దేలా స్కాలా సదస్సు కూడా ఇక్కడ జరిగింది.
వెలుగులోకి తెలంగాణ చారిత్రక ప్రత్యేకతలు
మానవ మనుగడ మూలాలు, చరిత్రకు సాక్ష్యాలను, తార్కాణాలను చూపేది పురావస్తు విభాగం. తెలంగాణ గడ్డ ప్రపంచంలోనే గొప్ప ప్రత్యేకతలకు నిలయంగా ఉందని నిరూపించే పలు చారిత్రక ఆధారాలు ఈ ఏడాది బయటపడ్డాయి. ఇక హైదరాబాద్లో చారిత్రక, పురావస్తు అంశాలపై రెండు అంతర్జాతీయ స్థాయి సదస్సులు జరిగాయి. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో రాష్ట్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఒక సదస్సు, పర్యాటక భవన్ ప్లాజా హోటల్లో బుద్ధవనం ఆధ్వర్యంలో మరో సదస్సు నిర్వహించారు. వీటికి అంతర్జాతీయ నిపుణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ పరిధిలోని పలు చారిత్రక ప్రత్యేకతలు వారి ముందుకు వచ్చాయి. ఫలితంగా అంతర్జాతీయంగా ఇక్కడి ప్రత్యేకతలకు కొంత ప్రచారం ఏర్పడింది. ఒకప్పుడు ఈ ప్రాంతం బౌద్ధానికి కేంద్రమన్న ఆధారాలు చాటేందుకు ఈ సదస్సులు వేదికయ్యాయి. ‘జీఈఎస్' నిర్వహణ సందర్భంగానూ, ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగానూ హైదరాబాద్ నగర పరిసరాలు, చుట్టుపక్కల జిల్లాల్లో పర్యాటక రంగ అభివ్రుద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకున్నది.