తొలి భారతీయుడు: భయంకరమైన అగ్నిపర్వతాన్ని అధిరోహించిన హైదరాబాదీ
హైదరాబాద్: నగరానికి చెందిన పెద్దినేని సాయితేజ(25) ఇండోనేషియాలోని బాలీ ద్వీపంలో ఉన్న 'గునుంగ్ అగుంగ్' అగ్నిపర్వతాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించారు. సముద్ర మట్టానికి తొమ్మిది వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ అగ్నిపర్వత్వాన్ని జనవరి 10న అధిరోహించారని సాయితేజ తండ్రి నాగేశ్వర్రావు తెలిపారు.
సుమారు 48 గంటల సమయంలోనే అధిరోహించినట్లు వివరించారు. ఎలాంటి సహాయకులు, శిక్షకుల సహకారం లేకుండానే పర్వతారోహణ చేశారని తెలిపారు.
తొలి భారతీయుడిగా..
గతేడాది మేలో ఇండోనేషియాలోని దుకోనో అగ్నిపర్వతాన్ని సాయితేజ అధిరోహించి.. తొలిసారి ఆ పర్వతాన్ని అధిరోహించిన భారతీయుడిగా నిలిచాడని వెల్లడించారు. సొంతంగానే ఈ సాహసయాత్ర చేపట్టారని, ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నామని సాయితేజ తండ్రి వివరించారు.
డుకోనో భయంకరమైన అగ్నిపర్వతం
కాగా, తొలిసారి అగ్ని పర్వతాన్ని అధిరోహించిన సందర్భంగా సాయితేజ మీడియాతో మాట్లాడుతూ.. ‘డుకోనో భయంకరమైన క్రియాశీల అగ్నిపర్వతం. ఇందులో లావా బాంబులు పేలుతూనే ఉంటాయి. డుకోనోపై సైంటిఫిక్ డేటా అంతగా దొరకలేదు. ఎందుకంటే ఇది ఇండోనేషియాలోనే మారుమూల ప్రాంతంలో ఉంటుంది ' అని అన్నారు.
ఆ భయాన్ని పోగొట్టుకునేందుకే..
తనకు లావా అంటే భయమని, ఆ భయాన్ని పోగొట్టుకునేందుకే తాను ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. డుకోనోను అధిరోహించడం అంత తేలికైన పనేం కాందని సాయితేజ వెల్లడించారు. ఎంతో జాగ్రత్తగా ఈ పర్వతాన్ని అధిరోహించాల్సి ఉంటుందని, ఏ మాత్రం పొరపాటు జరిగినా ప్రాణాలకే ముప్పు అని చెప్పారు. ఎంతో జాగ్రత్తగా ఇక్కడి చిత్రాలను కెమెరాల్లో బంధించామని చెప్పారు.
సాహసాలంటే ఇష్టం
తనకు సాహసాలు చేయడమంటే ఇష్టమని, 11ఏళ్ల నుంచే ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలిపారు. బీటెక్లో చేరి ఆ తర్వాత డ్రాపౌట్ అయినట్లు తెలిపారు. తనకు ఇతర విషయాలపై ఆసక్తి ఉన్నట్లు చెప్పారు. తాను టెక్ అనలిస్టుగా కూడా విధులు నిర్వహించినట్లు తెలిపారు. అంతేగాక, ఓ ఔత్సాహిక కంపెనీని కూడా స్థాపించినట్లు చెప్పారు. ఐటీలో చేసిన సేవకు గానూ తనకు ఏపీ సీఎం చంద్రబాబు రూ.లక్ష చెక్కును కూడా అందించినట్లు తెలిపారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటతోపాటు ఇతర కొత్త ప్రాంతాలను సందర్శించినట్లు సాయితేజ చెప్పారు. తన సాహసయాత్ర కొనసాగుతుందని చెప్పారు.