ప్రపంచకప్: యువీ రొట్టె విరిగి నేతిలో పడేనా?
ముంబై: ఐసిసి వన్డే ప్రపంచ కప్ పోటీల్లో ఆడేందుకు యువరాజ్ సింగ్కు ఇంకా అవకాశం జారిపోలేదనే మాట వినిపిస్తోంది. జట్టుకు ఎంపికైన క్రీడాకారుల్లో కొంత మంది గాయాల పాలు కావడం, ఇతరత్రా కారణాల వల్ల దూరంగా ఉండాల్సి రావడంతో యువరాజ్ సింగ్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రపంచ కప్ పోటీలకు ముందు ఓపెనర్ రోహిత్ శర్మ, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, పేసర్లు ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్ గాయాల పాలు కావడంతో యువీ ఫ్లయిట్ ఎక్కే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ముక్కోణపు సిరీస్లో ధోనీసేన ఘోరంగా విఫలం కావడం టీమిండియా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. ఈ నేపథ్యంలో బిసిసిఐ జట్టు ఎంపికను తిరిగి సమీక్షించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.
గాయాల పాలైన నలుగురు ఆటగాళ్లకు ఈ నెల 7న ఫిట్నెస్ పరీక్ష నిర్వహించనున్నారు. 15న పాకిస్థాన్తో జరిగే తొలి లీగ్ మ్యాచ్లోపు వీరు కోలుకునే అవకాశం లేకపోతే వీరిస్థానంలో వేరే ఆటగాళ్లను తీసుకునే అవకాశం ఉండవచ్చు. భుజం గాయంతో బాధపడుతున్న జడేజా ఫిట్నెస్ సమస్యను ఎదుర్కోవచ్చుననే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆల్రౌండర్గా జట్టుకు ఎంపికైన జడేజా ఫిట్నెస్ను నిరూపించుకోకపోతే యువరాజ్ ఎంట్రీకి మార్గం ఏర్పడుతుంది. ప్రస్తుతం యువీ కూడా రంజీ ట్రోఫీలో మూడు సెంచరీలు చేసి మంచి ఫామ్లో ఉండడం ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తోంది
మురళీ విజయ్ కావాలని జట్టు ఎంపిక సమయంలోనే ధోనీ కోరినా, సెలెక్టర్లు అందుకు తిరస్కరించారు. అయితే ఇప్పుడు రోహిత్ శర్మ కండరాల గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో అతని స్థానంలో ఓపెనర్గా విజయ్కు పిలుపొచ్చే అవకాశం లేకపోలేదు. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్లో విజయ్ కనబరిచిన ఫామ్ అందుకు దోహదం చేయవచ్చు.
చీలమండ గాయంతో బాధపడుతున్నఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ ప్రపంచకప్కు దాదాపుగా దూరమైనట్టేనని తెలుస్తోంది. ట్రై సిరీస్లో చివరి లీగ్ మ్యాచ్లోనూ ఇషాంత్ ఆడకపోవడం బట్టి చూస్తే అతని గాయం ఇంకా తీవ్రంగానే ఉందని అర్థమవుతోంది. ఇషాంత్ ఫిట్నెస్ పరీక్షలో విఫలమైతే అతని స్థానంలో మోహిత్ శర్మ, ధవళ్ కులకర్ణిలలో ఒకరిని ఆడిస్తారు. అందుకే వీరిద్దరినీ ఫిట్నెస్ పరీక్ష జరిగే 7వ తేదీ వరకు ఆస్ట్రేలియాలోనే ఉండాల్సిందిగా మేనేజ్మెంట్ ఆదేశించింది.